breaking news
Leftinent
-
లాల్ ఎత్తు ఒక సందేహంగా ఉండిపోయింది..
లెఫ్టినెంట్ లాల్ మచ్చువానా భారత సైన్యంలోని శతఘ్నిదళంలోకి ప్రమోట్ అవడం అతడి సొంత రాష్ట్రమైన మిజోరాం ప్రజలకే కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంథంగాకూ ఎంతగానో ఆనందించే విషయం అయింది. అయితే ఆ ఆనందంలో ఆయన ట్వీట్ చేసిన ఫొటో మాత్రం దేశంలోని ఇతర ప్రాంతాల వారికి ఆసక్తిని మాత్రమే కలిగించింది. ఆ ఫొటోలో ఇద్దరు పొడవాటి ఆఫీసర్ల మధ్య ఉన్న లాల్ మచ్చువానా.. సైన్యానికి అవసరమైన కనీస ఎత్తులో కూడా లేనట్లుగా కనిపించడమే అందుకు కారణం. 6.5, 6.3 అడుగుల ఎత్తు ఉన్న ఆ ఇద్దరి మధ్య 5.5 అడుగుల ఎత్తున్న లాల్.. సైన్యానికి ఏమాత్రం తగని వ్యకిలా కనిపిస్తున్నప్పటికీ సైన్యానికి కనీస అర్హత అయిన 5.2 ఎత్తుకు మించి ఉన్నట్లు మీడియా వెళ్లి ఆయన్ని అడిగేవరకు దేశానికి ఒక సందేహంగా ఉండిపోయింది. ముఖ్యమంత్రి పోస్ట్ చేసిన ఆ ఫొటో గతంలో డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్లో లాల్ తన కో–ఆఫీసర్స్ తో కలిసి తీయించుకున్నది. -
సాహసాల అలలపై చెరిగిపోని సంతకం..
విశాఖసిటీ: సముద్రమంత సాహసం.. సాటిలేని మనోనిబ్బరం.. అవధులు లేని ఆత్మవిశ్వాసం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆరాటం.. అంతకుమించిన నైపుణ్యం.. ఇవన్నీ ఉన్నాయంటే.. ఆ అమ్మాయి కచ్చితంగా పాతర్లపల్లి స్వాతి అవుతుంది. సాగరం చిన్నబోయేలా.. సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసిన ఆ అద్భుత వనిత తప్పనిసరిగా స్వాతి అవుతుంది. కేవలం ఓ తెరచాప పడవలో ఐదు మహాసముద్రాలను అధిగమించి, భారత నౌకాదళ చరిత్రలోనే సాటిలేని అధ్యాయాన్ని లిఖించిన ఆ యువతి తప్పనిసరిగా మన విశాఖకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ స్వాతి అవుతుంది. ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో ప్రయాణించిన ఆరుగురు మహిళల బృందంలో ఒకరైన స్వాతి, నావికా సాగర్ పరిక్రమ పూర్తిచేసిన నేపథ్యంలో.. తన అనుభవాలను, భావోద్వేగాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. సాక్షి: విజయవంతమైన సాహస యాత్రలో భాగస్వాములైనందుకు అభినందనలు. తరిణి విజయం గురించి మీరెలా ఫీలవుతున్నారు.? స్వాతి: థాంక్యూ. భారత నౌకాదళ చరిత్రలో ఇదో పెద్ద విజయం. పూర్తిగా మహిళలు సాధించిన ఈ విజయాన్ని వారికి, మా కుటుంబానికి అంకితం చేస్తున్నాను. 193 రోజుల పాటు ఐదు మహాసముద్రాల మీదుగా 21,600 వేల నాటికల్ మైళ్లు సాగిన నావికా సాగర పరిక్రమ నిజంగా నా జీవితంలో అతిగొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. సాక్షి: మీ విజయంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది.? స్వాతి: ఇది ముమ్మాటికీ నాన్న కల. అమ్మ శ్రమ. ముగ్గురు కూతుళ్లను పెంచేందుకు రోజుకు 16 గంటలకు పైగా కష్టపడుతూ మా జీవితానికి ఓ మంచి భవిష్యత్తునిచ్చింది నా తల్లిదండ్రులే. సాగర పరిక్రమకు వెళ్తానని చెప్పినప్పుడు నాన్న కొంచెం ఆలోచించినా.. అమ్మ మాత్రం ధైర్యం చెప్పింది. విజయం సాధించి వెనక్కు వస్తావని వెన్నుతట్టి ప్రోత్సహించింది. వారిచ్చిన స్ఫూర్తితోనే ముందడుగు వేశాను. సాక్షి: నౌకాదళంలోకి రావాలన్నది మీ ఆశయమా? దాన్ని ఎలా సాధించారు? స్వాతి: ముందు నేను ఇండియన్ నేవీలోకి రావాలని అనుకోలేదు. మా నాన్న పాతర్లపల్లి ఆదినారాయణ ఇక్కడి ఇండస్ట్రియల్ క్యాంటీన్లో హెడ్కుక్. అమ్మ రాణి సెయిలింగ్ క్లబ్లో హెల్పర్గా పనిచేశారు. నాన్న పనిచేసే చోటుకు నేవీ అధికారులు వచ్చే వాళ్లు. వారిని చూసి తనకు అబ్బాయి పుడితే నేవీలో చేర్పించాలని అనుకున్నారు. అయితే.. ముందు ఇద్దరూ అమ్మాయిలే పుట్టారు. మూడో బిడ్డయిన నేను కూడా అమ్మాయినే. అయినా.. నాన్న నేవీ ఆశలు వదులుకోలేదు. ఇద్దరు అక్కల కంటే చురుగ్గా నేను ఉండటంతో నన్ను ఆ దిశగా నడిపించారు. అందరిలాగానే నేనూ బీటెక్లో చేరుదామని అనుకున్నాను. నాన్న మాత్రం బీఎస్సీలో చేరితే.. నీలైఫ్ బావుంటుందని చెప్పడంతో సరే అన్నాను. నాన్న మార్గదర్శిగా నిలవడంతో నేనీ స్థాయిలో ఉన్నాను. సాక్షి: సెయిలింగ్లో మీకెలా అవకాశాలొచ్చాయి.? ఆ రంగంలో మీ అనుభవం ఏమిటి? స్వాతి: చిన్నప్పటినుంచి ఎన్సీసీ క్యాడెట్గా శిక్షణ పొందాను. సెయిలింగ్ నేర్చుకున్నాను. నవంబర్ 2011లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా నేవీలో ఉద్యోగం సాధించాను. 2013లో వైజాగ్ వచ్చాను. ఐఎన్ఎస్ డేగాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా పనిచేస్తున్న సమయంలో కేప్ టూ రియో పోటీల గురించి ఇండియన్ నేవీకి ఆహ్వానం అందింది. ప్రతి మూడేళ్లకోసారి దక్షిణాఫ్రికా నిర్వహించే ఈ ట్రాన్స్ అట్లాంటిక్ క్రాస్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాను. సుమారు నెల రోజుల పాటు సముద్రంలో సాగే ఈ పోటీలో తరిణిలో ఉన్న లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి, లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమాల్తో కలిసి ప్రయాణం చేశాను. లాంగ్ సెయిలింగ్ బోట్లో ప్రయాణం చేసిన మొదటి భారతీయ (నేవీ) అమ్మాయిలుగా చరిత్ర సృష్టించాం. నేవీ ఉమెన్ ఆఫీసర్లు కూడా సుదీర్ఘ కాలం సెయిలింగ్ చెయ్యగలరని నేవీకి విశ్వాసం పెరిగింది. ఆ తర్వాత వచ్చిన అవకాశమే ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం. సాక్షి: ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం ఎలా ప్రారంభించారు.? నౌక గురించి మీ అవగాహన ఏమిటి? ఆరుగురు అమ్మాయిల బృందాన్ని ఎలా ఎంపిక చేశారు.? స్వాతి: నావికా సాగర పరిక్రమలో పాల్గొనాలనుకుంటున్నారా? అని నేవీ నుండి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని ఓకే చెప్పాను. జమాల్, వర్తికా, నేను ముగ్గురం కోర్టీం గా వ్యవహరించాం. ఆ తర్వాత పాయల్, విజయ, ఐశ్వర్య వచ్చారు. ఆరుగురుం కలిసి పలు ప్రాంతాలకు సెయిలింగ్కు వెళ్లేవాళ్లం. పకడ్బందీగా ట్రైనింగ్ ఇచ్చారు. ఐఎన్ఎస్వీ తరిణి నిర్మాణంలో మాకూ భాగస్వామ్యం ఉంది. ప్రతి పార్ట్ని ఎలా తయారు చేశారో, ఏది ఎక్కడ, ఎందుకు అమర్చారో నిర్మాణ దశలో తెలుసుకున్నాం. షిప్యార్డ్కు వెళ్లి ప్రతి పార్ట్ ఫిట్ చేసినప్పుడు చూసి నేర్చుకున్నాం. అందుకే.. తరిణి ప్రయాణంలో నౌకలో ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరించుకోగలిగాం. సాక్షి: పసిఫిక్లో తుపాను ఎదురైనప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి? స్వాతి: 800 నాటికల్ మైల్స్ దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో వెస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా వద్ద తుపాను ప్రారంభమైంది. దాదాపు 20 గంటల పాటు చిక్కుకున్నాం. 6 నుంచి 7 గంటల పాటు బీభత్సమే. అయితే అప్పుడు మాకు భయం వేయలేదు. ఎందుకంటే భయపడేందుకు కూడా టైం దొరకలేదు. బోట్ను ఎలా కంట్రోల్ చెయ్యాలోనని తీవ్రంగా శ్రమించాం. నిద్రపోయే సమయం లేదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు రాత్రి భోజనం చేసేంత వరకూ నీరు కూడా తాగలేదంటే పరిస్థితిని ఊహించుకోండి. యుద్ధం చేసినంత కష్టంగా సాగిందా ప్రయాణం. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులెదురైనా ఇంజిన్ను వినియోగించకూడదు. ప్రయాణం మొత్తం తెరచాపల కదలికల ద్వారా మాత్రమే చేశాం. పెద్ద పెద్ద అలలు వచ్చి మా నౌకు ఢీకొట్టేవి. లాభం లేదనుకొని అలల వైపుగా మా దిశను మార్చేసేవాళ్లం. దీనివల్ల వేరే మార్గంలోకి వెళ్లాల్సి రావడంతో మా ప్రయాణ దూరం పెరిగిపోయింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయి. సాక్షి: ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన గ్రేట్ కేప్స్ను అధిగమించిన సమయంలో మీ అనుభూతి ఏమిటి? స్వాతి: అదో అద్భుత అనుభవం. గ్రేట్ కేప్స్ దాటుతున్న సమయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయన్న ఆతృత, ఆసక్తి మాలో ఉండేది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బోట్ను సురక్షితంగా ఉంచాలని కెప్టెన్ ఆదేశించారు. మూడు కేప్స్ను దాటిన తర్వాత చాలా ఆనందపడ్డాం. ప్రపంచంలో సముద్ర మార్గంలో అన్నిటికంటే క్లిష్టమైన ప్రాంతాలను అధిగమించాం. ఇలా చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సాక్షి: ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణంతో మీరు నేర్చుకున్నదేమిటి? స్వాతి: తరిణి ప్రయాణంలో కష్టాలను ఎలా అధిగమించాలో నేర్చుకున్నాను. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటినుంచి పారిపోకుండా ఎదుర్కోవడం నేర్చుకున్నాను. మొత్తమ్మీద ఈ నౌక నన్ను ఆల్రౌండర్ చేసింది. ఇతర నౌకలతో సమాచార అనుసంధానం ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాను, ఎలక్ట్రీషియన్, ఇంజినీరింగ్, మెడికల్ అసిస్టెంట్, ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి ఇలా ఎన్నో విషయాల్ని నౌక నేర్పింది. దాదాపు 8 నెలల పాటు స్నానం చెయ్యకుండా ప్రయాణం చేశాం. కేవలం ఫేషియల్ వైట్తోనే శరీరాన్ని శుభ్రం చేసుకువాళ్లం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. హోళీ, దీపావళి, న్యూఇయర్.. ఇలా ప్రతి వేడుకనీ నౌకలో చేసుకోవడం కొత్త అనుభూతినిచ్చింది. దాదాపు 8 నెలల పాటు స్నానం చెయ్యకుండా ప్రయాణం చేశాం. కేవలం ఫేషియల్ వైట్తోనే శరీరాన్ని శుభ్రం చేసుకువాళ్లం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. సాక్షి: యాత్రకు సంబంధించి మీరు మరిచిపోలేని జ్ఞాపకం ఏమిటి? స్వాతి: 2017 నవంబర్లో గోవాలో ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఎలాంటి సెటప్ ఉందో.. 2018 మే 21న తిరిగి గోవా చేరుకున్నప్పుడు అదే తరహా ఏర్పాట్లు చేశారు. చాలా ఆశ్చర్యం వేసింది. రక్షణ శాఖమంత్రి, ప్లాగ్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, వేదిక, బోర్డులు.. ఇలా ఏ ఒక్కటీ మారలేదు. అది చూసి.. ఇప్పటి వరకూ జరిగింది కలా..? ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామా..? అని అనిపించింది. అప్పటి వరకూ పడిన కష్టాన్ని అమ్మా నాన్నని చూసిన తర్వాత పూర్తిగా మర్చిపోయాను. నాన్న కళ్లల్లో ఆనందం చూసినప్పుడు ప్రపంచంలో అతి పెద్ద రికార్డు సాధించినంత గర్వంగా ఫీలయ్యాను. అమ్మాయి తలచుకుంటే అవలీలగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని మా తరిణి బృందం నిరూపించింది. సాక్షి: రకరకాల వాతావరణాన్ని ఎలా తట్టుకోగలిగారు? స్వాతి: ఒక్కో చోట ఒక్కోలా ఉష్ణోగ్రతలు మారుతూ ఉండేవి. దాదాపు సబ్ జీరో, మైనస్ ఉష్ణోగ్రతలే ప్రతి చోటా ఎదురయ్యాయి. దాదాపు 12 వేల కిలోమీటర్లు సున్న డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల మధ్య ప్రయాణం సాగించాం. విపరీతమైన చలి, హీటర్ లేదు, ఫ్యాన్లేదు. అయినా ధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఇది సాహస యాత్ర. అన్ని సౌకర్యాలున్నప్పుడు అది సాహసం ఎందుకవుతుంది. అందుకే.. వాటిని ఎదుర్కొన్నాం. చలిని తట్టుకునేందుకు 7 నుంచి ఎనిమిది డ్రెస్లు ఒకేసారి వేసుకునేవాళ్లం. అలల తీవ్రతను రాత్రి పూట గుర్తించేందుకు నైట్ విజన్ కళ్లజోళ్లు వినియోగించేవాళ్లం. పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణం సాగించినప్పుడు 45 రోజుల పాటు ఒక్క నౌక కూడా కనిపించలేదు. ఒంటరి జీవుల్లా ప్రయాణం సాగించాం. -
వీరులను స్మరించుకుందాం
ఉచిత వైద్య పరీక్షలు:మాజీ సైనికుల సమ్మేళనానికి హాజరైన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మెడికల్, సర్జికల్, ఈఎన్టీ నిపుణులు పాల్గొన్నారు. ఈసీజీ, ఎకో పరీక్షలు చేసి తగు సూచనలు ఇచ్చారు. తరగని సంపదను ఆర్జించిన వారైనా తుదకు వట్టి చేతులతో మట్టిలో కలవాల్సిందే. కీర్తిని ఆర్జించిన వారు ఆచంద్రతారార్కం గుండెల్లో గుడి కట్టుకుంటారు. భారతజాతి స్వేచ్ఛా వాయువుల కోసం నిరంతరం పరితపించి వీర మరణం పొందిన జవాన్లు అలాంటి వారే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మాజీ సైనికుల సమ్మేళనంలో అమరవీరుల ఆత్మీయుల కళ్లు కన్నీటి సుడులయ్యాయి. ఈ సందర్భంగా అందజేసిన బహుమతుల్లో తమ వారిని బలిగొన్న తూటాల శబ్దాలు వినిపించాయో ఏమో బావురుమని విలపించారు. లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని దక్షిణ భారత లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే ఆనంద్ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సాయుధ దళాల వీరుల గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ, వారి బంధువుల సమస్యలు తెలుసుకునేందుకు మహాసమ్మేళనం నిర్వహించారు. హైదరాబాద్లోని అర్కెలరీ సెంటర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు, అమర జవానుల కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆర్మీ బ్యాండ్ దేశభక్తిని పెంపొందించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణ సబ్ ఏరియా మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. సైనిక్ వెల్ఫేర్ ఏపీ డైరెక్టర్, ఎంవీఎస్ కుమార్, విజయవాడ అదనపు పోలీస్ కమిషనర్ బీవీ రమణకుమార్ అతిథులుగా పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి వీరుల బంధువులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ సమస్యలు, రుణాలు ఇతర అంశాలను పరిష్కరించేందుకు బ్యాంకు స్టాల్స్ ఏర్పాటుచేశారు. లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే ఆనంద్ మాట్లాడుతూ మాజీ సైనికులు, యుద్ధ వితంతువులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలోని మాజీ సైనికులు, యుద్ధ వితంతువులను కలిసి సమస్యలు తెలుసుకుంటామన్నారు. -
దేశ సేవలో పల్లె ‘ప్రతిభ’
మారుమూల పల్లెనుంచి ఇండియన్ ఆర్మీకి ఆంధ్రప్రదేశ్నుంచి ఎంపికైన ఏకైక మహిళా అధికారిణి ఇంజినీరింగ్ చదివినా... దేశ సేవ చేయాలన్నదే లక్ష్యం సాక్షితో పేడాడ ప్రతిభ డెంకాడ: పుట్టిందీ పెరిగిందీ గ్రామీణ నేపథ్యం. చదివింది ఇంజినీరింగ్... అందునా... అమ్మాయి... ఇక ఎవరైనా ఏ సాఫ్ట్వేర్ ఇంజినీర్గానో స్థిరపడాలనుకుంటారు. ఇంకా కాదనుకుంటే... బ్యాంకు టెస్టులు రాసి అందులో రాణించాలనుకుంటారు. కానీ ఆమె అందరికంటే భిన్నంగా ఆలోచించింది. దేశసేవ చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచించింది. అందుకు ఆర్మీ సరైన వేదిక అనుకుంది. అనుకున్నదే తడవుగా అందుకోసం దరఖాస్తు చేసింది. ఎంతో కష్టమైన ఆ ఉద్యోగం వద్దని ఎంతోమంది చెప్పారు... కానీ ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు సాగి రాష్ట్రం నుంచే లెఫ్టినెంట్ అధికారిణిగా ఎంపికైన ఏకైక మహిళగా గుర్తింపు పొందింది. ఆమే శ్రీకాకుళం జిల్లా కొర్లకోటకు చెందిన పేడాడ ప్రతిభ. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని కొర్లకోట అనే మారుమూల గ్రామానికి చెందిన పేడాడ ప్రతిభ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ పోస్టుకు ఎంపికై ప్రతిభ చాటింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక మహిళగా గుర్తింపు పొందింది. స్వగ్రామమైన కొర్లకోట ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకూ చదివిన ఈమె పదో తరగతి ఆమదాలవలసలోని విజ్ఞాన్ పాఠశాలలోను, ఇంటర్మీడియట్ విశాఖపట్నం పరిధి గోపాలపట్నంలోగల శ్రీచైతన్య కళాశాలలో చదివింది. అనంతరం చింతలవలస ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాలో మెకానికల్ విద్యను పూర్తి చేసింది. ఏపీ నుంచి ఏకైక మహిళ ఇండియన్ ఆర్మీలో 330 మంది అధికారులను ఆర్మీ ఎంపిక చేసింది. అందులో దేశ వ్యాప్తంగా 33 మంది మహిళలు ఉండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పేడాడ ప్రతిభ ఒక్కరే ఎంపికవ్వడం విశేషం. అదీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగంలో దేశంలో ఇద్దరు మహిళలు ఎంపిక కాగా అందులో ప్రతిభ ఒక్కరు కావటం మరో విశేషం. 12 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న పేడాడ ప్రతిభను జమ్మూ అండ్ కాశ్శీర్లో లెఫ్టినెంట్గా అధికారులు నియమించారు. చింతలవలస ఎంవీజీఆర్ ఇంజీనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్ధి కావటంతో శనివారం ఆమెను, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతిభ సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... కోరిక ఎలా పుట్టింది మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట. అమ్మ పేడాడ సుగుణవేణి, నాన్న అప్పారావు ఇద్దరూ ఉపాధ్యాయులే. తొమ్మిదో తరగతి వరకూ మా వూళ్లోనే చదివి, ఆమదాలవలసలో పదో తరగతి చదివాను. అటు తరువాత విశాఖలో ఇంటర్ పూర్తి చేసి ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ 2014 సంవత్సరంలో పూర్తి చేశాను. ఒకసారి మా బందువైన ఆర్మీలో కెప్టెన్గా పని చేస్తున్న రవికుమార్ తన సెల్ ఫోన్లో ఒక మహిళా ఆర్మీ అధికారి ఫొటో చూపించారు. అప్పట్నుంచే ఇండియన్ ఆర్మీలో పని చేయాలని ఫిక్స్ అయిపోయా. ఎవరైనా ప్రోత్సహించారా... అయితే చుట్టుప్రక్కల వారు నా నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆడపిల్లవు కదా అందుబాటులో ఉండే ఉద్యోగాన్ని సంపాదించాలని సలహా ఇచ్చేవారు. మా అమ్మ కూడా భయపడింది. మా నాన్న మాత్రం నాకు అడ్డుచెప్పలేదు. అయినా నా నిర్ణయం మారలేదు. మొదటి ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. రెండో ప్రయత్నంలో విజయం సాధించాను. శిక్షణ పూర్తయ్యి జమ్ము అండ్ కాశ్శీర్లోని ఇండియన్ ఆర్మీలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగంలో లెప్టినెంట్ అధికారిగా నియమించారు. ఎలా అనిపిస్తోంది... ఇండియన్ ఆర్మీలో పని చేయాలన్న నా లక్ష్యం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్మీలో చేరటం వల్ల శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటుంది. ఆర్మీలో చేరి నా వంతు దేశ సేవ చేసే అవకాశం రావటం గర్వంగా భావిస్తున్నాను.