breaking news
Major roads
-
మాయదారి మద్యం
►మద్యం అమ్మకాలకు రోడ్ల పరిధి మార్పు ► స్థానిక సంస్థల పరిధిలోకి 130 కిలో మీటర్ల రోడ్లు ►వీటి నిర్వహణ భారం స్థానిక సంస్థలదే ►రూ. 35.81 కోట్ల భారం మోయాల్సిందే.. సర్కారు మందు ఆదాయ మార్గం స్థానిక సంస్థలకు భారమైంది. సుప్రీంకోర్టు తీర్పు నుంచి తప్పించుకోవడానికి పలు రహదారులను స్థానిక సంస్థల పరిధిలోకి చేర్చడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ ఆదాయం తగ్గకుండా సర్కారు కొత్త ఎత్తుగడ పన్నింది. రాష్ట్ర రహదారులను జిల్లా మేజరు రోడ్లుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలో మద్యం అమ్మకాలకు అనువుగా ఉన్న రాష్ట్ర రహదారులు జిల్లా పరిధిలోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల పురపాలక సంస్థ లు, మండల పరిషత్లపై ఆర్థిక భారం పడనుంది. రెండు మూడేళ్లలో రూ. 35.81 కోట్లు స్థానిక సంస్థలు భరించాల్సివుంది. నిర్వహణకే ఏటా రూ.3.31 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిరుపతి తుడా: మద్యం ఆదాయం కోసం సర్కారు వేసిన ఎత్తుగడ స్థానిక సంస్థలకు శాపమైంది. మద్యం షాపులను ఇప్పటికే సర్కారు జాతీయ, రాష్ట్ర రహదాల నుంచి జనావాసాల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లు జిల్లా మేజర్ రోడ్లుగా మారిపోనున్నాయి. 57.24 కిలో మీటర్ల మేర రోడ్లు ఇలా పరిధి మారిపోనున్నాయిన గుర్తించారు. 58 మండల కేంద్రాల్లో 72.76 కిలోమీటర్ల మేర రోడ్లు మండల పరిషత్ పరిధి లోకి వెళ్లనుంది. మండల కేంద్రంలోని పట్టణ పరిధి ఉన్నంత వరకు ఉన్న రోడ్లను విడగొట్టి డీనోటిఫై చేయనున్నారు. ఉదాహరణకు చంద్రగిరి మండల కేంద్రం మీదుగా వెళ్ళే రాష్ట్ర రోడ్డును చంద్రగిరిలో ఊరు మొదలు – చివరి వరకు ఉన్న రోడ్డు మాత్రమే జిల్లా పరిధిలోకి వస్తుంది. అసలే వనరుల కొరత ఇప్పటికే ప్రభుత్వం నుంచి వనరులు సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి బాధ్యతంతా నగర, పురపాలక సంస్థలు మోస్తున్నాయి. తాజాగా రోడ్ల భారం మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతిలోని ఆర్అండ్బీకి చెందిన 6 కిలోమీటర్లు రహదారి నిర్వహణ ఇకపై కార్పారేషన్ చూడాలి. ఇక్కడ కొత్తగా రోడ్లు వేయాలంటే రూ.4.8 కోట్ల భారం పడనుంది. పూర్తిగా అభివృద్ధి చేయాలంటే కిలో మీటరుకు రూ. 25 లక్షలు ఖర్చు చేయాల్సి వుంటుంది. జిల్లాలో 130 కిలో మీటర్లలో పురపాలక సంస్థలకు చెందిన 57.24 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధికి రూ.14. 25 కోట్లు,నిర్వహణకు ఏటా రూ.1.71 కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుంది. మండల పరిషత్ పరిధిలో 72.76 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధికి రూ.18. 25 కోట్లు ఖర్చు చేయాలి. నిర్వహణ కోసం ఏడాదికి రూ.1.46 కోట్ల ఖర్చు మండల పరిషత్లు భరించాలి. మొత్తం మీద రూ.35.81 కోట్ల ఆర్థిక భారాన్ని స్థానిక సంస్థలు మోయాల్సి ఉంటుందన్నమాట. కొత్తగా రోడ్లు వేయాలంటే మరో రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయాలి. నిధులు లేక అభివృద్ది ఆగిపోయిన నేపథ్యంలో స్థానిక సంస్థలు మరిన్ని కష్టాలు పడాల్సి ఉంటుంది. -
అభివృద్ధికి దారులు
జిల్లాలో రెండు రహదారులకు డీపీఆర్ ప్రతిపాదనలు ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు ఒకటి తూర్పుగోదావరి నుంచి కృష్ణా జిల్లా మీదుగా ప్రకాశం వరకు మరొకటి కేంద్రం పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, విజయవాడ : జిల్లాలో రెండు భారీ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేలా నూతన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. తీరప్రాంతం వెంట కూడా జాతీయ రహదారి నిర్మిస్తే సరకు రవాణాకు ఉపయుక్తంగా ఉంటుందనే యోచనతో కోస్తా కారిడార్ వెంబడి మరో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. కేంద్ర భూఉపరితల రవాణ శాఖ పరిధిలో ఉండే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంస్థ వీటి బాధ్యతలను పర్యవేక్షిస్తుంది. కొన్ని నెలల క్రితమే రోడ్ల నిర్మాణం, ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శాఖను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో మాత్రమే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ఫోర్ట్ అండ్ హైవేస్ కార్యాలయాలున్నాయి. మచిలీపట్నంలో ఈ కార్యాలయం ఉంది. గతంలో ఆర్ అండ్ బి జాతీయ రహదారుల విభాగం అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల్ని, వారి పరిధిలో ఉన్న కొన్ని జాతీయ రహదారుల్ని ఈ సంస్థ స్వీకరించింది. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు 70 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. దీని కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయించి ప్రభుత్వానికి పంపారు. ఖరారు కాగానే పనులను కేటాయించనున్నారు. ఇది జగదల్పూర్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు ఐదు జిల్లాలను కలుపుతూ రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 390 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. 390 కిలోమీటర్ల రహదారి కావడంతో నిర్మాణానికి వందల కోట్లు ఖర్చవుతుంది. అధికారులు ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం చేయించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో మొదలయ్యే రహదారి కాకినాడ, అమలాపురం, యానాం మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలోని దిగుమర్రు, కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, కృత్తివెన్ను, మచిలీపట్నం, బంటుమిల్లి, చల్లపల్లి, పెనుమూడి వారధి వరకు.. గుంటూరు జిల్లా రేపల్లె మీదుగా ప్రకాశం జిల్లా వరకు కోస్తా కారిడార్కు అనుసంధానంగా రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారయ్యాయి.