breaking news
Ks prakash Rao
-
Telugu Movie: 50 ఏళ్ల ‘ప్రేమనగర్’
కొన్ని కథలు భాషల హద్దులు చెరిపేసి, వెళ్ళిన ప్రతిచోటా బాక్సాఫీస్ చరిత్ర సృష్టిస్తాయి. అవి ప్రేమకథలైనప్పుడు, సంగీతం, సాహిత్యం, అభినయం, అలుపెరుగని నిర్మాణం లాంటివి తోడైనప్పుడు తరాలు మారినా చిరస్మరణీయం అవుతాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ – తెలుగు, తమిళ, హిందీ మూడింటిలో హిట్ రూపం – ‘ప్రేమనగర్’. ఒకదశలో ‘ద్రోహి’ (1970) లాంటి ఫ్లాప్ తర్వాత, రూ. 12 లక్షల నష్టంతో, మరొక్క దెబ్బతింటే సినిమాలొదిలి, సేద్యంలోకి వెళ్ళిపోవాలనుకున్న నిర్మాత డి. రామానాయుడునీ, ఆయన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనూ ఇన్నేళ్ళు సుస్థిరంగా నిలిపిన చిత్రం అది. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం, అక్కినేని – వాణిశ్రీ అపూర్వ అభినయం, ఆత్రేయ మాటలు – పాటలు, మహదేవన్ సంగీతం – ఇలా అన్నీ కలసి తెలుగు ‘ప్రేమనగర్’ను తీపిగుర్తుగా మార్చాయి. ప్రణయజీవుల ఊహానివాసం ‘ప్రేమనగర్’ (1971 సెప్టెంబర్ 24) రిలీజై, నేటికి 50 ఏళ్ళు. ఒకరు కొంటే, వేరొకరు తీశారు! ‘ప్రేమనగర్’ నిర్మాణమే ఓ విచిత్రం. అది తీయాలనుకున్నది మొదట రామానాయుడు కాదు. ‘ఆంధ్రప్రభ’ వీక్లీ సీరియల్గా హిట్టయిన కౌసల్యాదేవి నవల హక్కులు కొన్నది నిజామాబాద్కు చెందిన శ్రీధర్రెడ్డి. అక్కినేనితో తీయడానికి పాలగుమ్మి పద్మరాజు, చంగయ్య లాంటి ప్రసిద్ధులు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కె.ఆర్. విజయ హీరోయిన్. సిన్మా తీద్దామనుకున్న సమయంలో అనుకోని దుర్ఘటనలతో శ్రీధర్రెడ్డికి సెంటిమెంట్ పట్టుకుంది. ప్రాజెక్ట్ అటకెక్కింది. అప్పుడే అక్కినేని ‘దసరాబుల్లోడు’ రిలీజై, కలెక్షన్ల వర్షంతో హోరెత్తిస్తోంది. ఆయనతో సినిమా తీయాలనుకొన్న రామానాయుడికి ఈ స్క్రిప్టు విషయం తెలిసింది. రూ. 60 వేలకు కొని, హిట్ హీరోయిన్ వాణిశ్రీ జోడీగా ‘ప్రేమనగర్’ ప్రారంభించారు. ఆపైన అనేక నవలా చిత్రాలు తీసిన సురేష్ సంస్థకూ, రామానాయుడుకూ ఇదే తొలి నవలా ప్రయత్నం. దర్శకుడు ప్రకాశరావు, రచయిత ఆత్రేయ కృషితో నవలలో లేని అనేక అంశాలతో సెకండాఫ్ స్క్రిప్ట్ అంతా కొత్తగా తయారైంది. ఆ రోజుల్లోనే కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా అప్పలాచార్యతో రాయించారు. అప్పట్లో ‘దసరాబుల్లోడు’ రూ. 14 లక్షల్లో తీస్తే, అంతకన్నా ఎక్కువగా రూ. 15 లక్షల్లో కలర్లో తీయాలని సిద్ధపడ్డారు రామానాయుడు. వాహినీ స్టూడియోలో 1971 జనవరి 22న మొదలైన ‘ప్రేమనగర్’ కోసం కళా దర్శకుడు కృష్ణారావు వేసిన హీరో జమీందార్ ఇల్లు, ప్రేమనగర ఫుల్ఫ్లోర్ సెట్ సంచలనం. అది... ఆ ఇద్దరి అపూర్వ ట్రేడ్మార్క్ ఇలాంటి ప్రేమకథలు, విషాదదృశ్యాల అభినయాలు అక్కినేనికి కొట్టినపిండి. ‘దేవదాసు’ నుంచి ‘ప్రేమాభిషేకం’ దాకా తెరపై ఆ ఇమేజ్, ఆ గెటప్ ఆయనకే సొంతం. అయితే, ‘దసరాబుల్లోడు’, ఆ వెంటనే ‘ప్రేమనగర్’తో నటిగా వాణిశ్రీ ఇమేజ్ తారస్థాయికి చేరింది. ఇందులో ఆత్మాభిమానం గల నాయిక లత పాత్రలో ఆమె అభినయం అపూర్వం. కథానాయకుడి మొదలు కథంతా ఆ పాత్ర చుట్టూరానే తిరిగే ఈ చిత్రం ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్. ఆ తరువాత అనేక చిత్రాల్లో ఆత్మాభిమానం గల పాత్రలకు వాణిశ్రీయే ట్రేడ్మార్క్. ఇక, తలకొప్పు, మోచేతుల దాకా జాకెట్టు, ఆభరణాలు, అందమైన చీరలతో అప్పట్లో ఆమె ఫ్యాషన్ ఐకాన్ అయిపోయారు. అక్కడ నుంచి తెరపై ఆమె చూపిన విభిన్న రకాల స్టయిల్స్ తెలుగు స్త్రీ సమాజాన్ని ప్రభావితం చేయడం ఓ చరిత్ర. రిపీట్ రన్ల... బాక్సాఫీస్ నగర్! ‘ప్రేమనగర్’ రిలీజైన వెంటనే తొలి రెండు వారాలూ తెలుగునాట భారీ వర్షాలు. రామానాయుడికి కంగారు. ఆ రెండు వారాల అవరోధాలనూ అధిగమించి, సినిమా బాగా పికప్ అయింది. వసూళ్ళ వర్షం కురిపించింది. ‘దసరాబుల్లోడు’, వెంటనే ‘ప్రేమనగర్’ బంపర్ హిట్లతో 1971 అక్కినేనికి లక్కీ ఇయరైంది. అప్పట్లో 34 సెంటర్లలో రిలీజైన ఈ చిత్రం 31 కేంద్రాల్లో 50 రోజులాడింది. 13 కేంద్రాల్లో వంద రోజులు, షిఫ్టులతో హైదరాబాద్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అర్ధశతదినోత్సవం నాటికి అంతకు ముందు వసూళ్ళ రికారై్డన ‘దసరాబుల్లోడు’ను ‘ప్రేమనగర్’ దాటేసి, రూ. 33 లక్షల గ్రాస్తో కొత్త ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. అప్పటి నుంచి ‘ప్రేమనగర్’ ఎప్పుడు రిలీజైనా వసూళ్ళ వానే. అక్కినేని చిత్రాల్లోకెల్లా రిపీట్ రన్ల పరంగా నంబర్ 1 చిత్రమైంది. హార్ట్ ఆపరేషన్ తర్వాత అక్కినేని రెస్ట్ తీసుకున్న 1975లో ‘ప్రేమనగర్’ రిపీట్లో 50 రోజులు ఆడడం విశేషం. మూడు భాషలు... ముగ్గురు స్టార్లు... ‘ప్రేమనగర్’ కథను తెలుగు తర్వాత తమిళ, హిందీల్లోనూ దర్శకుడు ప్రకాశరావుతోనే తీశారు. తమిళ ‘వసంత మాళిగై’లో శివాజీగణేశన్ – వాణిశ్రీ జంట. హిందీ ‘ప్రేమ్నగర్’లో రాజేశ్ఖన్నా– హేమమాలిని జోడీ. మూడూ పెద్ద హిట్. అన్నిటికీ రామానాయుడే నిర్మాత. ‘విజయా’ నాగిరెడ్డి కుటుంబం ఈ 3 చిత్రాల నిర్మాణంలో భాగస్థులు. ఇప్పటికీ ఈ చిత్ర రైట్స్ తాలూకు రాయల్టీ ఆ కుటుంబాలకు అందుతుండడం ఈ సినిమా సత్తా. అన్నిటికీ పబ్లిసిటీ డిజైనర్ ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ డిజైనర్ ఈశ్వరే. ఈ చిత్రం ఆయన కెరీర్ను మరో మెట్టెక్కించింది. అంతకు ముందు ‘రాముడు – భీముడు’, తమిళంలో ‘ఎంగవీట్టు పిళ్ళై’, హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’గా 3 భాషల్లో హిట్. ఆ తరువాత ‘ప్రేమనగర్’ మూడు భాషల్లో హిట్. అక్కడ ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్ కుమార్. ఇక్కడ ఏయన్నార్, శివాజీ, రాజేశ్ఖన్నా. అదీ లెక్క. శివాజీ చిత్రాల్లో ‘వసంత మాళిగై’ డైరెక్ట్ 40 వారాలాడిన కెరీర్ బెస్ట్ హిట్. ఎనిమిదిన్నరేళ్ళ క్రితం ఆ తమిళ చిత్రాన్ని డిజిటల్గా పూర్తిగా పునరుద్ధరించి, స్కోప్లో 2013 మార్చి 8న రీరిలీజ్ చేస్తే, అప్పుడూ హిట్టే. మారిన పాటలు! మారని క్లైమాక్స్! ‘ప్రేమనగర్’లో ఆత్రేయ మాటలు, పాటలు జనం నోట నిలిచాయి. ‘కడవెత్తుకొచ్చిందీ..’, ‘నేను పుట్టాను..’ లాంటి మాస్ పాటలు, ‘తేటతేట తెలుగు’, ‘నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం..’ లాంటి క్లాస్ పాటలు ఇవాళ్టికీ మర్చిపోలేం. ‘తేటతేట తెలుగులా..’ పాట తెలుగులోనే ఉంది. తమిళ, హిందీ వెర్షన్లలో అలాంటి పాటే లేకుండా, సీన్తో వదిలేశారు. అలాగే, తెలుగులో క్లైమాక్స్లో హీరో విషం తాగి, ‘ఎవరి కోసం’ అంటూ పాట పాడడం విమర్శకు తావిచ్చింది. దాంతో తమిళ, హిందీల్లో జాగ్రత్తపడి, పాట పాడాక, విషం తాగేలా మార్చారు. తెలుగులో సుఖాంతం, విషాదాంతం 2 క్లైమాక్సులూ తీశారు. సుఖాంతంగా రిలీజ్ చేశారు. జనానికి నచ్చకపోతే ఉంటుందని ముందుజాగ్రత్తగా రెండో క్లైమాక్స్ రీలూ అందరికీ పంపారు. సుఖాంతానికి జై కొట్టడంతో, రీలు మార్చే పని రాలేదు. లవ్స్టోరీలకు ఇది సెంటిమెంట్ డేట్! ‘ప్రేమనగర్’ బాక్సాఫీస్ హిట్తో ఆ రిలీజ్ డేట్ సెంటిమెంట్ అయిపోయింది. సరిగ్గా పదేళ్ళకు 1981లో దాసరి దర్శకత్వంలో అక్కినేనితోనే రూపొందిన దేవదాసీ ప్రేమకథ ‘ప్రేమమందిరం’ చిత్రాన్నీ సెప్టెంబర్ 24నే రామానాయుడు రిలీజ్ చేశారు. మరుసటేడు దాసరి సొంతంగా, అక్కినేనితో నిర్మించిన ప్రేమకావ్యం ‘మేఘసందేశం’ రిలీజ్ డేటూ అదే. తాజాగా ఇప్పుడు అక్కినేని మనుమడు నాగచైతన్య లేటెస్ట్ ‘లవ్స్టోరీ’ ఇదే డేట్కి రిలీజ్ చేయడం విశేషం. – రెంటాల జయదేవ -
ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అక్కినేని చేసిన సినిమా ఇదే!
పాపులర్ నవలల్ని తెర మీదకు తెస్తే? అంతకన్నా సక్సెస్ ఫార్ములా ఇంకేముంటుంది! ‘సెక్రటరీ’... యద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల. ‘ప్రేమనజర్’ కాంబినేషన్ – దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, అక్కినేని, వాణిశ్రీ లతో సురేశ్మూవీస్ రామానాయుడుకు ‘నవలా చిత్రాల నిర్మాత’ అన్న పేరును సుస్థిరం చేసిన నవల. వంద ముద్రణలు జరుపుకొన్న ‘సెక్రటరీ’ నవలకు ఇప్పుడు 55 వసంతాలు. నవలను సినిమాగా తీసినప్పుడుండే సహజమైన విమర్శలు, భిన్నాభిప్రాయాల మధ్యనే శతదినోత్సవం జరుపుకొన్న ఆ నవలాధారిత చిత్రానికి 45 ఏళ్ళు. అంతర్జాతీయ మహిళా వత్సరం! అరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటి దాకా వంటింటికే పరిమితమైన మధ్యతరగతి అమ్మాయిలు చదువుకొని, కుటుంబ అవసరాల రీత్యా రెక్కలు విప్పుకొని, గడప దాటి ఉద్యోగాలు చేయడం అప్పుడప్పుడే మొదలైంది. మారుతున్న సమాజాన్నీ, చుట్టూ ఉన్న హైక్లాస్ ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ చూస్తూ... అటు మొగ్గలేని, ఇటు మధ్యతరగతి విలువలలో మగ్గలేని ఊగిసలాట ఉంది. ఆ నేపథ్యంలో సెక్రటరీ ఉద్యోగం చేసిన జయంతి అనే అమ్మాయి కథ – యద్దనపూడి రాసిన, రామానాయుడు తీసిన – ‘సెక్రటరీ’. 1975ను ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ కాలఘట్టంలో, నవల వెలువడ్డ పదేళ్ళకొచ్చిన చిత్రం ‘సెక్రటరీ’. రచనలోనూ, తెరపైనా చివరకు పురుషాధిక్యమే బలంగా కనపడినప్పటికీ, ‘‘ఒకరిలా ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను నేనుగా ఉండడమే నాకిష్టం’’ అనే వ్యక్తిత్వమున్న జయంతి పాత్రలో వాణిశ్రీ రాణించిన సందర్భమది. స్టార్ హీరోకు... సెకండ్ ఇన్నింగ్స్! మహిళాదరణ ఉన్న హీరోగా అక్కినేని కెరీర్లో ‘సెక్రటరీ’ది ప్రత్యేక స్థానం. అప్పట్లో గుండె జబ్బుకు చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళారు. తీరా అప్పటికప్పుడు 1974 అక్టోబర్ 18న ఆయనకు ఓపెన్ హార్ట్సర్జరీ చేశారు. డిసెంబర్ మొదట్లో స్వదేశానికి తిరిగొచ్చినా, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నారు. దాంతో, 1975లో ఆయన కొత్త సినిమాలేవీ రిలీజు కాలేదు. పాత ప్రాజెక్ట్ ‘మహాకవి క్షేత్రయ్య’ను కొనసాగించారు. కానీ, పూర్తిస్థాయిలో అక్కినేని రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది ‘సెక్రటరీ’తోనే! అక్కినేని మానసిక సంఘర్షణ... అప్పట్లో సారథీ స్టూడియో అందుబాటులో లేక, తాను ఒకప్పుడు కాదని వచ్చేసిన మద్రాసుకు మళ్ళీ షూటింగులకు వెళ్ళలేక అక్కినేని ఇరుకున పడ్డారు. అమెరికా పర్యటనకు ముందెప్పుడో మొదలై, కుంటినడక నడుస్తున్న ‘క్షేత్రయ్య’ పూర్తి చేయడం కోసం చివరకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చింది. కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు అక్కడ బెంగుళూరులో బొబ్బిలి రాజా ప్యాలెస్ కొని, 1969 నుంచి ‘చాముండేశ్వరీ స్టూడియోస్’ నిర్వహిస్తున్నారు. అక్కడ అక్కినేని తన ‘క్షేత్రయ్య’ షూటింగ్ జరపాల్సి వచ్చింది. అప్పుడిక విధి లేక... సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో, ‘అన్నపూర్ణా స్టూడియోస్’కు శ్రీకారం చుట్టారు. నిర్మాత దుక్కిపాటి సహా శ్రేయోభిలాషులు వద్దన్నా సరే... అక్కినేని సాహసించారు. అక్కడ తొలి షూటింగ్... ఇదే! అన్నపూర్ణా స్టూడియోస్ 1976 జనవరి 14 సాయంత్రం నాలుగు గంటల వేళ ప్రారంభమైంది. అప్పట్లో కొండలు, గుట్టలుగా, సరైన రోడ్డు కూడా లేని ప్రాంతం అది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అండతో అక్కినేని స్వయంగా దేశ రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రథమ పౌరుడి ప్రోటోకాల్ ఏర్పాట్లతో స్టూడియోకు రోడ్డు పడింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీసమేతంగా వచ్చి, స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి స్టూడియోలో ఒక్క ఫ్లోరే సిద్ధమైంది. ఆ ఫ్లోర్లోనే ‘సెక్రటరీ’ మొదలెట్టారు నిర్మాత రామానాయుడు. సినీపరిశ్రమను హైదరాబాద్కు తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ప్రోత్సా హాలకు అనుగుణంగా ఆవిర్భవించిన అన్నపూర్ణా స్టూడియోలో చిత్రీకరణైన తొలిచిత్రం ‘సెక్రటరీ’. ఆ కథ ఎన్నో చేతులు మారి... జయంతి (వాణిశ్రీ), రాజశేఖరం (అక్కినేని) నాయికా నాయకులు. ఎదుటపడితే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. చాటున మాత్రం ఒకరినొకరు తలుచుకుంటారు. ఒకరికి పొగరు. వేరొకరికి బిగువు. పొగరు దిగి, బిగువు సడలి ఇద్దరి మధ్య ఎలా జత కుదిరిందన్నది ‘సెక్రటరీ’ కథ. దీన్ని సీరియల్గా రాసేటప్పటికి యద్దనపూడికి నిండా పాతికేళ్ళు లేవు. గర్భవతి. అలా 1964 – 65ల్లో ఆమె రాసిన ఆ నవల ఓ ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో పడవ లాంటి కారు, మేడ, తోట, నౌకర్లున్న ఆరడుగుల అందగాడైన రాజశేఖరం లాంటి అబ్బాయి తమకు భర్త కావాలని కోరుకోని మధ్యతరగతి అమ్మాయిలు లేరు. అలాగే, ఆత్మాభిమానం నిండిన జయంతిలో తమను తాము వారు చూసుకున్నారు. 1966లో తొలి ముద్రణ నుంచి ఇప్పటికి వంద ఎడిషన్లు... వేల కాపీలు... లక్షలాది పాఠకాభిమానంతో తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల – ‘సెక్రటరీ’. అప్పట్లో ఆ నవలను తెరకెక్కించాలని చాలామంది అనుకున్నారు. ఆ నవల ఎన్నో ఏళ్ళు, ఎందరి చేతులో మారింది. చివ రకు రామానాయుడికి ఆ అదృష్టం దక్కింది. అప్పటికే పాపులర్ నవలల ఆధారంగా వరుసగా ‘ప్రేమనగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’ చిత్రాలు తీసిన ఆయన ‘సెక్రటరీ’ని రిచ్గా నిర్మించారు. ఆ పాటలు... ఆ వ్యూహాలు! ‘సెక్రటరీ’ కన్నా నెల రోజుల ముందు ‘క్షేత్రయ్య’ (1976 మార్చి 31) రిలీజైంది. దాన్ని పక్కనపెడితే, ‘దొరబాబు’ (1974 అక్టోబర్ 31) తర్వాత దాదాపు ఏణ్ణర్ధం గ్యాప్తో జనం ముందుకు అక్కినేని ఉత్సాహంగా వచ్చిన సినిమా ‘సెక్రటరీ’యే (1976 ఏప్రిల్ 28)! నవలా చిత్రమనే క్యూరియాసిటీ, మంచి పాటలు కలగలిసి సినిమా రిలీజుకు మంచి క్రేజు వచ్చింది. ఆ రోజుల్లో అనూహ్యమైన అడ్వా¯Œ ్స బుకింగ్తో కలకలం రేపింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. రామకృష్ణ గళంలో హుషారు గీతం ‘నా పక్కనచోటున్నది ఒక్కరికే...’, ఆత్రేయ మార్కు విషాద రచన ‘మనసు లేని బ్రతుకొక నరకం...’ పాటలు హిట్. ప్రేక్షక జనాకర్షణ కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మంచి వ్యూహాలే వేశారు. నవలలోని పాత్రలకు జనంలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, సినిమా టైటిల్స్లో తారల పేర్ల బదులు వారి ఫోటోలు పెట్టి, రాజశేఖరం, జయంతి లాంటి నవలా పాత్రల పేర్లే వేశారు. ‘మొరటోడు నా మొగుడు..’ పాటను సినిమా రిలీజైన కొన్నాళ్ళకు కొత్తగా కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో దక్షిణాది, ఉత్తరాది సినీతారల మధ్య హైదరాబాద్ ఎల్బీ స్టేడియమ్లో బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రిలీజైన అయిదారు వారాలకు ‘సెక్రటరీ’తో పాటు ఆ మ్యాచ్ దృశ్యాల రీలును ప్రదర్శించారు. కానీ, భారీ అంచనాలతో హాలుకొచ్చిన నవలా పాఠకుల ఊహలను సినిమా అందుకోలేకపోయింది. ‘సక్సెసైనా, మేము ఆశించిన అద్భుత విజయం దక్కలేదు. రిపీట్ రన్లో లాభాలొచ్చాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. 6 కేంద్రాల్లో ‘సెక్రటరీ’ వంద రోజులు పూర్తిచేసుకుంది. ‘‘చదవడానికి బాగున్న ‘సెక్రటరీ’లో బాక్సాఫీస్ సూత్రాలు తక్కువ’’ అంటూ, ‘‘ఈ నవలను సిన్మా తీయడం తేలికైన పని కాదు’’ అని స్వయంగా అక్కినేనే శతదినోత్సవ వేదికపై విశ్లేషించారు. ఏమైనా, ‘సెక్రటరీ’ నవల, ఈ నవలా చిత్రం ఇన్నేళ్ళు గడిచినా ఆ తరానికి ఓ తరVýæని పాత జ్ఞాపకాల పేటిక! ‘సారథీ’తో ‘దేవదాసు’ వివాదం ‘సెక్రటరీ’కి ముందు అక్కినేనికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. నవయుగ ఫిలిమ్స్ వారు అక్కినేనికి సన్నిహితులు. నవయుగ వారి సోదర పంపిణీ సంస్థ ‘శ్రీఫిలిమ్స్’లో అక్కినేని భాగస్వామి! హైదరాబాద్ షిఫ్టయి, ఇక్కడే సినిమాలు చేస్తానంటున్న తమ హీరో అక్కినేని కోసం నవయుగ వారు నష్టాల్లో ఉన్న సారథీ స్టూడియోను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. 1971 ప్రాంతంలో అక్కినేని ‘అన్నపూర్ణా ఫిల్మ్స్’ అని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాగా, 1974లో శ్రీఫిలిమ్స్ ఆర్థిక సహకారంతో హీరో కృష్ణ కలర్లో ‘దేవదాసు’ తీయడం సంచలనమైంది. అమెరికాకు వెళ్ళే ఆరు నెలల ముందు అక్కినేని తన పాత ‘దేవదాసు’ హక్కులు కొన్నారు. కృష్ణ ‘దేవదాసు’(1974 డిసెంబర్ 6)కు పోటీగా వారం ముందు ఈ పాతది రిలీజ్ చేయించారు. కృష్ణ ‘దేవదాసు’కు డబ్బులు పెట్టిన తాము నష్టపోతామని నవయుగ వారు వారించినా, అక్కినేని వినలేదు. ఆ పోటీలో కృష్ణ ‘దేవదాసు’ ఫ్లాపైంది. దాంతో, మనసుకు కష్టం కలిగిన నవయుగ వారు ఆ డిసెంబర్ 10న అమెరికా నుంచి వచ్చాక అక్కినేని ‘క్షేత్రయ్య’ షూటింగ్కు సారథీ స్టూడియో ఇవ్వడం ఆపేశారు. ‘నష్టాల వల్ల స్టూడియో మూసేశాం’ అన్నారు. ఇక, తప్పక అక్కినేని అన్నపూర్ణా స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఆ జంట... సూపర్ హిట్! అది వాణిశ్రీ హవా సాగుతున్న కాలం. ఆమె కట్టిందే చీరగా, పెట్టిందే బొట్టుగా, చుట్టిందే కొప్పుగా జనం నీరాజనం పడుతున్న సమయం. 1970ల మొదట్నించి ఏడెనిమిదేళ్ళు ఏ సినిమా చూసినా వాణిశ్రీయే! ఏయన్నార్తో ‘సెక్రటరీ’ నాటికి ఎన్టీఆర్ (‘ఆరాధన’), కృష్ణ (‘చీకటి వెలుగులు’), శోభన్బాబు (‘ప్రేమబంధం’), కృష్ణంరాజు (‘భక్త కన్నప్ప’) – ఇలా పేరున్న ప్రతి హీరో పక్కనా ఆమే! ఆ ఊపులో వచ్చిన ‘సెక్రటరీ’, ఆమె జయంతి పాత్ర జనంలో బోలెడంత ఆసక్తి రేపాయి. శతదినోత్సవ చిత్రం చేశాయి. అక్కినేని – వాణిశ్రీలది అప్పుడు హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో ‘సెక్రటరీ’ దాకా ఆ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సిన్మా లేదు. ఆ ఆరేళ్ళలో తెలుగు సినీ రాజధాని విజయవాడలో రిలీజైన హాలులోనే వంద రోజులాడిన అక్కినేని 8 చిత్రాల్లోనూ వాణిశ్రీయే హీరోయిన్ (1971 – దసరాబుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్. 1972 – విచిత్ర బంధం, కొడుకు – కోడలు. 1973 – బంగారుబాబు. 1974 – మంచివాడు. 1976 – సెక్రటరీ). ఇక అదే కాలంలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘దత్తపుత్రుడు’ (1972) కూడా ఎబౌ ఏవరేజ్గా నిలిచి, షిఫ్టులతో శతదినోత్సవం చేసుకోవడం విశేషం. అదే సమయంలో ఇతర హీరోలతోనూ వాణిశ్రీకి మరో ఆరేడు శతదినోత్సవ విజయాలుండడం గమనార్హం. అలా ఆమె ఆ కాలంలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. చివరకు సాక్షాత్తూ అక్కినేని సైతం, ‘‘ఈ ‘సెక్రటరీ’లో నేను నటించకపోయినా ఫరవాలేదు కానీ, వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయవంతం కాదనే నమ్మకం నాకు కలిగింది’’ అని శతదినోత్సవ వేదికపై బాహాటంగా ఒప్పుకోవడం మరీ విశేషం. అన్నపూర్ణా స్టూడియోస్... అలా కట్టారు! ‘‘నాకు నటించడానికి హైదరాబాద్లో చోటు లేదని తెలిశాక... నేను విపరీతంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంది అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణానికి ముందు’’ అని అక్కినేని అప్పట్లో తన మానసికస్థితిని వివరించారు. మనుమడు – నేటి హీరో చిన్నారి సుమంత్, పెద్ద కుమారుడు వెంకట్ చేతుల మీదుగా 1975 ఆగస్టు 13 ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్కు శంకుస్థాపన చేయించారు అక్కినేని. ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల స్థలంలో... కొండలను పిండి కొట్టి, బండరాళ్ళను పగలగొట్టి, ఎంతో కష్టం మీద స్టూడియో నిర్మాణం సాగించారు. ఒకపక్క ‘క్షేత్రయ్య’ కోసం తరచూ బెంగుళూరు వెళ్ళి వస్తూ, మరోపక్క ఈ నిర్మాణం పనుల్లో తలమునకలయ్యారు. ‘‘ఇంజనీర్లు లేరు. బండరాళ్ళు కొట్టించడం దగ్గర నుంచి డిజైన్లు, ఇతర ప్లాన్లు వేసుకోవడం వరకూ అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది’’ అని అక్కినేని ఓసారి చెప్పారు. అంతకు ముందు ‘అక్కినేని 60 సినిమాల పండుగ’కు సొంత ఖర్చుతో మద్రాసులో ‘విజయా గార్డె¯Œ ్స’ సిద్ధం చేసిన నిర్మాత బి. నాగిరెడ్డి ఈసారి హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణంలోనూ సలహాలు, సూచనలిచ్చారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా పనివాళ్ళను పంపించారు. ∙అన్నపూర్ణా స్టూడియోస్ తొలి నవలే... సెన్సేషన్ యద్దనపూడి తొలి నవలే ‘సెక్రటరీ’. అప్పట్లో విజయవాడ నుంచి ‘జ్యోతి’ మంత్లీ రాఘవయ్య ప్రారంభించారు. ఆ పత్రిక నడిపిన బాపు – రమణలు కోరగా యద్దనపూడి రాసిన నవల ఇది. అనంతర కాలంలో ‘నవలా రాణి’గా పేరు తెచ్చుకున్న యద్దనపూడి, నిజానికి ‘‘వాళ్ళు అడిగినప్పుడు, నేను కథలే రాశా. నవల రాయడం తెలీదు. ఎప్పుడూ రాయలేదన్నా’’రు. కానీ బాపు – రమణ, ‘‘మీరు రాయగలరు. మరేం లేదు... పెద్ద కథ రాసేయండి’’ అని భరోసా ఇచ్చారు. నవల పేరేమి వేద్దామంటే, అప్పటికప్పుడు యద్దనపూడి ఇంట్లోని తనకిష్టమైన సరస్వతీదేవి బొమ్మ దగ్గర తెల్లకాగితంపై ‘సెక్రటరీ – రచన యద్దనపూడి సులోచనారాణి’ అని రాసిచ్చారు. ఆమె నవలా హీరో చిత్రనిర్మాణవేళలోనే ‘సెక్రటరీ’కి బోలెడంత క్రేజు రావడానికి కారణం నవల. ‘సెక్రటరీ’ మంత్లీ సీరియల్ వచ్చిన రోజుల్లోకి వెళితే... తెలుగులో పాపులర్ సాహిత్యాన్ని మహిళలు ఏలడం మొదలైన కాలమది. లత, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి లాంటి పాపులర్ రచయిత్రుల వెనుక వచ్చి, రేసులో వారిని దాటి దూసుకుపోయిన పేరు యద్దనపూడి. కన్నెవయసులో బందరులో ‘తోడికోడళ్ళు’ సినిమా చూసి, హీరో అక్కినేనిని కలల నిండా నింపుకొన్న యద్దనపూడి, తాను సృష్టించిన కలల లోకపు నవలలకు అదే అక్కినేని కథానాయకుడై ప్రాణం పోస్తాడని ఊహించలేదు. అక్కినేని నటించిన ‘ఆత్మీయులు’, ‘విచిత్ర బంధం’, ‘బంగారు కలలు’, ‘సెక్రటరీ’ చిత్రాలు యద్దనపూడి నవలలే! – రెంటాల జయదేవ -
బాహుబలి నిర్మాతల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..?
ఆర్కా మీడియా.. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన నిర్మాణ సంస్థ. కేవలం ఐదు సినిమాలు చేసిన అనుభవంతోనే బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను తెరకెక్కించారు. కథ మీద నమ్మకంతో వంద కోట్లతో ఓ రీజినల్ సినిమాను రూపొందించిన ఈ నిర్మాతలు బాహుబలి తరువాత ఎలాంటి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే బాహుబలి 2 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్ పనులు కూడా మొదలు పెట్టారు. ఏప్రిల్ 28న బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఆ తరువాత మరో నెల రోజుల పాటు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండనుంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన బాహుబలి నిర్మాతల నెక్ట్స్ సినిమా ఏంటి..? మరోసారి ఇలాంటి భారీ చిత్రాన్నే రూపొందిస్తారా..? లేక రెగ్యులర్ సినిమా చేస్తారా..? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగు సినిమా అభిమానులతో పాటు సినీ వర్గాల మదిలోనూ మెదులుతుంది. అయితే బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత ఓ మీడియం రేంజ్ సినిమాను ప్లాన్ చేస్తోంది ఆర్కా మీడియా సంస్థ. యంగ్ హీరో శర్వానంద్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ రావు దర్శకత్వంలో సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలో అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు మార్నింగ్ రాగా లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాతో ఆకట్టుకున్న ప్రకాష్, శర్వానంద్ హీరోగా ఎలాంటి సినిమా చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఆర్కా మీడియా తదుపరి చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.