Mining mafia issues
-
అక్రమ మైనింగ్లో పేలుడు పదార్థాల వినియోగం
సాక్షి,దాచేపల్లి/గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని కేసానుపల్లి, నడికుడి, పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్ కోసం టీడీపీ నాయకులు భారీగా పేలుడు పదార్ధాలను సరఫరా చేశారు. ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా పేలుడు పదార్ధాలను తరలించారనేది జగమెరిగిన సత్యం. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన అక్రమమైనింగ్లో సున్నపురాయిని వెలికితీయటం కోసం భారీగా పేలుడు పదార్ధాలను ఉపయోగించారు. టీడీపీ నేత బత్తుల రాంబాబుతో పాటుగా మరికొంతమంది నాయకులు పేలుడు పదార్ధాలను అక్రమ మైనింగ్ పనులకు తరలించి కోట్లకు పడగలెత్తారు. యరపతినేని సహకారంతో రాంబాబు అడ్డూఅదుపులేకుండా మైనింగ్లో పేలుళ్లకు ఉపయోగించే అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, ఓడీ(ఆర్డినరీ డిటోనేటర్లు) తదితర పదార్ధాలను తరలించారు. దీనిపై అప్పట్లో పనిచేసిన పోలీస్ అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవటంతో టీడీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఇప్పటివరకు అక్రమ మైనింగ్ వ్యవహారంపై దృష్టి పెట్టిన అధికారులు సున్నపురాయి వెలికితీసేందుకు ఉపయోగించిన పేలుడు పదార్ధాలు, వీటిని సరఫరా చేసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2009 నవంబర్ 16వ తేదీన నారాయణపురంలో ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్ధాలు పేలి 15 మంది మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ఇంత భారీస్థాయిలో పేలుడు పదార్ధాలు సరఫరా చేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చర్చనీయాంశమైంది. యథేచ్ఛగా పేలుడు పదార్ధాల సరఫరా టీడీపీలో బడా నేతగా చెలామణి అవుతున్న బత్తుల రాంబాబు మాట గత టీడీపీ ప్రభుత్వంలో వేదవాక్కు. రాంబాబు తండ్రి నరసింహారావు అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో గత టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఐదేళ్లపాటు నిరంతరాయంగా జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా సుమారుగా 96 లక్షల టన్నుల సున్నపురాయిని తవ్వి తీశారు. దీనిపై ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహరంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయటంతో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అక్రమమైనింగ్ ద్వారా తవ్వి తీసిన 96 లక్షల టన్నుల సున్నపురాయిని ఎలా తీశారనే దానిపై విచారణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఎన్ని టన్నుల రాయిని తీశారు. సున్నపురాయిని వెలికి తీయటం కోసం ఎన్ని టన్నుల అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, ఫీజు వైర్లతో పాటుగా ఇతర పేలుడు పదార్ధాలను ఉపయోగించారనే దానిపై విచారణ జరగలేదు. టీడీపీ నేత రాంబాబుతో పాటుగా మరికొంతమంది టీడీపీ నాయకులు అక్రమంగా క్వారీల్లో సున్నపురాయిని బయటకు తీయటం కోసం బ్లాస్టింగ్ చేసేందుకు ఉపయోగించే అమోనియం, డిటోనేటర్లు, సేఫ్టీ ఫ్యూజు, జిలెటిన్ స్టిక్స్లను నడికుడితో పాటుగా ఇతర గ్రామాల్లో జరిగే క్వారీ పనులకు తరలించారు. పట్టపగలే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పేలుడు పదార్ధాలను తీసుకువచ్చి క్వారీల్లో బ్లాస్టింగ్ జరిపించేవారు. క్వారీల్లో సున్నపురాయి వెలికితీయటం కోసం సుమారుగా 8వేల టన్నుల అమోనియం నైట్రెట్ వాడినట్లు సమాచారం. ఇవికాక భారీస్థాయిలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, ఫ్యూజ్ వైర్లు కూడా భారీగానే ఉపయోగించారు. లైసెన్స్ కలిగిన బ్లాస్టర్, శిక్షణ పొందిన మేట్ లేకుండానే బ్లాస్టింగ్ చేశారు. క్వారీల్లో రోజువారీగా పనిచేసే కూలీలతోనే భారీ బ్లాస్టింగ్లు చేయించారు. భారీ బ్లాస్టింగ్ ప్రభావంతో సమీప నివాస గృహాలు దెబ్బతిన్నాయి. కొంతమంది కూలీలు కూడా బ్లాస్టింగ్ సమయంలో గాయపడినా ఆ విషయాలు బయటకు రాకుండా చేశారు. అధికారుల చర్యలు శూన్యం టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమమైనింగ్ వ్యవహారంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. మార్కెట్లో, నివాస గృహాల్లో కొద్దిమొత్తంలో అమోనియం నైట్రేట్, జిలెటిన్ స్టిక్స్, ఫ్యూజ్ వైర్లు దొరికితే హడావుడి చేసి కేసులు పెట్టే పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను తరలిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పేలుడు పదార్ధాలను సరఫరా చేసే టీడీపీ నేతలను కనీసం పిలిచి హెచ్చరించక పోగా వారికి రాచమర్యాదలు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా అక్రమ మైనింగ్ వ్యవహరంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకారం తెలపటం సంచలనం కలిగించింది. అక్రమ మైనింగ్ చేసిన వ్యక్తులతో పాటుగా పేలుడు పదార్ధాలను సరఫరా చేసిన వ్యక్తులపై కూడా చర్యలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా అక్రమమైనింగ్ , పేలుడు పదార్ధాల సరఫరా వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
సుజయ్కు సవాళ్లే!
⇔ మైనింగ్ చుట్టూ మాఫియా వివాదాలు ⇔ బోడికొండ... బడేదేవరకొండపై గిరిజనుల అభ్యంతరాలు ⇔ చీపురుపల్లి పరిసరాల్లో లెక్కలేనన్ని అక్రమాలు ⇔ నివురుగప్పిన నిప్పులా బాక్సైట్ వ్యవహారం ⇔ అన్నిచోట్ల ప్రభుత్వ పెద్దల జోక్యం ⇔ ముందుకెళ్లడంపైనే అనుమానాలు అనుమతులు ఒకచోట... మైనింగ్ చేస్తున్నది మరో చోట. పార్వతీపురం మండలంలో గల బడేదేవర కొండ మైనింగ్పై వస్తున్న ఆరోపణలివి. ఇప్పుడీ కోణంలోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సైతం అందుకు సహకరిస్తున్నారని, జరిగిన తప్పిదాన్ని గుర్తించకుండా కప్పిపుచ్చేందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కోరి గ్రామంలో సర్వే నంబర్ 1లో గల 16.56హెక్టార్లను 20 సంవత్సరాలకు చెన్నైకి చెందిన ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు లీజుకివ్వగా, ఇప్పుడా సంస్థ ములగ గ్రామంలో సర్వే నంబర్ 1లో గల రిజర్వు ఫారెస్టు భూముల్లో మైనింగ్ చేస్తున్నదని హైకోర్టులో పిల్ పడింది. దీనిపై ఇప్పటికే హైకోర్టు సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది. పార్వతీపురం మండలంలోని బుదురువాడ పంచాయతీలో గల బోడికొండపై 10హెక్టార్లలో గ్రానైట్ తవ్వుకునేందుకు పొకర్నా అనే కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ 135హెక్టార్ల కోసం 18 దరఖాస్తులొచ్చాయి. కానీ, అందులో పొకర్నా కంపెనీకి మాత్రమే ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గ్రానైట్ కంపెనీలకు అనుమతులివ్వడంపై ఇక్కడి గిరిజన గ్రామాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ♦ జిల్లాలోని చీపురుపల్లి, మెరకముడిదాం, గరివిడితో పాటు ఎస్కోట, కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇక్కడొక మాఫియా నడుస్తోంది. అనధికార తవ్వకాలతో పాటు అక్రమ రవాణా చేస్తున్నారు. రూ. కోట్లలోనే పక్కదారి పడుతోంది. ♦ అరకు పార్లమెంట్ పరిధిలోని కొండలపై బాక్సైట్ గనులపై ప్రభుత్వ పెద్దలు కన్నేసి ఉంచారు. గిరిజనులను ఏదోఒక విధంగా మాయ చేసి దోపిడీ చేసేందుకు తహతహలాడుతున్నారు. గిరిజన ఎమ్మెల్యేలు అడ్డు తగలకుండా ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే ప్రతిపక్ష పక్షానికి చెందిన ఎమ్మెల్యేను పార్టీలోకి లాక్కున్నారు. మిగతా ఇద్దరు లొంగకపోవడంతో బాౖక్సైట్ వ్యూహం బెడిసికొట్టింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: భూగర్భ... గనుల శాఖ మొత్తం వివాదాల మయం. ఇందులో ప్రతీ అంశంలోనూ పెద్దల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ శాఖకు తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణరంగారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఈ పోర్టుపోలియో ఆయనకొక సవాల్ కాక తప్పదు. గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండా... సర్కారుకు అనుకూలంగా... జిల్లాకు నష్ట కలగకుండా కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిందే. దీనిపై ఈయన వ్యూహం ఎలా ఉంటుందన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక్కడ విలువైన గనులు కొట్టేయాలని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు కంపెనీల ముసుగులో అడ్డగోలుగా దోపిడీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. వారి విషయంలో తాజా మంత్రి ఎలా స్పందిస్తారన్నదే ప్రశ్నార్థకం. రగులుతున్న బోడికొండ, బడేదేవరకొండ వ్యవహారం జిల్లాలో వివాదస్పదమైన బోడికొండ, బడేదేవరకొండలో అరుదైన ‘కాశ్మీరీ వైట్ గ్రానై ట్’ ఉంది. విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న క్వాలిటీ గల గ్రానైట్పై రాష్ట్రంలోని పెద్ద పెద్ద గ్రానైట్ కంపెనీలు దృష్టి సారించాయి. అందులో భాగంగా బోడికొండపై ఉన్న 135హెక్టార్ల కోసం 18దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పొకర్నా అనే కంపెనీకి మాత్ర మే 10హెక్టార్ల భూముల్లో గ్రానైట్ తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని అక్కడి గిరిజన గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బోడికొండ నుంచి వచ్చిన నీటితో ఆ పంచాయతీలోని గోచెక్క, బుదురువాడ, బొడ్డవలస, సంగందొరవలస, టేకులోవ, బిత్తరటొంకి తదితర గ్రామాల్లోని 1000 ఎకరాల వ్యవసాయ భూములు సాగవుతున్నాయనీ, ఈ కొండపై ఉన్న వెదురుతో 1000 గిరిజన కుటుం బాలు, ఉపాధి పొందుతున్నాయని, గ్రానైట్ తవ్వకాల వల్ల అటు సాగునీటి వనరులు అందకుండా పోతాయనీ, వెదురు సంపద ధ్వంసమవుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలా అనుమతులిస్తారని పాలకులను, అధికారులను నిలదీస్తున్నారు. మైనింగ్ కోసం లైన్ క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. ఉద్రిక్తతకు దారితీస్తున్న బడేదేవరకొండ గిరిజనుల ఆరాధ్యదైవమైన బడి దేవరకొండ దేవత వెలిసిన భూముల్ని లీజు రూపంలో అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులొక చోట ఇస్తే తవ్వకాలు మరో చోట చేస్తున్నారని, అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. బడిదేవర కొండ గ్రానైట్ కోసం 2009లో ఎంఎస్పీ గ్రానైట్ సం స్థ దరఖాస్తు చేసుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులిచ్చేందు కు ఆసక్తి చూపలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ సంస్థ తెరపైకి వచ్చింది. 2014జూన్ 26వ తేదీన సర్వే జరిపి సుమారు 16.56హెక్టార్లు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది జూన్ 22వ తేదీన ఏకంగా అనుమతులిచ్చింది. ఇక్కడి గిరిజనులు బడేదేవర కొండ దేవతను పూజిస్తేనే వర్షాలు పడతాయని నమ్ముతారు. ఆ కొండ వాగుల నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు పొందుతున్నారు. దీనిని మైనింగ్ కోసం లీజుకివ్వడంతో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీని అనుమతుల వెనుక సీఎంకు సన్నిహితంగా ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం ఉందనే ప్రచారమూ ఉంది. దీనికి అడ్డొస్తున్నారన్న కారణంగానే రాజధాని స్థాయిలో స్కెచ్ వేసి ఓ అధికారిని బలిపశువును చేశారు. 2006లో బడిదేవరకొండ గ్రానైట్ తవ్వుకోవడానికి అనుమతి కోరిన ఆమదాలవలసకు చెందిన వ్యక్తిని కూడా రంగంలోకి దించారు. ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు ఇచ్చిన మాదిరిగానే తమకూ అనుమతులు ఇవ్వాలని లోపాయికారీగా ప్రయత్నిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా బాక్సైట్ వివాదం బాక్సైట్ వ్యవహారం కూడా సీరియస్గా ఉంది. గిరిజనులతో ముడిపడి ఉన్నవే. వీటిన్నింటిని సానుకూలంగా పరిష్కరిస్తారా? లేదంటే ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లోనై గిరిజనుల ప్రయోజనాలకు దెబ్బతీస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలతో అంతగా సత్సంబంధాలు లేని మైనింగ్ శాఖ వచ్చినప్పటికీ దానిచుట్టూ వివాదాలు ఉండటం సుజయకృష్ణ రంగారావుకు కాసింత సవాల్గానే చెప్పుకోవాలి.