breaking news
Lakshmi Puri
-
టీఎంసీ ఎంపీకి షాక్.. రూ. 50 లక్షలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సాకేత్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. క్షమాపణలను ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలని, ఆరు నెలల పాటు సోషల్ మీడియాలో కూడా ఉంచాలని సూచించింది. ఎనిమిది వారాల్లోగా ఈ ఉత్తర్వును పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.కాగా, 2021 జూన్ 13, 26న సాకేత్ గోఖలే వివాదస్పద ట్వీట్లు పోస్ట్ చేశారు. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి తన ఆదాయానికి మించి స్విట్జర్లాండ్లో ఆస్తిని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆమె భర్త, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురించి కూడా ఆ ట్వీట్లలో ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో అదే ఏడాది లక్ష్మీ పురి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలేపై పరువునష్టం దావా వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. -
Jaipur Literature Festival 2023: త్రీలు– పని: నా డబ్బులు తీసుకో అనొద్దు
‘ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు?’ ‘ఇప్పుడు ఏం అవసరం వచ్చింది?’ ‘డబ్బులు కావాలా?’ ఈ ప్రశ్నలు స్త్రీలను పురుషులు అడుగుతారు. ‘డబ్బులు కావాలంటే నా డబ్బులు తీసుకో’ అని భార్యతో భర్త, కూతురితో తండ్రి, తల్లితో కొడుకు, చెల్లితో అన్న అంటారు. ‘నేను సంపాదించుకున్న నా డబ్బులు నాకు కావాలి’ అని స్త్రీలు చెప్తే వీరు తెల్లముఖం వేస్తారు. స్త్రీల ఇంటి పని (కేర్ వర్క్)కి విలువ ఇవ్వక, స్త్రీలు బయట పని చేస్తామంటే పట్టించుకోక పోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక తారతమ్యాలు తొలగడానికి ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం 120 ఏళ్లు పట్టనుందని శనివారం ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. భవిష్యత్తులో ‘కేర్ వర్క్’ పెద్ద ఉపాధి రంగం కానుందని తెలిపారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక అధ్యయనం చేసింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పనులు గిరాకీ కోల్పోయి ఎటువంటి పనులు గిరాకీలోకి వచ్చి ఉపాధిని ఏర్పరుస్తాయి అనేదే ఆ అధ్యయనం. అందులో దినదిన ప్రవర్థమానమయ్యే పని రంగంగా సంరక్షణా రంగం (కేర్ వర్క్) వచ్చింది. ఇంటి సంరక్షణ, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, ఇంటి శుభ్రత, ఇంటి ఆరోగ్యం... ఇవన్నీ కేర్ వర్క్ కింద వస్తాయి. ఈ కేర్ వర్క్ తరాలుగా స్త్రీలు చేస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న స్త్రీల చేత లెక్కా జమా లేని అతి తక్కువ వేతనాలకు చేయిస్తున్నారు. ఇంటిలో పని చేసే గృహిణుల కేర్ వర్క్కు విలువ కట్టడం లేదు. కేర్ వర్క్ను ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఒక ఉపాధి రంగంగా అభివృద్ధి చేస్తే తప్ప కేర్ ఎకానమీ స్వరూపం, ఉనికి, ఉపయోగం అర్థం కాదు. మగవాడు ఇంటి బయట జీతానికి చేసే పని ఒక్కటే పని కాదు. ఇంటి లోపల జీతం లేకుండా స్త్రీలు చేసే పని కూడా పనే’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో శనివారం జరిగిన ‘విమెన్ అండ్ వర్క్’ అనే సెషన్లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. వీరిలో ‘సిస్టర్హుడ్ ఎకానమి’ పుస్తకం రాసిన శైలి చోప్రా, ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద ‘దోజ్ మేగ్నిఫీషియెంట్ విమెన్ అండ్ దెయిర్ ఫ్లయింగ్ మెషిన్స్’ పుస్తకం రాసిన మిన్ని వైద్, ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ లక్ష్మి పురి ఉన్నారు. ‘స్త్రీలు ఉండదగ్గ చోటు ఇల్లు అనడమే పెద్ద అవరోధం. అన్ని చోట్లు స్త్రీలు ఉండదగ్గ చోట్లే. కాని ఇంట్లో ఉండటం వల్ల, బిడ్డను కనే శారీరక ధర్మం ఆమెకే ఉండటం వల్ల ప్రేమ, బాధ్యత అనే మాటల్లో ఆమెను పెట్టి ఇంటి పని చేయిస్తున్నారు. అంతులేని ఈ ఇంటి చాకిరికి విలువ ఉంటుందని స్త్రీ ఎప్పుడూ అనుకోదు. విలువ సంగతి అటుంచితే... అంత పని స్త్రీ నెత్తిన ఉండటం గురించి కూడా మాట్లాడరు. గ్లోబల్గా చూస్తే పురుషుల కంటే స్త్రీలు 2.9 శాతం ఎక్కువ పని చేస్తున్నారు. భారతదేశంలో ఇది పది శాతమైనా ఉంటుంది. స్త్రీ, పురుషుల శరీర నిర్మాణంలో భేదం ఉంది. కాని ఈ భేదం భేదభావంగా వివక్షగా మారడం ఏ మాత్రం సరి కాదు’ అని లక్ష్మి పురి అన్నారు. ‘స్త్రీలు పని చేస్తామంటే పురుషులు అడ్డంకులు వేస్తూనే ఉంటారు. ఎందుకు పని చేయడమంటే అది స్త్రీల లక్ష్యం కావచ్చు. ఎంపిక కావచ్చు. ఇష్టం కావచ్చు. ఆర్థిక స్వావలంబన కోసం కావచ్చు. నా డబ్బు తీసుకో ఉంది కదా అని భర్త, తండ్రి, కొడుకు అంటూ ఉంటారు. ఎందుకు తీసుకోవాలి. తాము సంపాదించుకున్న డబ్బు కావాలి అనుకోవచ్చు స్త్రీలు. భారతదేశంలో స్త్రీల జనాభా జపాన్ దేశపు జనాభాకు ఎనిమిది అంతలు ఉంటుంది. అంతటి జనాభా ఉన్నప్పటికీ మన దేశ స్త్రీల అభిప్రాయాలను, భావాలను పరిగణనలోకి తీసుకోరు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి’ అని శైలి చోప్రా అన్నారు. ‘మగవారి మధ్య బ్రదర్హుడ్ ఉంటుంది. స్త్రీల మధ్య సిస్టర్హుడ్ బలపడితే అన్నింటిని మార్చగలం. అందుకే నా పుస్తకానికి సిస్టర్హుడ్ ఎకానమీ అని పేరు పెట్టాను’ అన్నారామె. ‘ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద నేను పుస్తకం రాశాను. వాళ్ల నుంచి విన్న మొదటి మాట మహిళా అనొద్దు... మేమూ శాస్త్రవేత్తలమే... ప్రత్యేకంగా ఎంచడం వల్ల ఏదో ప్రోత్సహిస్తున్న భావన వస్తుంది అంటారు. చాలా బాగుంది. కాని ఇస్రోలో ఇప్పటికీ 16 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇస్రోకు మహిళా శాస్త్రవేత్త డైరెక్టర్ కాలేదు. ఎప్పటికి అవుతారో తెలియదు. మంగళయాన్ వంటి మిషన్ను స్త్రీలు విజయవంతం చేసినా... నా కుటుంబం సపోర్ట్ చేయడం వల్లే చేశాను... నా భర్త సపోర్ట్ చేయడం వల్లే చేశాను... వారు చేయనివ్వడం వల్ల చేశాను అని చెప్పుకోవాల్సి వస్తోంది. ‘చేయనివ్వడం’ అనేది స్త్రీల విషయంలోనే జరుగుతుంది. ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా భర్తో/కుటుంబమో వారిని ‘చేయనివ్వాలి’... ఈ స్థితి మహిళలకు ఎలాంటి మానసిక అవస్థను కలిగిస్తుందో మగవాళ్లకు తెలియదు. ఉద్యోగం చేస్తున్న స్త్రీ తారసపడితే ఆఫీసు, ఇల్లు ఎలా బేలెన్స్ చేసుకుంటున్నావు అని అడుగుతారు. మగవాడిని ఎందుకనో ఈ ప్రశ్న అడగరు’ అన్నారు మిన్ని వైద్. ‘కుటుంబ పరమైన, సామాజిక వొత్తిళ్ల వల్ల పిల్లలు కనే వయసులోని స్త్రీలు తమ వృత్తి, ఉపాధి నుంచి దూరమయ్యి పని చేయడం మానేస్తున్నారు. వారు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పని చేసే, చేయగలిగే వాతావరణం పూర్తి స్థాయి ఏర్పడాలంటే మగవాళ్లు ఇంకా మారాల్సి ఉంది’ అని ఈ వక్తలు అభిప్రాయ పడ్డారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
‘ఆమె’కు న్యాయం అందనంత దూరం!
వాషింగ్టన్: మహిళల ప్రాముఖ్యం గురించి ఎవరెన్ని చెప్పినా, భారత్లో లింగవివక్ష విపరీతంగా ఉందని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలపై వేధింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని పేర్కొంది. స్త్రీ-పురుషుల సమానత్వం (జెండర్ జస్టిస్) సాధనలో భారత్ చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం మహిళ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, మరింత కృషి అవసరమని ఐరాస మహిళ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీపురి అన్నారు. లైంగికహింస కేసులపై త్వరగా విచారణ ముగించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. వీరి సమస్యలపై సున్నితంగా వ్యవహరించేలా పోలీసులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. ‘జన్ధన్ యోజన మహిళలకు ఎంతగానో ఉపయోగపడింది. స్వచ్ఛభారత్, స్కిల్స్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతోనూ ఎంతో మేలు జరుగుతోంది. ఐరాసలోనూ మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం’ అని ఆమె వివరించారు. భారత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వారికి మరింత భద్రత అవసరమని అభిప్రాయపడ్డారు. వెనుకబడిన, పేదవర్గాల స్త్రీలూ చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని సమస్యల ఫలితాలు తక్షణం కనిపించబోవని, భవిష్యత్లో పర్యవసనాలు తప్పవని లక్ష్మి హెచ్చరించారు. ‘గత 70 ఏడు శతాబ్దాలుగా భారత్ చాలా అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ పితృస్వామిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల మహిళలు వెనుకబడే ఉంటున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగలేదు. లింగసమానత్వం ఇప్పటికీ కలగానే మిగిలింది. రాజకీయాల్లో మాత్రం కాస్త వృద్ధి కనిపించినా, ఆడసంతానాన్ని ఇప్పటికీ ఏవగించుకుంటున్నారు. విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందినా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే ప్రధాని మోదీ ‘బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే గృహహింసపై మహిళల్లో చైతన్యం పెరిగింది. ఇది నేరమని వాళ్లు గుర్తించే పరిస్థితి రావడం చాలా పెద్ద విజయం. చట్టసభల్లోనూ మహిళల ప్రాధాన్యం పెరగాలి’ అని లక్ష్మీపురి వివరించారు.