జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?
చంద్రుడిపై ఇటీవల కుప్పకూలిన జపాన్కు చెందిన హకుటో-ఆర్2 లూనార్ ల్యాండర్ శకలాలను అంతరిక్ష ఔత్సాహికుడు షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి సుబ్రమణియన్ ఈమేరకు ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నాయి. అయితే దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ధ్రువీకరించాల్సి ఉంది.చంద్రయాన్-2 ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) తీసిన చిత్రాలను ఉపయోగించి సుబ్రమణియన్ జపాన్ వ్యోమనౌక హకుటో-ఆర్2 శకలాలను గుర్తించినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో కమ్యునికేషన్ కోల్పోవడంతో అది ఎక్కడ క్రాష్ ల్యాండ్ అయిందనే వివరాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ల్యాండర్ చంద్రుడి ఉత్తరార్ధగోళంలోని శీతల ప్రదేశంలో ల్యాండ్ అవుతుండగా టోక్యోలోని మిషన్ కంట్రోల్ స్పేస్ క్రాఫ్ట్తో కమ్యూనికేషన్లు, టెలిమెట్రీ సంబంధాలను కోల్పోయింది.భారత్ 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతుండగా అందులో అమర్చిన ఓహెచ్ఆర్సీ ద్వారా జపాన్ లూనార్ ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని విశ్లేషించారు. ఆ సైటును గుర్తించడానికి అవసరమైన కీలకమైన డేటాను చంద్రయాన్ 2 అందించింది. అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు తెలిసింది. అయితే దీన్ని ఇస్రో ధ్రువీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్ఎవరీ సుబ్రమణియన్?షణ్ముగ సుబ్రమణియన్ చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు. చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో ఈయన చంద్రుడి పరిస్థితులను విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2019లో చంద్రయాన్-2 మిషన్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగాల్సి ఉండగా, కమ్యునికేషన్లో అంతరాయం ఏర్పడి క్రాష్ ల్యాండ్ అయింది. అయితే కాలంపాటు ఆ ల్యాండర్ ఎక్కడ కూలిందో సరైన వివరాలు లభించలేదు. ముందుగా సుబ్రమణియన్ చంద్రుడిపై పరిస్థితులను, చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. తర్వాత ఈ విషయాన్ని ఇస్రో ధ్రువీకరించింది.