breaking news
Ministries split
-
పవన్కు ‘పంచాయతీ’.. లోకేశ్కి విద్య, ఐటీ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఈ నెల 12వ తేదీన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదాతో పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.నారా లోకేశ్కు విద్యా శాఖ (మానవ వనరుల అభివృద్ధి)తోపాటు ఐటీ శాఖ కేటాయించారు. గతంలోనూ ఆయన ఐటీ శాఖ నిర్వహించారు. కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్కు కీలక శాఖలు లభించాయి. రాజధాని వ్యవహారాలు మళ్లీ నారాయణే! పాయకరావుపేట నుంచి గెలిచిన టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ప్రాధాన్యమైన హోంశాఖ దక్కింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రభుత్వంలో తొలిసారిగా దళిత మహిళకు హోంమంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. తొలిసారి మేకతోటి సుచరిత, రెండోసారి తానేటి వనితకు హోంశాఖ ఇచ్చి సామాజిక న్యాయం, మహిళా సాధికారతను చాటుకున్నారు. ఇప్పుడు అదే బాటలో సీఎం చంద్రబాబు దళిత మహిళకు హోంశాఖ ఇచ్చారు. ఇక పీఏసీ ఛైర్మన్గా పని చేసిన పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ లభించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చురుగ్గా వ్యవహరించిన నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖను అప్పగించారు. రేపల్లె నుంచి మూడోసారి గెలిచిన అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖ బాధ్యతలు కేటాయించారు. పొంగూరు నారాయణకు మళ్లీ మున్సిపల్ శాఖ దక్కింది. 2014–19 మధ్య మున్సిపల్ శాఖ మంత్రిగా రాజధాని వ్యవహారాలన్నింటినీ ఆయన చక్కబెట్టారు. ఇప్పుడు మరోసారి అదే శాఖ ఇవ్వడంతో రాజధాని కార్యకలాపాలు నారాయణే నిర్వహిస్తారని స్పష్టమవుతోంది. బీజేపీ తరఫున గెలిచి మంత్రివర్గంలో చేరిన సత్యకుమార్కు వైద్య, ఆరోగ్య శాఖ అప్పగించారు. జనసేనకు చెందిన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్కి పౌరసరఫరాల శాఖ కేటాయించారు. శాఖల్లో స్వల్ప మార్పులు కొత్త ప్రభుత్వం కొలువుదీరాక శాఖల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ, డ్వాక్రా వ్యవహారాలకు సంబంధించి ‘సెర్ప్’ను పంచాయతీరాజ్ శాఖ నుంచి విడదీసి చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి పరిధిలోకి తెచ్చారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ విభాగాలు సాధారణంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి. తాజాగా వాటిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి అప్పగించారు. పరిశ్రమల శాఖను రెండుగా విభజించి భారీ పరిశ్రమలు–వాణిజ్యం ఒకరికి కేటాయించగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మరొకరికి అప్పగించారు. ఇక విద్యా శాఖ పేరును మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. స్కిల్ డెవలప్మెంట్ శాఖను ఎవరికీ కేటాయించకపోవడం గమనార్హం. ఈ శాఖలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల వ్యవహారాల్లోనే విపక్షంలో ఉండగా చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయం విదితమే. సాంఘిక సంక్షేమం పరిధిలో సచివాలయాలు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి అప్పగించడం చర్చనీయాంశమైంది. ఐదేళ్ల క్రితం కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాటైంది. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం, 50 నుంచి 70 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున నియమించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు ఇంటి వద్దే పౌర సేవలు, పథకాలు అందించడం తెలిసిందే. 1.21 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.65 లక్షల మందిని వలంటీర్లుగా నియమించింది. ఈ వ్యవస్థను ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి అప్పగించడంతో దానికి అనుబంధంగా నిర్వహిస్తారని చెబుతున్నారు. సచివాలయ వ్యవస్థలోనూ భారీ మార్పులు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. శాఖల కేటాయింపు ఇలా.. -
గౌతమ్రెడ్డి శాఖలు ఇతర మంత్రులకు కేటాయింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. -
AP: ఇద్దరు మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలను మంత్రి బుగ్గనకు అప్పగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇకపై ఎక్సైజ్శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గెజిట్ను విడుదల చేశారు. చదవండి: (బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!) -
రెండుగా చీలిన మంత్రులు: చంద్రబాబుకు తలనొప్పి
ఏపి రాజధాని విషయంలో ప్రతిపక్షం నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా, స్వపక్షంలో విభేదాలు తలెత్తడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా తయారైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ నెల 4వ తేదీ గురువారం శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపి కూడా స్వాగతించింది. అయితే ముందుగా చర్చ జరగకుండా ప్రకటించిన విధానం సరిగాలేదని విమర్శించింది. ఎటువంటి వివాదాలకు తావులేకుండా రాజధాని ప్రకటన జరిగిపోయిందని అనుకుంటున్న తరుణంలో అధికారపక్షానికి చెందిన మంత్రులలోనే విభేదాలు వచ్చాయి. సీఎం విజయవాడ పరిసర ప్రాంతాలలో అని చెప్పి వదిలివేశారు. ఎక్కడ? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు. విజయవాడకు 41 కిలో మీటర్ల దూరంలో నూజివీడు, 40 కిలో మీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలోని అమరావతి, 15 కిలో మీటర్ల దూరంలో మంగళగిరి ఉన్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు వైపు రాజధాని విస్తరించాలని కొందరు మంత్రులు పట్టుబడుతున్నారు. మరికొందరు గుంటూరు జిల్లా మంగళగిరి వైపు విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మంగళగిరివైపు కావాలని కోరుతుండగా, సిఎం రమేష్ నూజివీడు వైపు ఉండాలని కోరుతున్నారు. ఈ విషయంలో మంత్రులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. రాజధానిపై మంత్రులు అందరూ ఒకే మాట మాట్లాడమని చెప్పినప్పటికీ, ఇప్పుడు మంత్రులు ఈ విధంగా చీలిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చికాకు కలుగుతోంది. దానికి తోడు తనకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, సిఎం రమేష్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఆయన తల పట్టుకొని కూర్చున్నారు. **