breaking news
MLA Shivarama Raju
-
‘ఆయన సాక్షిగా.. నీ నిజస్వరూపం బయటపెడతా’
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే శివరామరాజు తీరును విమర్శిస్తూ టీడీపీ నాయకుడు కళ్లేపల్లి సతీశ్ రాజు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాలు... ఎమ్మెల్యే తీరుతో విసుగు చెందిన వెలివర్రు గ్రామానికి చెందిన సతీశ్ రాజు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉండి నియోజకవర్గ కార్యకర్తలను శివరామరాజు తన ఆర్థిక అవసరాల కోసం తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పేరంటాలమ్మ ఆలయ చైర్మన్గా ఉన్న సమయంలో ఆలయ పునర్నిర్మాణం చేసి అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా తనను తొలగించి ప్రత్యర్థులకు చైర్మన్ పదవి కట్టబెట్టడం సమంజసమా అని ప్రశ్నించారు. బీసీ నాయకులను శివరామరాజు చులకనగా చూస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్న సతీశ్ రాజు.. అమరావతిలో చంద్రబాబు నాయుడు సాక్షిగా.. ఆంధ్ర ప్రజల ముందు శివరామరాజు నిజ స్వరూపం బయటపెడతానని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ‘జనతా గ్యారేజ్’ బ్యానర్లు
ఉండి ఎమ్మెల్యే శివరామరాజు వైఖరిపై నిరసన పాలకోడేరు : మహాప్రభో.. మా ఊరి కన్నీటి గాథలు వినరా?.. అక్రమార్కులకు అండగా నిలుస్తారా?.. ఇచ్చిన హామీలు నెలబెట్టుకోరా? ఇదేనా సంక్షేమ పాలన? అంటూ వేండ్ర గ్రామస్తులు జనతా గ్యారేజీ పేరుతో నిరసన బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు వ్యతిరేకంగా కొంతమంది గ్రామస్తులు ఈ విధంగా నిరసన ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే శివరామరాజు శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి నిరసనగా కొంతమంది వ్యక్తులు జనతా గ్యారేజ్ పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. గ్రామ ప్రజల ఆరాధ్యదైవమైన గుబ్బల మంగమ్మ ఆలయానికి ఎదురుగా మద్యం షాపును ఏర్పాటు చేసి తమ ఖ్యాతేంటో నిరూపించుకున్నారు.. గతంలో పది బస్తాల బియ్యం అక్రమంగా తరలిస్తుండగా రేషన్ డీలర్ను పట్టుకుని అధికారులకు అప్పగిస్తే సదరు డీలర్పై ఏ విధమైన చర్యలు లేకుండా తిరిగి విధులు అప్పగించారంటూ ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీ అనుమతి లేనిదే అర్హులైన వారికి కార్పొరేషన్ రుణాలు ఇప్పించరా? మీ మనుషులకే ముట్టచెప్పుకుంటారా? అంటూ ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల పదవులపై, పరిశ్రమల కాలుష్యం, శ్మశానవాటిక ఆక్రమణలు, మంచినీటి సరఫరా తదితర సమస్యలను బ్యానర్లలో ప్రస్తావించారు. బ్యానర్లను చూసి టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి వెనక్కు తగ్గారు.