breaking news
malakpet police
-
మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో..
సాక్షి, హైదాబాద్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మరణానంతరం ఆమె పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ సృష్టించిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో పాటు ఆమె భర్త బ్యాంకు ఖాతాల్లోని రూ.33.5 లక్షలు కాజేశారు. దీనిపై ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాకత్పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్తర్ హుస్సేన్ ఆరోగ్య శాఖ పరిధిలోని స్టేట్ హెల్త్ ట్రాన్స్ఫోర్ట్ ఆర్గనైజేషన్లో సర్వీస్ ఇంజినీర్గా పని చేశారు. 2003లో రిటైర్ అయిన ఆయన 2015 అక్టోబర్లో చనిపోయారు. అక్తర్ భార్య నూర్జహాన్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2020 జూన్ 2న ఆమె కన్నుమూశారు. గజ్వేల్ జిల్లా నుంచి వచ్చి ఆసిఫ్నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అన్నదమ్ములు మహ్మద్ సమియుద్దీన్, ఫసియుద్దీన్లు నూర్జహాన్ పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ రూపొందించారు. వీటిని రెండు బ్యాంకుల్లో సమర్పించి నూర్జహాన్ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు పొందారు. ఓ బ్యాంకుల్లో ఉన్న నూర్జహాన్ ఖాతా నుంచి రూ.3.5 లక్షలు, మరో బ్యాంకులో ఉన్న అక్తర్ ఖాతా నుంచి రూ.30 లక్షలు దఫదఫాలుగా డ్రా చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న నూర్జహాన్ కుమారుడు జకీర్ హుస్సేన్ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తన తల్లి ఏ సందర్భంలోనూ ఎవరికీ హిబా ఇవ్వలేదని, ఆ పేరుతో నిందితులు తప్పుడు పత్రాలు సృష్టించారని జకీర్ ఆరోపించారు. ఈ మేరకు నమోదైన కేసును మలక్పేట పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్కు బదిలీ చేశారు. దీంతో దీన్ని రీ–రిజిస్టర్ చేసుకున్న సీసీఎస్ ఏసీపీ ఎం.శ్రీనివాస్ రావు దర్యాప్తు ప్రారంభించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగినితో అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను మలక్పేట పోలీసులు శనివారం కటకటాల వెనక్కి నెట్టారు. ఎస్ఐ రంజిత్ కుమార్ కథనం ప్రకారం... వనస్థలిపురానికి చెందిన వివాహిత (28) అమీర్పేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వస్తూ దిల్సుఖ్నగర్లో పనిచేస్తున్న స్నేహితురాలి కోసం టీఎంసీ సమీపంలో వేచి ఉంది. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి వెంకటేశ్ (30), ఎంబీఏ విద్యార్థి శ్రీకాంత్ (28), అరుణ్ అనే ముగ్గురు యువకులు కారు (ఏపీ 09సీఆర్ 5130)లో వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెతో వాగ్వాదానికి దిగి చేయిపట్టుకుని లాగారు. ఆమె అరుపులు విని అదే మార్గంలో వెళ్తున్న కిషోర్ అనే వ్యక్తి వారిని అడ్డుకోబోగా.. అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాహితను వేధించిన శ్రీకాంత్, వెంకటేశ్లను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. అరుణ్ పరారీలో ఉన్నాడు. నిందితులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. శ్రీకాంత్, వెంకటేశ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఠాణాలో శ్రీకాంత్ తండ్రి హంగామా.. పట్టుబడ్డ నిందితుల్లో శ్రీకాంత్ తండ్రి శ్రీధర్యాదవ్ మలక్పేట ఠాణాకు వచ్చి పోలీసులతో తన కుమారుడి అరెస్టు విషయమై వాగ్వాదానికి దిగి హంగామా సృష్టించాడు. ఇతను కర్నూలు సీఐడీ విభాగంలో డీఎస్పీగా పని చేస్తున్నట్లు తెలిసింది.