breaking news
Koran
-
ఆధ్యాత్మికతకు స్మార్ట సొబగులు
‘యాప్’లలో పవిత్ర ‘ఖురాన్’ గ్రంథం రంజాన్ మాసంలో పెరుగుతున్న వినియోగదారులు అరబిక్, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో దివ్య ‘ఖురాన్’ యాప్లు బెంగళూరు: ఆధ్యాత్మికత ఆధునిక సాంకేతిక సొబగులను అద్దుకుంటోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. పవిత్ర ‘ఖురాన్’ గ్రంథాన్ని యాప్ల రూపంలో స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. రంజాన్ మాసం సందర్భంగా ప్రస్తుతం ఈతరహా యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఐటీ నగరిగా ప్రఖ్యాతి గాంచిన బెంగళూరు నగరంలో ‘ఖురాన్’కు సంబంధించిన కొన్ని యాప్లకు 10వేలకు పైగా డౌన్లోడ్లు నమోదవుతున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో పాటు ఖురాన్ పఠనానికి సైతం ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఉద్యోగులుగా ఉన్న వారు, ఇతర విధుల నిర్వహణలో ఉన్న వారికి ఖురాన్ పఠనానికి అవసరమైన సమయాన్ని కేటాయించడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో విధులను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొనసాగేందుకు వీలుగా యాప్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్లలో దివ్య ‘ఖురాన్’తో పాటు ‘దువా’, ‘హదీస్’, ‘మహమ్మద్ ప్రవక్త(స) జీవిత విశేషాలతో కూడిన కథలు’ కూడా పొందుపరచబడి ఉన్నాయి. ‘ఖురాన్’ను చదవడమే కాదు, వినగలిగేలా ఆడియో పొందుపరిచిన యాప్లు సైతం ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్లలో అందుబాటులో ఉన్నాయి. అరబిక్ భాషలోనే కాకుండా తెలుగు, కన్నడ, బెంగాళీ తదితర భాషల్లో సైతం ఈ యాప్లలో దివ్య ‘ఖురాన్’అందుబాటులో ఉంది. ‘ఐఖురాన్’, ‘అల్ ఖురాన్’ వంటి అనేక యాప్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దివ్య ‘ఖురాన్’ పఠనం కోసం తాను ‘ఐఖురాన్’ యాప్ను వినియోగిస్తున్నానని నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న తబస్సుమ్ చెబుతున్నారు. ‘మేము యశ్వంతపుర ప్రాంతంలో నివసిస్తున్నాం. పనిచేస్తున్న ఆఫీసు సర్జాపురలో ఉంది. రోజుకు నాలుగు గంటలు ఆఫీసు బస్సులో ప్రయాణం చేస్తాను. ఈ నాలుగు గంటల కాలంలో పవిత్ర ‘ఖురాన్’ గ్రంధాన్ని పఠించేందుకు నిర్ణయించుకొని ‘ఐఖురాన్’ యాప్ను నా స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాను. నా స్నేహితులు కూడా చాలా మంది ప్రస్తుతం ఈ తరహా యాప్లలోనే పవిత్ర ‘ఖురాన్’ గ్రంథాన్ని పఠించడంతో పాటు మహమ్మద్ ప్రవక్త(స) జీవిత విశేషాలను తెలుసుకోగలుగుతున్నారు. ‘దివ్య ఖురాన్’ పేరిట ఉన్న యాప్లో పవిత్ర ‘ఖురాన్’ గ్రంథం కన్నడ భాషలో సైతం అందుబాటులో ఉంది’ అని చెప్పారు. -
నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు
ఆకాశంలో నెలవంక దర్శనం న్యూఢిల్లీ/హైదరాబాద్: ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో రుయత్ హిలాల్ కమిటీ సదర్ మజ్లీస్ ఉలేమా ఈ దక్కన్తో పాటు పలు హిలాల్ కమిటీలు ఈ మేరకు ప్రకటించాయి. రంజాన్ మాసపు మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున సహార్తో మొదలైంది. హైదరాబాద్లో చారిత్రక మక్కా మసీదులో ముస్లిం సోదరులు సోమవారం రాత్రి ఇషా నమాజ్, అనంతరం రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం చేశారు. మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటల సహార్తో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం6.55 గంటలకు ఉపవాస దీక్ష విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. -
ధర్మానుసరణతోనే జీవితాల్లో శాంతి
సృష్టి ప్రారంభం నుండి, సృష్టికర్త మానవ మనుగడ కోసం ఒక జీవన వ్యవస్థను, ధర్మాన్ని అవతరింపజేశాడు. తన ఇష్టాన్ని, అయిష్టాన్నీ ఎరుకపరిచాడు. సాఫల్య వైఫల్యాల మార్గాలను విస్పష్టంగా తెలియజేశాడు. ఏవిధమైన జీవన విధానాన్ని అవలంబిస్తే ఇహపరలోకాల్లో సుఖశాంతులు, సంతృప్తి సాఫల్యాలు పొందవచ్చునో, ఏ విధానంలో ఇహ పర కష్టనష్టాలు, అశాంతి, అసంతృప్తులు, వైఫల్యాలు ఉన్నాయో వివరించాడు. తన మనోభీష్టాన్ని ప్రజలకు వివరించి, ముక్తి, మోక్షాల మార్గం చూపడానికి వారి నుండే ప్రవక్తలను ఎంచుకున్నాడు. వారిపై తన ఆదేశాలను అవతరింపజేశాడు. దైవాదేశాలకనుగుణంగా, దైవ సందేశహరులు ఎప్పటికప్పుడు ప్రజలకు మార్గదర్శకం వహిస్తూ, వారిని రుజుమార్గంపై నడపడానికి ప్రయత్నించారు. దైవం, దైవప్రవక్తల ఉపదేశాలకనుగుణంగా, ధర్మానుసరణలో జీవితం గడిపినంతకాలం మానవ సమాజం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉంది. ఎప్పుడైతే జీవన విధానంలో అధర్మం ప్రవేశించిందో, అప్పుడే మానవాళికి కష్టాలు ప్రారంభమయ్యాయి. జీవితంలో శాంతి కరువైపోయింది. ఈవిధంగా మానవులు సన్మార్గం తప్పి వక్రమార్గం పట్టినప్పుడల్లా, దైవం వారిని మళ్లీ రుజుమార్గంపైకి తీసుకురావడానికి, వారి జీవన విధానాన్ని గుర్తు చేసి వైఫల్యాల నుండి రక్షించడానికి, వారిలో నుండే ఉత్తములైన వారిని ఎంపిక చేస్తూ వచ్చాడు. దాదాపు లక్షా ఇరవైనాలుగువేలమంది మహనీయులను దైవం తన సందేశహరులుగా నియమించినట్లు ధర్మశాస్త్రగ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ పరంపరలోని చివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఈయన ద్వారా ధర్మం సంపూర్ణమైంది. ఇక ప్రళయం వరకు జన్మించే మానవులందరికీ ముహమ్మద్ ప్రవక్త (స)మార్గదర్శకత్వమే అనుసరణీయం. ఎందుకంటే, ఈయనకంటే ముందు నియమితులైన దైవప్రవక్తలందరూ ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కాలానికో పరిమితమయ్యారు. అలాగే ఆద్ జాతి వారికి ‘హూద్’ (అ) ప్రవక్తగా నియమితులయ్యారు. అదేవిధంగా మూసా, ఈసా (అ.ముస్సలా)లు తమ తమ జాతి జనులకు మాత్రమే (ఇశ్రాయేలు సంతతి) ప్రవక్తలుగా నియమించబడ్డారు. కాని ముహమ్మద్ ప్రవక్త (స) సమస్త మానవాళికీ మార్గదర్శిగా వచ్చారు. ప్రళయకాలం వరకు వచ్చే మానవులందరికీ ఆయన కారుణ్యంగా ప్రభవించారు. ఆయన జీవన విధానం మానవాళికంతటికీ ఆదర్శమని, సమస్త మానవాళికీ ఆయన కారుణ్యమనీ పవిత్ర ఖురాన్ స్పష్టం చేసింది. (ముహమ్మద్:) మేము నిన్ను యావత్తు ప్రపంచవాసుల పాలిట కారుణ్యంగా చేసి పంపాము. (అంబియా 107)‘ప్రవక్త జీవన విధానంలో మీకు మంచి ఆదర్శం ఉంది’ (అహెజాబ్ 21). కనుక ముహమ్మద్ ప్రవక్త (స) ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక భాష మాట్లాడే వారికో లేక ఒక కాలానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన అందరి ప్రవక్త. విశ్వజనీన ఆదర్శమూర్తి. విశ్వకారుణ్యమూర్తి. ఆయన ద్వారానే ధర్మం పరిపూర్ణమైంది. ఆయన మాటను, ఆయన బాటను అనుసరించడంలోనే మానవుల సాఫల్యం ఉంది. ఏకేశ్వరారాధనలోనే మానవుల ఇహపర సాఫల్యాలు ఉన్నాయని ముహమ్మద్ ప్రవక్త (స) స్పష్టం చేశారు. స్వార్థాన్ని వీడితేనే శాంతి దొరుకుతుందని సెలవిచ్చారు. బుద్ధిని ఉపయోగిస్తేనే నిజాలు వెల్లడవుతాయని ప్రవచించారు. అంధానుకరణ అజ్ఞానంలోకి నెట్టివేస్తుందని హెచ్చరించారు. కాబట్టి, జీవితాల్లో సుఖశాంతులు పరిఢవిల్లాలంటే, మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి సిద్ధించాలంటే, ఇహలోకంంతోపాటు, పరలోక సాఫల్యం పొందాలంటే తు.చ. తప్పకుండా దైవధర్మాన్ని అనుసరించాలి. దైవాదేశాలు, ప్రవక్త ప్రవచనాల వెలుగులో జీవితాలను సమీక్షించుకుంటూ జీవనయానం కొనసాగించాలి. అప్పుడే శాంతి సాఫల్యాలు సొంతమవుతాయి. - యండి. ఉస్మాన్ఖాన్