breaking news
Larsen and Toubro Ltd
-
Defense Deals: రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు ఒప్పందాలు
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్–29 జెట్ విమానాలకు ఏరో ఇంజిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఒకటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్)తో రెండు, లార్సెన్ అండ్ టూబ్రోతో రెండు ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమానె సమక్షంలో శుక్రవారం ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘సైనిక బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప జేసే ఈ ఒప్పందాలు దేశీయ సంస్థల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తాయి. భవిష్యత్తులో విదేశీ పరికరాల తయారీపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి’అని రక్షణశాఖ తెలిపింది. ఒప్పందంలో భాగంగా భారత్– రష్యాల జాయింట్ వెంచర్ బీఏపీఎల్ నుంచి 200 బ్రహ్మోస్ క్షిపణులను రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. -
ఎల్అండ్టీ లాభం 14% డౌన్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మౌలికరంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 978 కోట్లకు తగ్గింది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 1,137 కోట్లు. అప్పట్లో అసాధారణంగా సుమారు రూ. 267 కోట్లు రావడం వల్ల లాభం ఎక్కువగా కనిపించిందని, తాజాగా అలాంటి అంశాలేమీ లేవని కంపెనీ తెలిపింది. మరోవైపు ఆదాయం సుమారు 10 శాతం వృద్ధితో రూ. 14,510 కోట్లకు పెరిగినట్లు వివరించింది. విద్యుత్, హైడ్రోకార్బన్, మెటలర్జికల్ తదితర విభాగాలు కాస్త మందగించినప్పటికీ.. ఇన్ఫ్రా వంటి కొన్ని వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో ఆదాయం పెరిగిందని ఎల్అండ్టీ తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం ద్వారా ఆదాయం సుమారు 31 శాతం పెరిగి రూ. 7,198 కోట్లుగా నమోదైంది. సమీకృత ఇంజనీరింగ్ సేవలు, నౌకల నిర్మాణం, ప్రాపర్టీ డెవలప్మెంట్ వంటి వ్యాపార విభాగం 53 శాతం పెరిగి రూ. 527 కోట్లుగా నమోదైంది. మరోవైపు, ఆర్డర్లు 27%(సుమారు రూ. 26,533 కోట్లు) పెరిగాయని ఎల్అండ్టీ వివరించింది. మధ్యప్రాచ్య దేశాల్లో భారీ ప్రాజెక్టుల వల్ల విదేశీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని, మొత్తం ఆర్డర్లలో 43% వాటా వీటిదేనని పేర్కొంది. సెప్టెంబర్ చివరికి మొత్తం ఆర్డర్ల విలువ రూ. 1,76,036 కోట్లని ఎల్అండ్టీ తెలిపింది. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడాలని, ఇటీవలి ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడగలవని ఎల్అండ్టీ వివరించింది.