breaking news
lady advocate
-
Sarah: అదంతా సరే.. మరి.. ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’
ఆ అమ్మాయికి వినికిడి సమస్య ఉంది. మాటలు సరిగ్గా పలకవు. ‘లాయర్ కావాలి’ అనేది ఆమె బలమైన కల. చాటుమాటుగా వెక్కిరింపులు... ‘నీకెలా సాధ్యం అవుతుంది తల్లీ’ అని వెనక్కిలాగే మాటలు వినబడి ఉండొచ్చు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ‘లక్ష్యం కోసం బలంగా నిలబడితే, లోకం తనకు తానుగా దారులు తెరుస్తుంది’ అంటారు. ‘అవును. ఇది నిజం’ అని చెప్పడానికి నిలువెత్తు ఆత్మవిశ్వాసం...సారా. కేరళలోని కొట్టాయంకు చెందిన సన్నీ, బెట్టి దంపతులు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు పిల్లలు. దురదృష్టవశాత్తు ముగ్గురికి వినికిడి సమస్య ఉంది. నార్మల్ స్కూల్లోనే చదివించారు. మిగతా విద్యార్థులతో పోటీ పడుతూ చదువులో తమ ప్రతిభను చాటుకున్నారు పిల్లలు. ఎక్కడా ఆత్మన్యూనతకు గురికాకుండా అణువణువూ ఆత్మవిశ్వాసం ఉండేలా పిల్లలను పెంచారు తల్లిదండ్రులు. సారా, మరియాలు కవలపిల్లలు. లాయర్ కావాలనేది సారా చిన్నప్పటి కోరిక. ‘కచ్చితంగా అవుతావు తల్లీ’ అని తల్లిదండ్రులు ఆశీర్వదించారు తప్ప ఎప్పుడూ చిన్నబుచ్చలేదు. బెంగళూరులో బి.కామ్ పూర్తి చేసింది సారా. ఇప్పుడిక తన చిరకాల కోరికను నెరవేర్చుకునే ఆనందసమయం వచ్చేసింది అనుకుంది. ఒక లా కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తే సారాకు వినికిడి సమస్య ఉన్న కారణంగా నిరాకరించారు. అయితే చదువులో తన పూర్వ ప్రతిభను దృష్టిలో పెట్టుకొని సెయింట్ జోసెఫ్ లా కాలేజీ ఆడ్మిషన్ ఇచ్చింది. పాత క్లాస్మెట్ ఒకరు కూడా ఈ కాలేజీలో చేరడంతో తనకు సహాయంగా నిలిచినట్లయింది. కాన్స్ట్యూషనల్ లా, డిసెబిలిటీ లా, హ్యుమన్ రైట్స్లాను లోతుగా అధ్యయనం చేయాలనేది సారా కోరిక. సెయింట్ జోసెఫ్ కాలేజీలో నార్మల్ స్టూడెంట్స్తో పోటీ పడుతూ మంచిమార్కులు తెచ్చుకుంది. ‘లా’ పట్టా చేతికి వచ్చిన క్షణాలు తన జీవితంలో మరిచిపోలేని సమయం! ‘పట్టుదలతో కృషి చేస్తే, దారి ముందుకు వచ్చే అవరోధాలు తోకముడుస్తాయి’ అని మరోసారి గుర్తు చేసుకున్న సగర్వ సందర్భం. కర్నాటక బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయింది సారా. న్యాయశాస్త్రం చదువుకోవడం సరే ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’ అనే ప్రశ్నకు ‘ ఇంటర్ప్రెటర్ సహాయంతో’ అని జవాబు ఇచ్చింది సారా. సారా న్యాయవాద వృత్తిని ఎంచుకోవడానికి, న్యాయశాస్త్రం మీద ఆసక్తి, అభిమానాలతో పాటు వినికిడి సమస్య ఉన్న వాళ్లలో ‘యస్. నేను కూడా లాయర్ కాగలను’ అనే ఆత్మవిశ్వాసం నింపడం కూడా. చదవండి: Meenakshi Vashist: దీపం వెలిగింది -
లాయర్ మీద గ్యాంగ్రేప్పై నివేదిక కోరిన సుప్రీం
ఒక మహిళా న్యాయవాదిపై ఆమె భర్త తరఫు బంధువులు సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని నివేదికలు, పోలీసులు తీసుకున్న చర్యలు తదితరాలతో తనకు సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఛత్తీస్గఢ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్కు సూచించింది. గ్యాంగ్ రేప్ విషయంలో తనకు న్యాయం జరగలేదంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రాంగణంలో సోమవారం నాడు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళా న్యాయవాదికి పూర్తి రక్షణ కల్పించాలని తెలిపింది. సామూహిక అత్యాచారంపై తాను ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.