breaking news
Mettur Dam
-
జలదోపిడీ
► కర్ణాటక కుట్ర ► తమిళ ప్రజల ఇక్కట్లు టీనగర్: మేట్టూర్ డ్యాం ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం కాలువ తవ్వి నీటి దోపిడీకి పాల్పడింది. ఇది రాష్ట ప్రజలను ఆందోళనకు గురిచేసింది. తమిళనాడు సరిహద్దు ఆనుకుని కర్ణాటకలో ప్రసిద్ధిచెందిన మాదేశ్వరన్ ఆలయం ఉంది. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చి వెళుతుంటారు. ఈ ఆలయం చుట్టూ గల కొలనులు, తీర్థాలు నీళ్లు లేకుండా ఎండిపోతున్నాయి. దీంతో మేట్టూర్ డ్యాం రిజర్వాయర్ ప్రాంతమైన దిగువ పాలారులో చెక్డ్యాం ఏర్పాటుచేసి 20 కిలోమీటర్ల దూరంలోగల అటవీ ప్రాంతానికి నీటిని తీసుకువెళుతున్నారు. అక్కడి నుంచి మాదేశ్వరన్ ఆలయంలో ఉన్న అతిపెద్ద ఓవర్హెడ్ ట్యాంకులో నిల్వ చేసి భక్తుల అవసరాలకు వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఎండిపోయిన నీటి కొలనులు, తీర్థాలను నింపుతున్నారు. ప్రస్తుతం మేట్టూర్ డ్యాంకు నీటి రాక సెకనుకు 25 ఘనపుటడుగులుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రొక్లెయిన్ యంత్రం ద్వారా దిగువ పాలారు ప్రాంతంలో కాలువను తవ్వి హోగెనేకల్ నుంచి వచ్చే నీటిని మాదేశ్వరన్ కొండపైగల బావులకు నీటిని తీసుకువెళుతున్నారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో వ్యవసాయానికి, 80 శాతం ప్రజల తాగునీటి అవసరాలకు మేట్టూరు నీరు వినియోగిస్తున్నారు. 1938 తర్వాత ప్రస్తుతం ఏర్పడిన తీవ్ర కరువు కాటకాలతో డ్యాంలో 30 అడుగులకు తక్కువగా నీరు ఉంది. రెండు నెలల క్రితం డ్యాం నుంచి తాగునీటి అవసరాల కోసం 750 ఘనపుటడుగుల నీరు విడుదలైంది. నీటిరాక తగ్గడంతో ప్రస్తుతం 450 ఘనపుటడుగులు మాత్రమే విడుదల చేస్తున్నారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక అధికారుల హద్దుమీరిన చర్యలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
డెల్టాలో కమిటీ
• మెట్టూరు, భవానీ • సాగర్లో పరిశీలన • ఢిల్లీ బృందంతో • ఎడపాడి సమాలోచన • నేడు అన్నదాతల చెంతకు సాక్షి, చెన్నై: కావేరి ఉన్నత స్థాయి సాంకేతిక పరిశీలన కమిటీ రాష్ర్టంలో పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఆదివారం మెట్టూరు, భవానీ సాగర్ జలాశయాల్లో ఈ కమిటీ పరిశీలన సాగింది. ఈ బృందంతో రాష్ట్ర ప్ర జా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి సమాలోచించారు. ఇక, ఈ కమిటీ డెల్టాలో కమిటీ సోమవారం తంజావూరు, తిరువారూర్, నాగపట్నంలలో పర్యటించనున్నది. కావేరి జల వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర ఉన్నత స్థాయి సాంకేతిక పరిశీలన కమిటీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే.వాటార్ కమిషన్ చైర్మన్ జీఎస్ జా నేతృత్వంలో ఎస్ మజూద్, ఆర్కే గుప్తాలతో కూడిన ఈ కమిటీలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల అధికారులు ఉన్నారు. శుక్ర, శనివారాల్లో ఈ కమిటీ కర్ణాటకలోని జలాశయాల్లో నీటి పరిస్థితి, అక్కడి సాగుబడిని పరిశీలించింది. అక్కడ పర్యటన ముగించుకుని శనివారం అర్థరాత్రి సేలం చేరుకున్న ఈ కమిటీకి ఆ జిల్లా కలెక్టర్ సంపత్ ఆహ్వానం పలికారు. ఆదివారం ఉదయాన్నే ఈ కమిటీ స్థానిక అధికారులతో సమీక్షించింది. ఈ సమయంలో రాష్ర్ట ప్రజా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి అక్కడికి చేరుకుని ఈ కమిటీకి ఓ నివేదిక సమర్పించారు. డెల్టా జిల్లాల్లో సాగుబడి , నీటి అవసరాలను వివరిస్తూ అందులో పూర్తి సమాచారం పొందు పరిచారు. ఈ నివేదికపై సమాలోచన అనంతరం నేరుగా మెట్టురు డ్యాంకు జిఎస్ జా నేతృత్వంలో బృందం చేరుకుంది. డెల్టాలో పరిశీలన: మెట్టురు డ్యాంకు చేరుకున్న ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అధికారులు సుబ్రమణియన్, ప్రభాకర్లు జీఎస్ జాకు అక్కడి పరిస్థితిని వివరించారు. డ్యాంలో నీటి మట్టం, బురద, నీటి రాక, విడుదల తదితర వివరాలను జీఎస్ జా వెంట ఉన్న అధికారులు నమోదు చేసుకున్నారు. నీటి పరిస్థితిని సమీక్షించినానంతరం ఈరోడ్ జిల్లా భవానీ సాగర్కు చేరుకున్నారు. అక్కడ నీటి పరిస్థితి పరిశీలించారు. కావేరి తీరం వెంబడి సాగును పరిశీలిస్తూ, నీటి అవసరాల మీద సమగ్ర నివేదికకు ఈ కమిటీ నిర్ణయించింది. సోమవారం తిరువారూర్, తంజావూరు, నాగపట్నంలలో ఈ కమిటీ పరిశీలించి ఏ మేరకు సంబాసాగుబడి సాగుతున్నదో అధ్యయనం చేయనున్నది. ఈ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే జీఎస్ జా ఈనెల పదిహేడున సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. కాగా, డెల్టా జిల్లాల్లో పర్యటించనున్న ఈ కమిటీ ఆయా జిల్లాల్లోని రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులు, అన్నదాతలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కావాలని, అప్పుడే వాస్తవిక పరిస్థితి తెలుస్తుందని రాజకీయ పక్షాలు సూచించే పనిలో పడ్డారు. ఈ విషయంగా డిఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ పేర్కొంటూ, మొక్కుబడి పరిశీలనగా కాకుండా, అన్ని వర్గాల్ని కలుపుకుని కమిటీ ఏర్పాటు చేసి ఉండాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో రైతు ప్రతినిధులకు అవకాశం కల్పించి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడెక్కడ నీటి అవసరాలు మరీ ఎక్కువో అన్న వివరాలను సమగ్రంగా పరిశీలించాలని , రైతు ప్రయోజనార్థం అధికారులు పూర్తి వివరాలను కమిటీ ముందు ఉంచాలని సూచించారు ముగ్గురు : కావేరి జల వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లు ఇది వరకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ విచారిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ అన్ని పిటిషన్లను విచారించనున్నది. ఇందుకు తగ్గ ఆదేశాలు వెలువడ్డాయి. ఈనెల 17, 18 తేదిల్లో ఈ బెంచ్ ముందుకు పిటిషన్ల విచారణలు రానున్నాయి. ఇక, కావేరి అభివృద్ధి మండలి, కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ నేతృత్వంలో కమలనాథులు ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మోర పెట్టుకున్నారు.