breaking news
Migratory people
-
గల్ఫ్ కార్మికులకు తీపి కబురు
కరోనా వైరస్ మహమ్మారి సకల జీవితాలనూ మార్చేసింది. అది కాటేయడం మొదలెట్టినప్పటి నుంచీ సమాజంలోని అన్ని వర్గాలూ ఏదో మేరకు ఇబ్బందులు ఎదుర్కొంటూనే వున్నాయి. పొట్ట గడవడానికి గ్రామసీమల నుంచి నగరాలకూ, పట్టణాలకూ వెళ్లిన లక్షలాదిమంది వలస జీవులు ఈ కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి, గూడు సైతం కరువై, పూట గడవడం అసాధ్యమై స్వస్థలాలకు వెళ్తుండటం ఇప్పటికీ నిత్యం కనబడే దృశ్యం. స్వదేశంలోని వలస జీవుల స్థితే ఇంత అధ్వాన్నంగా వుంటే గల్ఫ్ దేశాలకెళ్లినవారి వెతలేమిటో చెప్పనవసరమే లేదు. తమ ఉపాధి పోయిందని, యజమానులు తమను వీధుల్లోకి నెట్టారని, అర్ధాకలితో బతుకీడుస్తున్నామని కనీసం నెలరోజులనుంచి వలస జీవులు ఆక్రోశిస్తున్నారు. అక్కడ దాదాపు కోటిమంది భారతీయులున్నారని అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిలో 2 లక్షలమందిని తరలించవలసి రావొచ్చునని మూడు రోజులక్రితం కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వెనక్కి తిరిగి రాదల్చుకున్న కార్మికులెందరో డేటా రూపొందించాలని అక్కడి మన దౌత్య కార్యాలయాలను మంగళవారం కోరింది. గల్ఫ్ యుద్ధ సమయంలో ఆ దేశాల నుంచి విమానాల ద్వారా, నౌకలద్వారా లక్షలాదిమంది భారతీయుల్ని తరలించిన అనుభవం మన దేశానికుంది. కనుక ఈ విషయంలో పెద్దగా సమస్యలుండకపోవచ్చు. భారతీయ వలస కార్మికుల స్వేదం చమురు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇంధనంగా ఉపయోగ పడుతోంది. వారివల్ల లాభపడుతున్నది ఆ దేశాలు మాత్రమే కాదు... వారు తమ కుటుంబాలకు ఏటా పంపే వందల కోట్ల డాలర్లు మన ఆర్థిక వ్యవస్థకు కూడా జవసత్వాలనిస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారి విజృంభించడం మొదలెట్టాక గల్ఫ్ దేశాలతోపాటు... భారత ప్రభుత్వం కూడా తమను విస్మరిస్తున్నదన్న ఆవేదన అక్కడి వలస కార్మికుల్లో ఏర్పడింది. గల్ఫ్ దేశాలకు పయనమయ్యే సగటు భారతీయుల స్థితిగతులేమిటో ఎవరికీ తెలియంది కాదు. అమెరికా, బ్రిటన్, సింగ పూర్ తదితర దేశాలకు మధ్యతరగతి, ఎగువమధ్య తరగతి వర్గాలవారు చదువుకోసమో, ఆకర్షణీ యమైన జీతాలతో దొరికే కొలువు కోసమో వెళ్తుంటారు. కానీ గల్ఫ్ దేశాలకెళ్లే కార్మికుల్లో అత్యధికులు పూట గడవని స్థితిలోవుండేవారే. చదువు తక్కువగా వుండి, ఉన్నచోట ఉపాధి అవకాశాలు కొరవడి, ఎటువంటి కష్టాన్నయినా ఓర్చుకోవడానికి సిద్ధపడేవారే గల్ఫ్ దేశాలకెళ్లే విమానాల్లో కనబడతారు. వీరంతా భారీ వడ్డీలకు లక్షల రూపాయలు అప్పో సప్పో చేసి తమ బతుకులు బాగుపడతాయని వెళ్తారు. అక్కడ కూలీలుగా, కార్మికులుగా, డ్రైవర్లుగా, ఇళ్లల్లో పనివారుగా కుదురుకుంటారు. ఆమాత్రం ఉపాధి అయినా ఇక్కడ దొరకని స్థితి వుండటం వల్ల ఇది తప్పడం లేదు. ఆ వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని తమ కుటుంబాలకు పంపుతూ, ఇరుకిరుకు గదుల్లో దుర్భరమైన జీవితాలు గడుపుతుంటారు. సహ కార్మికులతో ఆవాసాలను పంచుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మహ మ్మారి విరుచుకుపడితే ఇక చెప్పేదేముంటుంది? కరోనా వైరస్ దాడి తర్వాత గల్ఫ్ దేశాలు హడలెత్తు తున్నాయి. లాక్డౌన్ కారణంగా అన్నీ మూతబడిన నేపథ్యంలో వలస కార్మికులు వారికి కంట్లో నలు సులవుతున్నారు. వారి బాధ్యతను వదిలించుకోవడానికి దాదాపు అన్ని సంస్థలూ ప్రయత్నిస్తు న్నాయి. పర్యవసానంగా ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. దాచుకున్న డబ్బులు హరిం చుకుపోతుండగా ఎన్నాళ్లు అర్థాకలితో బతుకీడ్వాలో తెలియక కుమిలిపోతున్నారు. ఈ నెల మొదటి వారంలో కేరళ ౖహె కోర్టులో గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కిరప్పించాలంటూ దాఖలైన పిటిషన్ వారి వెతలకు అద్దంపట్టింది. ఆ కార్మికుల కుటుంబసభ్యులు కొందరు తమవారిని చూడ టానికి వెళ్లి చిక్కుకున్నారని, వారిలో చాలామంది వైద్య సాయం అవసరమైనవారేనని పిటిషన్ తెల్పింది. సరిగ్గా ఈ సమయంలోనే సుప్రీంకోర్టులో కూడా గల్ఫ్ కార్మికుల కష్టాలపై పిటిషన్ దాఖలైంది. వాస్తవానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) మార్గదర్శకాల ప్రకారం వలస కార్మికులకు ఉపాధి కల్పించిన దేశమే వారి బాగోగులకు ప్రధానంగా పూచీపడాలి. వారికి, వారి కుటుంబాలకు తగిన ఆవాసం, వైద్య సదుపాయాలు కల్పించడం దాని బాధ్యతే. ఈ రెండు అంశాల్లోనూ తమ పౌరులను ప్రభుత్వాలు ఎలా చూసుకుంటాయో, వలస కార్మికులను కూడా అలాగే చూసుకోవాలి. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితం. గల్ఫ్ దేశాల్లోని చట్టాలన్నీ యజమానులకు అనుకూలంగా, కార్మికులకు ప్రతికూలంగా వుంటాయి. పైగా కరోనా వంటి మహమ్మారి చుట్టుముట్టినప్పుడు వలస కార్మికులను అక్కడి ప్రభుత్వాలు పెను భారంగా భావిస్తాయి. కనుకనే కొన్ని దేశాలు ‘ మీ కార్మికుల్ని మీరు తీసుకెళ్లండ’ంటూ మన ప్రభుత్వాన్ని కోరాయి. తమ వినతిని పెడచెవిన పెడితే తగిన చర్య తప్పదని కొన్ని దేశాలు హెచ్చరించాయి కూడా. గల్ఫ్ దేశాల్లో ఎలాంటి సంక్షోభాలు తలెత్తినా, అక్కడ ఏ సమస్య ముసురుకున్నా మన దేశంలో తల్లి పేగు కదలాడుతుంది. తమ వాళ్లెలావున్నారోనన్న బెంగ అన్ని కుటుంబాల్లోనూ అలు ముకుంటుంది. కనుక వీరి సమస్యలపై తక్షణం దృష్టిపెట్టాలి. ఈ కార్మికులను వెనక్కి తీసుకురావడానికి కనీసం మరో వారం పట్టే అవకాశం వుంది. ఈలోగా వారికి కనీసం కూడూ, గూడు దొరకడానికి, వైద్య సదుపాయం అందడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తే ఆ కుటుంబాల వారికి ఆందోళన తగ్గుతుంది. బ్రిటన్లో వున్న భారతీయ విద్యార్థులకు మన ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వం కలిసి వివిధ రకాలుగా సాయపడుతున్నాయి. అదే రకమైన సాయం గల్ఫ్లో చిక్కుకున్న కార్మికులకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ కష్టకాలంలో గల్ఫ్ కార్మికుల కన్నీరు తుడిస్తే, ఇన్నాళ్ల వారి శ్రమనూ, వారు దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన తోడ్పాటును గుర్తించినట్టవుతుంది. -
తీపి పని.. చేదు బతుకు
తాత్కాలికమే తప్ప శాశ్వత చిరునామా అన్నది వారెప్పుడో మర్చిపోయారు. ఉన్నవారితో సందడిగా గడపడమే తప్ప పండగ పూట అన్న పదమే వదిలేశారు. బంధువులెందరో ఉన్నా వారితో బంధాలకు ఎప్పుడో దూరమైపోయారు. వలస బతుకుల చిత్రమిది. చెరుకు కటింగ్ పనుల కోసం జిల్లాకు వచ్చే వలస జీవులు ఈ పనులయ్యే వరకు ఇక్కడే ఉంటారు. ఇవయ్యాక మరో పని వెతుక్కుంటూ కొత్త చిరునామా అందుకుంటారు. బతుకంతా ఇలా తిరిగేస్తూ గడిపే ఈ మనుషులకు కాసింత స్థిమితం కోరుకుంటున్నారు. ప్రస్తుతం బూర్జ మండలంలో బూర్జ, నారాయణపురంలో నివాసం ఉంటున్న ఆ కుటుంబాల జీవన విధానం గురించి. బూర్జ ఆస్పత్రి బయట వేసుకున్న గుడారాలు సాక్షి, బూర్జ: దాదాపు వంద మంది. అందరిదీ ఒకే కుటుంబం. ఒంగోలు జిల్లా యరగుండపాలెం మండలం యగోతమ్మడాపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వచ్చారు. అక్టోబర్కే వీరంతా జిల్లాకు చేరుకున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో చెరుకు కటింగ్ చేయడమే వారికి తెలిసిన విద్య. అదే జీవనాధారం. ఈ పనులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్తుంటారు. ఈ కుటుంబమే కాదు ఇలా వందలాది కుటుంబాలు ఇలా వలస జీవనానికి అలవాటు పడ్డాయి. పాలకొండ మండలం సంకిలిలో ఉన్న చక్కెర కర్మాగారంతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం బూర్జ మండలంలోని బూర్జ, వావాం, మామిడివలస, ఉవ్వపేట, కాఖండ్యాం, లంకాం, చినలంకాం, నారాయణపురం, గుత్తావల్లి, లాభాం, గంగంపేట వంటి గ్రామాల్లో ఉన్న చెరుకు కోత పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏడాదిలో దాదాపు ఎనిమిది నెలల ఈ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. గుడారాలు వేసుకొని అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు. మిగిలిన నాలుగు నెలలు మాత్రమే స్వగ్రామాల్లో గడుపుతారు. పొట్టకూటి కోసం సంచార జీవనం వారికి తప్పటం లేదు. చంటి పిల్లకు గోరుముద్దలు పెడుతున్న చిన్నారి ఆదాయం అంతంతమాత్రం పుట్టిన ఊరిని, కన్నవారిని వదిలి చంటి పిల్లలను సైతం చంకన వేసుకొని ఇంటిల్లి పాది బూర్జ మండలం చేరుకున్నారు. గుడారా లు వేసుకొని తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు చాలీచాలని వేతనంతో జీవనం సాగిస్తున్నారు. ఈ వలస జీవులు టన్ను చెరుకు కోస్తే 600 రూపాయలు ఇస్తారు. వేరే పనులు చేతకానందున దాంతోనే సంతృప్తి చెందక తప్పటం లేదు. చంటి పిల్లకు స్నానం చేయిస్తున్న చిన్నారి పండగలకు దూరం పండగలకు, పబ్బాలకు, అనుబంధాలకు, బంధు మిత్రులకు దూరంగా వీరు ఒంటరి జీవితాలు సాగిస్తున్నారు. పనిచేస్తున్న చోటే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే కలో గంజో తాగుతూ చీకటిలోనే జీవితాలు వెల్లదీస్తున్నారు. సొంత గ్రామాల్లో తల్లితండ్రుల నీడలో, అమ్మ ఒడిలో ఇంటి పట్టున ఉంటూ అల్లారు ముధ్దుగా పెరగాల్సిన చిన్నారులు ఈ చీకటిలో మగ్గిపోతున్నారు. ముఖ్యంగా వీరు చదువులకు దూరమవుతున్నారు. అక్షర జ్ఞానం లేని నిరుపేదలుగా మిగిలి పోతున్నారు. ఈ సంచార జీవుల చంటిపిల్లల ఆలనా పాలనా చూసుకునేందుకు గుడారాల వద్ద చిన్నారులే ఉంటున్నారు. వారికి పట్టుమని పదేళ్లు కూడా ఉండవు. ఈ గుడారాల్లో తల్లిపాలు వదలని నెలల పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఏడాది కొందరు మాత్రం అమ్మ ఒడి పథకం వల్ల కొద్దిగా ఎదిగిన పిల్లలను బడికి పంపించారు. ఊయల ఊపి జోల పాడుతున్న అమ్మాయి అమ్మ ఒడి ఎంతో మేలు చేసింది కొత్త ప్రభుత్వం అమ్మ ఒడి పథకం అమలు చేయటంతో ఈ ఏడాది చదువుకునే పిల్లలను అక్కడే వదిలి వచ్చాం. ఇంకొంత మందిని మా త్రం ఇక్కడకే తీసుకు రావాల్సి వచ్చింది. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం అందించిన రూ.15000లు మా బ్యాంక్ ఖాతాలో జమ అయిందని మా బంధువులు పోన్ చేస్తే ఈ మధ్యన మా ఊరు వెళ్లి డబ్బులు తీసుకున్నాం. అమ్మ ఒడి ఎంతో మేలు చేసింది. – సన్యాపోగు కూపమ్మ, యరగుండపాలెం, ఒంగోలు అనుబంధాలకు దూరం ఇదే మాకు జీవనాధారం. చక్కెర కర్మాగారం వారు అడ్వాన్స్లు ఇస్తా రు. ఆ డబ్బు చెల్లించే వరకు ఇక్కడ పనులు చేయాల్సిందే. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే మా సొంత గ్రామాల్లో ఉంటాం. మిగిలిన ఎనిమిది నెలలు ఉపాధి కోసం చెరుకు పండించే ఇతర జిల్లాలకు వెళ్తుంటాం. ఆ ఎనిమిది నెలలు ఊరిలో ఎలాంటి శుభ కార్యాలు ఉన్నా వెళ్లలేం. వెళ్లాలని సరదా ఉన్నా బలవంతంగా మా కోర్కెలను చంపుకుంటాం. – పూర్ణగంటి గంగయ్య, యగోతమ్మడాపల్లి, ఒంగోలు -
వలస జీవులకు సర్వే కష్టాలు
తాండూరు రూరల్: సమగ్ర సర్వే నేపథ్యంలో వలస జీవులు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారికి సరైన రవాణా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాత్రి ముంబై నుంచి రైలులో దాదాపు 1500 మంది తాండూరుకు చేరుకున్నారు. వీరంతా వివిధ గ్రామాలకు వెళ్లాల్సి ఉండగా బస్సులు లేక బస్టాండ్లో పడిగాపులు కాశారు. పిల్లాపాపలతో వచ్చిన వలసకూలీలు నానా తంటాలు పడుతూ కనిపించారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా అధికారులు వీరిని పట్టించుకోలేదు. జిల్లాలోని గండేడ్, మహహ్మదాబాద్, పరిగి, కుల్కచర్ల మండలాల ప్రజలు ఎక్కువగా ముంబైకి వలస వెళ్తుంటారు. సమగ్ర సర్వే ద్వారా తమకు ప్రభుత్వ పథకాలు అందుతాయని గంపెడాశలతో వలస జీవులు స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.