breaking news
lorry hits bike
-
బైక్ను ఢీకొని మినీ లారీ దగ్ధం
రామభద్రపురం: కర్నూలు సమీపంలో ఇటీవల జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం తరహాలోనే విజయనగరం జిల్లా రామభద్రపురం వద్ద బైపాస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ బైక్ను ఢీకొని మినీ లారీ పూర్తిగా కాలిపోయింది. రామభద్రపురం ఎస్ఐ వి.ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం... పాచిపెంట మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర అప్పలనాయుడు శనివారం అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో మద్యం మత్తులో బైక్పై రామభద్రపురం మీదుగా బాడంగి మండలం రౌతువానివలసలోని తన అత్తవారి ఇంటికి వెళుతున్నాడు.ఒడిశాకు చెందిన మినీ లారీ తుని నుంచి గోనె సంచుల లోడుతో రామభద్రపురం బైపాస్ రోడ్డు మీదుగా ఒడిశా వెళుతోంది. మార్గం మధ్యలో పొట్టవాని కోనేరు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కన పడిపోయిన అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. మినీ లారీ కింద ఇరుక్కుపోయిన బైక్ను సుమారు వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర రాపిడితో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. బైక్, మినీ లారీ కాలిపోయాయి. బాడంగి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బైక్ను ఢీకొన్న లారీ
- యువకుడు దుర్మరణం - ఇద్దరికి గాయాలు శంకరనగర్ (సోమశిల) :మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని శంకరనగర్ వద్ద సోమవారం రాత్రి జరిగింది.స్థానికుల కథనం మేరకు.. మండలంలోని రేవూరు ఈగాపాళెంకు చెందిన దూపాటి గోపాల్, రేణంగి వెంకటేశ్వర్లు, రేణంగి వేణు (20) ఆత్మకూరు నుంచి బైక్పై స్వగ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో అనంతసాగరం నుంచి ఆత్మకూరుకు వెళ్తున్న ధాన్యం లారీ శంకర్నగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొంది. ఈ దుర్ఘటనలో వేణు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, రేణంగి వెంకటేశ్వర్లు, గోపాల్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని అనంతసాగరం ఎస్ఐ రఘునాథ్ పరిశీలించారు. రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునే వాళ్లు.. ప్రమాదం జరిగిన స్థలానికి స్వగ్రామానికి కేవలం 3 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రమాదం జరగకుండా ఉంటే.. రెండు నిమిషాల్లో గమ్యస్థానం చేరేవాళ్లు. అంతలోనే ప్రమాదం జరగడంతో విషయం తెలిసి గ్రామస్తులు పలువురు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు మారుమోగాయి. వేణు చదువు కోసం కువైట్కు వెళ్లిన అన్న మృతుడు రేణంగి వేణు తండ్రి నారాయణ ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి వికలాంగురాలు కావడంతో కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో వేణును బాగా చదివించాలనే తపనతో అతని అన్న వెంకటేశ్వర్లు ఏడాది క్రితం అప్పు చేసి కువైట్కు వెళ్లాడు. అందరితో అనోన్యంగా ఉండే వేణు మృతితో కుటుంబం శోకసముద్రమైంది. -
బైక్ను ఢీకొన్న లారీ: ఇద్దరు దుర్మరణం
కమ్మపాళెం (కొడవలూరు) : మితిమీరిన వేగంతో వస్తున్న ఓ లారీ ముందు వెళ్తున్న మోటార్ బైక్ను వెనుక నుంచి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన మండలంలోని కమ్మపాళెం ఫ్లైఓవర్ వంతెన వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. కమ్మపాళెం మజరా చంద్రశేఖరపురానికి చెందిన లగుతోటి చిట్టిబాబు (50), ఉల్లిగడ్డల వెంకటేశ్వర్లు అలియాస్ చిన్నా (45) స్నేహితులు. ఆదివారం కావడంతో చిట్టిబాబు ఉదయం చికెన్ తీసుకువస్తానని భార్యకు చెప్పి బయలుదేరాడు. తనతో పాటు స్నేహితుడు చిన్నాను కూడా బైక్పై ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి కిమీ దూరం వచ్చాక కమ్మపాళెం ఫ్లైఓవర్ దాటగానే వెనుక నుంచి నెల్లూరు వైపు వేగంగా దూసుకొచ్చిన లారీ వారి బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై నున్న ఇద్దరు రోడ్డుపై పడగా, వారి తలలు మీదుగా లారీ చక్రాలు ఎక్కాయి. ప్రమాదంలో చిట్టిబాబు, చిన్నా తలలు నుజ్జునుజై్జ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి కారణమైన లారీ అక్కడి నుంచి కిమీ దూరం వెళ్లాక బొడ్డువారిపాళెంం ఫ్లైఓవర్ వంతెన వద్ద నిలిపి వేసి లారీడ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న కోవూరు సీఐ మాధవరావు కొడవలూరు ఏఎస్ఐ వెంకటాద్రినాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చర్చికి రమ్మంటే.. : చిట్టిబాబు మరణ వార్త తెలుసుకున్న భార్య లక్ష్మమ్మ బోరున విలపిస్తూ సంఘటనా స్థలానికి చేరుకుంది. చర్చికి వెళ్దామని చిట్టిబాబును భార్య పిలిస్తే.. చికెన్ తెచ్చి ఇంట్లో పెట్టి వస్తానంటూ బయలు దేరిన నిమిషాల్లోనే ఘోరం జరిగిందంటూ రోదించడం అందరిని కంటతడి పెట్టించింది. చిట్టిబాబు, చిన్నా మంచి స్నేహితులని, ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారని, మరణంలోనూ కలిసే వెళ్లారంటూ రోదించడం కలచి వేసింది. చిట్టిబాబుకు వివాహమైన కుమార్తె ఉండగా, చిన్నాకు అవివాహితుడైన కుమారుడున్నట్లు వారి బంధువులు తెలిపారు. చిన్నా స్వగ్రామం కావలి కాగా, పదేళ్లుగా చంద్రశేఖరపురంలో స్థిరపడ్డారు. చిన్నా భార్య, కుమారుడు గ్రామంలో లేకపోవడంతో పోలీసులు చిన్నా మరణ సమాచారం అందించలేకపోయారు. చిన్నా సమీప బంధువులు మాత్రం సంఘటనా స్థలానికి చేరుకుని కంట తడిపెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మాధవరావు తెలిపారు.


