breaking news
MondayMotivation
-
వైరల్: ఈ అమ్మాయిని చూసి... అడవి ముచ్చటపడింది!
పిల్లలు ఇష్టంగా చదువుకుంటుంటే పెద్దలే కాదు ప్రకృతి కూడా ముచ్చటపడుతుంది. నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది! ‘నిద్ర సుఖం ఎరగదు’ అంటారు. విద్య కూడా అంతే! ఏసీ గదులలో, మెత్తని సోఫాలలో కూర్చుని చదివితేనే చదువు వస్తుందని ఏమీ లేదు. ఇలా ఎండలో, రాళ్లపై కూర్చొని చదువుకుంటే కూడా చదువు వస్తుంది. అదంతా మన ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. విషయంలోకి వెళితే... హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక అమ్మాయి ప్రకృతి ఒడిలో పాఠ్యపుస్తకం చదువుకుంటున్న ఫోటో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. ‘మన్డే మోటివేషన్స్’ ట్యాగ్లైన్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఇన్స్పిరేషనల్ పోస్ట్ నెటిజనులను బాగా ఆకట్టుకుంది. మొదట ఈ ఫోటోను ట్విట్టర్ యూజర్ అభిషేక్ దూబే పోస్ట్ చేశాడు. ‘ఈరోజు నేను హిమాచల్ద్రేశ్లోని సత్నా ప్రాంతానికి వెళ్లాను. అక్కడ చూసిన ఒక దృశ్యం నన్ను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఒక అమ్మాయి శ్రద్ధగా చదువుకుటోంది. నోట్స్ రాసుకుంటోంది. పచ్చటి ప్రకృతి ఆమెను దీవిస్తున్నట్లుగా ఉంది. నిజం చెప్పాలంటే... ఈ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు దొరకడం లేదు’ అంటూ రాసి మురిసిపోయాడు దూబే. ఇక యూజర్ల కామెంట్స్లోకి వెళితే... ‘పట్టణ రణగొణ ధ్వనుల మధ్య కాకుండా, ప్రకృతి అందాల మధ్య ప్రశాంత, నిశ్శబ్ద వాతావరణంలో చదువుకుంటున్న ఈ బాలిక ఎంత అదృష్టవంతురాలో’ అన్ని రాశాడు ఒక యూజర్. దీనికి స్పందనగా మరో యూజర్ ఇలా రాశాడు... ‘చక్కగా చెప్పారు. నా వ్యక్తిగత విషయం రాస్తాను. మా అమ్మాయి పుస్తకం పట్టుకోగానే ఇంట్లో టీవీ ఆఫ్ చేస్తాం. చిన్నగా మాట్లాడుకుంటాం. కానీ ఏం లాభం. ఇరుగింటి నుంచి పొరుగింటి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. వెళ్లి వాళ్లతో గొడవ పడలేము కదా! ఆ రకంగా చూస్తే ఈ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు’ ‘శబ్దకాలుష్యం మితిమీరి పోతుంది. అది ఏదో ఒక రూపంలో మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు అయితే ఈ శబ్దకాలుష్యాన్ని భరించలేక అడవిలోకి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయికి అలా పారిపోవాల్సిన అవసరం లేదు. తాను ప్రకృతిలోనే ఉంది’ అని రాశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఒక యూజర్. ‘నిజానికి పిల్లలకు నాలుగు గోడల మధ్య కాకుండా పచ్చటి ప్రకృతి మధ్యే విద్య నేర్పించాలి. ఇలా చేస్తే వారికి ప్రకృతి విలువ తెలుస్తుంది. పర్యావరణ స్పృహ బాల్యం నుంచే కలుగుతుంది. గోడలు లేని బడిలో మనసు విశాలం అవుతుంది. తాత్విక విద్యావేత్తలు ఇదే విషయాన్ని చెప్పారు’ అంటుంది ఒక యూజర్. ‘పెద్దల పోరు భరించలేక చదువుకుంటున్నట్లు కాకుండా... చాలా ఇష్టంగా చదువుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి అమ్మాయిలే భవిష్యత్లో గొప్ప విజయం సాధించగలరు’ అని స్పందించాడు మరో యూజర్. ‘ఒక చిత్రం వంద మాటల సారాంశం’ అంటారు. ఈ చిత్రం మాత్రం బాలికల చదువు నుంచి కాంక్రిట్ జంగిల్లో విద్యావిధానం, పర్యావరణం... మొదలైన ఎన్నో అంశాలను చర్చలోకి తెచ్చింది. -
జాక్వెలిన్ ఎందుకలా చేసింది?
ఎవరైనా పోటీలో ఎందుకు పాల్గొంటారు? గెలవడానికే కదా! మరి జాక్వెలిన్ అలా చేసిందేంటి? డీహైడ్రేట్ అయిపోయి దాదాపు పరుగెత్తలేకపోతున్న పోటీదారుడికి మంచినీళ్లు అందించింది. అంతేనా, అతను మళ్లీ పుంజుకునే వరకూ వెన్నంటి ఉంది. ఫలితంగా రేసులో ఓడిపోయింది. ఫస్ట్ ప్రైజ్ ద్వారా వచ్చే డబ్బుతో బతుకు చక్కదిద్దుకోవచ్చని.. ఎక్కడో కెన్యా నుంచి వచ్చి చైనాలో ఓడిపోయింది. కానీ మనిషిగా గెలిచింది. మానవత్వాన్ని గెలిపించింది. ఏమైనా లాభం ఉదంటారా? కెన్యాకు చెందిన జాక్వెలిన్ నైతెపీ కిప్లిమో.. చాలా మంది ఆఫ్రికన్ అథ్లెట్లలాగే పేదరికంలో పుట్టింది. కఠోరమైన దైనందిన జీవితమే వాళ్లను కఠినంగా.. ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేధించగల బాణాలుగా తయారుచేస్తుంది. అప్పటికే మారథాన్ రన్నింగ్ రేసుల్లో పలు విజయాలు సాధించిన జాక్వెలిన్.. 2010లో చైనాలో జరిగిన జెంగ్ కయి అంతర్జాతీయ మారథాన్ పోటీలో పాల్గొంది. జెంగ్షూ నగరంలో ఆ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అథ్లెట్లు పాల్గొంటారు. మొత్తం 42 కిలోమీటర్ల రేసు. దివ్యాంగులు సైతం పెద్ద సంఖ్యలో పోటీ పడే రేసు ఇదే కావడం గమనార్హం. కళ్లులేనివాళ్లు కుక్కల సాయంతో నడవొచ్చు లేదా పరుగెత్తొచ్చు. అలా నాటి పోటీ ప్రారంభమైన చాలా సేటికి.. జాక్వెలిన్ పక్కగా చేతులు లేని చైనీస్ రన్నర్ ఒకరు పరుగెత్తాడు. కొద్దిసేపటి తర్వాత ఒంట్లో నీరంతా చెమటగా బయటికెళ్లడంతో అతను డీ హైడ్రేట్ అయిపోయాడు. ఇది గమనించిన జాక్వెలిన్ ట్రాక్ పక్కనే ఉంచిన మంచినీళ్ల బాటిల్ ను తీసుకుని, అతనికి అందించింది. మొండి చేతులతో నీళ్లు తాగిన ఆ చైనీస్ రన్నర్ కాస్త కుదుటపడ్డాడు. మళ్లీ దాహం వేస్తే అతనికి నీళ్లెవరు అందిస్తారు? అందుకే 28 కిలోమీటర్లు అతనితోపాటే పరుగెత్తింది జాక్వెలిన్! పోటీ చివరిదశలో తప్పక ఒంటరిగా.. వేగంగా పరుగెత్తింది. కానీ రేసులో గెలవలేకపోయింది. రెండో స్థానంతో సరిపెట్టుకుంది. చాలా మంది ఉద్యోగులు అసహ్యించుకునే సోమవారాన్ని ఉల్లాసభరితంగా మార్చే క్రమంలో కొందరు నెటిజన్లు ట్విట్టర్ లో #MondayMotivation పేరుతో తమను ఇన్ స్పైర్ చేసిన, తెలిసిన స్ఫూర్తిదాయక వ్యక్తుల గురించి పోస్టులు పెడుతుంటారు. అలా ఆగస్టు 31న హర్ష్ జియోంకా అనే వ్యక్తి జాక్వెలిన్ కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. 'జాక్వెలిన్.. ఓ సంచలన స్ఫూర్తి' అంటూ మిగతవారు ఆమెకు జేజేలుకొడుతూ సోమవారంనాడు స్ఫూర్తిదాయకంగా గడిపారు.