breaking news
lingayya
-
ఓసీకి ఒకటి.. బీసీకి రెండు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. జోగినపల్లి సంతోష్కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ ఆ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అధినేత కేసీఆర్ ఈ ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచీ అనుకున్న విధంగా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన సంతోష్కు అవకాశం దక్కగా, మిగిలిన ఇద్దరు అభ్యర్థుల విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. యాదవుల కోటాలో చాలా మంది పోటీ పడినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్కు అవకాశమిచ్చిన కేసీఆర్ అదే రీతిలో వరంగల్ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్ను కూడా పెద్దల సభ రేసులో నిలబెట్టి పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరిచారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బడుగుల లింగయ్య 2015లో టీఆర్ఎస్లో చేరారు. బండ ప్రకాశ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. వీరిద్దరి ఎంపికతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అవకాశం ఇచ్చారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే, సామాజిక సమీకరణల్లో భాగంగానే బండ ప్రకాశ్ను ఎంపిక చేశారని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. ముదిరాజ్ మహాసభ ద్వారా బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రకాశ్ను రాజ్యసభకు పంపడం బీసీలకు పెద్దపీట వేయడమేనని, అందులో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలను పంపడం ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించాలనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మూడింటిలో రెండు స్థానాలను బీసీలకు కేటాయించారని గులాబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున గతంలో ఒక ఓసీ నేతను రాజ్యసభకు పంపగా, ఇప్పుడు మరో ఓసీ అభ్యర్థిని పెద్దల సభ రేసులో నిలబెట్టారు. గతంలో ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన ముగ్గురిలో కూడా ఇద్దరు బీసీలుండగా, ఇప్పుడు మళ్లీ ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బడుగుల లింగయ్య యాదవ్ తల్లిదండ్రులు: అంతయ్య, యలమంచమ్మ ఊరు: భీమారం, కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా వయసు: 58 ఏళ్లు చదువు: బీఏ, బీఈడీ భార్య: నాగమణి, పిల్లలు: డాక్టర్ యస్వంత్, దీప్తి రాజకీయ అనుభవం: 1982లో టీడీపీలో చేరారు. 1985–87 వరకు కేతేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987–97లో కేతేపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా, 1995లో భీమారం ఎంపీటీసీగా, 1998 –2012 వరకు టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2009లో మహాకూటమి తరఫున స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి 26 ఓట్లతో నేతి విద్యాసాగర్ చేతిలో ఓడిపోయారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ 2015, మార్చి 16న టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. జోగినపల్లి సంతోష్కుమార్ తల్లిదండ్రులు: రవీందర్రావు, శశికళ ఊరు: కొదురుపాక, బోయినపల్లి మండలం, కరీంనగర్ జిల్లా వయసు: 42 ఏళ్లు చదువు: ఎంబీఏ, ఎంపీఎం భార్య: రోహిణి పిల్లలు: ఇషాన్, శ్రేయాన్ అనుభవం: సంతోష్ చదువు పూర్తయి ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన జెండా చేపట్టిన కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. 2004లో హరీశ్ మంత్రి అయిన తర్వాత ఈ బాధ్యతలను తీసుకున్న సంతోష్ అప్పటి నుంచి కేసీఆర్కు తోడు నీడగా ఉన్నారు. గత 13 ఏళ్లుగా కేసీఆర్ కన్నా ముందే ప్రారంభమయ్యే సంతోష్ దినచర్య కేసీఆర్ నిద్రకు విశ్రమించిన తర్వాతే ముగుస్తుంది. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా సంతోష్ ఆయన వెన్నంటి ఉండాల్సిందే. అటు పార్టీలో, ఇటు కేసీఆర్ కుటుంబంలో అందరికీ తలలో నాలుకగా ఉండే సంతోష్ వ్యక్తిగతంగా కూడా మంచిపేరు సాధించుకున్నారు. ప్రస్తుతం టీన్యూస్ ఎండీగా కూడా ఉన్నారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ వయసు: 63 ఏళ్లు చదువు: ఎంఏ, పీహెచ్డీ అనుభవం: కుడా సభ్యుడిగా, వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కూడా. -
‘సెడ్స్’ సేవలు అభినందనీయం
►జిల్లా విద్యాధికారి లింగయ్య ►ఘనంగా స్పోర్ట్స్ మీట్ ►పాల్గొన్న విదేశీయులు గుడిహత్నూర్ : సెడ్స్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని జిల్లా విద్యాధికారి లింగయ్య అన్నారు. మండలంలోని కొల్హారీ ప్రాథమికోన్నత పాఠశాలలో సెడ్స్ ఆధ్వర్యంలో ప్లాన్ ఇండియా, పర్ఫాం సంస్థల సహకారంతో మంగళవారం నిర్వహించిన వార్షిక క్రీడా సంబరాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, పిల్లల అభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్రీడాలతో విద్యార్థులను ఆకర్షించి మరింత ప్రోత్సాహాన్ని అందించే దిశగా తాము కృషి చేస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ ఆర్.సురేందర్ తెలిపారు. స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న వృధ్ధుల ఆశ్రమం, యువజనులకు స్వయం ఉపాధి శిక్షణలు, బాల కార్మికుల నిర్మూలన, క్రీడల్లో ప్రోత్సాహం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి లండన్కు చెందిన ప్లాన్ ఇండియా, పర్ఫాం ప్రతినిధులు మైఖేల్ రాబర్ట్, ఫ్లోరియన్ డెడైరిసన్, ల్యూక్లాక్, జోసీ పార్మీ, జెసీ జోయ్లతో పాటు ప్లాన్ ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రోగ్రాం అధికారి కె.అభిలాష్ పాల్గొని సంస్థ సేవలు పరిశీలించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనపర్చిన జట్లకు బహుమతులు అందజేశారు. స్థానిక సర్పంచ్ బా లాజీ సోంటక్కే, ఎస్ఎంసీ చైర్మన్ తగ్రే ప్రకాశ్, ఎంఈవో నారాయణ, సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి, వివిధ గ్రామాల వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యార్థుల వివరాలను పక్కాగా
నిజామాబాద్అర్బన్ : పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శుక్రవారం యూ డైస్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల వివరాలను పాఠశాలలు, తరగతుల వారీగా నమోదు చేయాలన్నారు. విద్యార్థులకు సంబంధించి 38 అంశాలను పకడ్బందీగా నమోదు చేసి కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. యూ డైస్ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని సీఆర్పీలకు వివరించారు. ప్రతి విద్యార్థి వివరాలు, ఆధార్కార్డు నంబర్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే విధానం ఉంటుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లకు డీఈవో ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్వీఎం పీవో శ్రీనివాస్ సీఆర్పీలు ఎం.ఎస్. కో–ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.