breaking news
kodigenahalli
-
జాలిలేని దేవుడు.. కష్టాలకే కన్నీళ్లొచ్చె..
కూతుళ్లు పుడితే ఇంటికే వెలుగు అనుకుంటాం.. మహాలక్ష్మిగా భావిస్తాం.. ఆ ఇంట ఇద్దరు లక్ష్మిలు జన్మించారు. తల్లిదండ్రులు మురిసిపోయారు.. మురిపెంగా చూసుకున్నారు.. చిన్నకూతురికి ఏడాదిలోపే తల్లి దూరమైంది.. తండ్రి అన్నీ తానే అయ్యాడు. ఆలనాపాలనా చూసుకుంటుంటే.. అంతలోనే అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. ఆదరణ కరువైంది. ఆకలేస్తే అన్నం లేదు.. తలదాచుకోను ఇల్లులేదు. ఎటు వెళ్లాలో దిక్కుతోచలేదు. చెల్లిని చదివించేందుకు అక్క చదువు మానేసింది. కూలిపనులకెళ్లి పూట గడుపుకుంటున్నారు. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తే.. బాగా చదువుకుంటామని అక్కాచెల్లెల్లు చెప్తున్నారు. పరిగి: కొడిగెనహళ్లి పంచాయతీ ఎస్సీ కాలనీకి చెందిన కూలీ కె.హనుమంతప్ప, నరసమ్మ దంపతులు. వీరికి యశోద, ఐశ్వర్య కుమార్తెలు. చిన్నమ్మాయికి ఏడాది వయసున్నపుడు అంటే 14 ఏళ్ల కిందట తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి కూతుళ్ల ఆలనాపాలనా హనుమంతప్పే చూసుకుంటూ వచ్చాడు. ఐదేళ్ల కిందట ఆయన కూడా ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డాడు. అప్పటికి యశోద ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఇక పోషించేవారు లేకపోవడంతో చిన్నాన్నకు చెందిన ఓ చిన్న గదిలో అక్కచెల్లెల్లిద్దరూ తలదాచుకుంటున్నారు. స్నానం చేసుకోవడానికి కూడా సరైన వసతి లేదు. చిన్నపాటి వర్షం వచ్చినా కారుతోంది. ఇద్దరూ చదువుకోవాలంటే సాధ్యపడదని గ్రహించిన యశోద చదువు మానేసింది. చెల్లి చదువు కోసం.. చెల్లి ఐశ్వర్యనైనా చదివిద్దామని యశోద నిర్ణయించుకుంది. కుటుంబ భారం, చెల్లి చదువును తన భుజానకెత్తుకుంది. అర కిలోమీటరు దూరంలో ఉన్న ఓ నర్సరీలో మొక్కలకు నీరు పెట్టేందుకు వెళ్తోంది. అయితే అక్కడ నీరు పెట్టినందుకు రోజుకు రూ.50 మాత్రమే ఇస్తున్నారు. ఆ మొత్తంతోనే రోజులు నెట్టుకుంటూ వస్తున్నారు. చెల్లి ఐశ్వర్య సేవామందిరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మేమున్నామని.. మీకేం కాదని.. తల్లిదండ్రుల ఆలనాపాలనకు నోచని అమ్మాయిల కష్టం గురించి తెలుసుకున్న తహసీల్దార్ సౌజన్యలక్ష్మీ, ఎంపీడీఓ రామారావు, ఎస్ఐ శ్రీనివాసులు, పలువురు స్వచ్ఛంద సంస్థ, ప్రజాసంఘాల ప్రతినిధులు శుక్రవారం కొడిగెనహళ్లి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం వేదికగా స్పందించారు. వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అమ్మాయిల సంరక్షణ బాధ్యతలను తాను తీసుకుంటానని సర్పంచ్ శ్రీరామప్ప హామీ ఇచ్చారు. యశోద, ఐశ్వర్యలకు అండగా ఉంటామని దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పరిగి వేణుగోపాలరావు తక్షణసాయంగా రూ.10 వేల నగదు అందజేశారు. అదే విధంగా ప్రముఖ సామాజక కార్యకర్త, వైఎస్సార్సీపీ నేత శివరామిరెడ్డి తన వంతుగా రూ.10 వేలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మారుతీరెడ్డి సైతం రూ.5 వేలు తక్షణ సాయంగా అందజేశారు. హిందూపురం కౌన్సిలర్ సతీష్, ఆర్టీసీ డిపో కంట్రోలర్ బాబయ్య సంయుక్తంగా రూ.5 వేలు ఇచ్చారు. భగత్సింగ్ సేవాసమితి రూ.5 వేలు, ఇరిగేషన్ పెనుకొండ డీఈ గోపి రూ.3 వేలు, జెడ్పీ స్కూల్ హెచ్ఎం దిల్షాద్ బేగం రూ.5 వేలు, విశ్రాంత హెచ్ఎం ఓబులేసు, ఏఎం లింగణ్ణ కాలేజ్ అధ్యాపకుడు రామాంజి తనవంతుగా రూ. 2 వేలతో పాటు నిత్యావసర సరుకులను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. బాగా చదువుకుంటాం అమ్మ, నాన్న లేని జీవితం మాకు శూన్యంగా అనిపించింది. ఆలన, పాలన చూడాల్సిన వారు లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసింది. దాతలు సహకరిస్తే బాగా చదువుకుంటాం. – యశోద, ఐశ్వర్య ఆర్థికసాయం అందించాలనుకుంటే... పేరు : కె.యశోద అకౌంట్ నంబర్ : 31382210019948 కెనరా బ్యాంకు, కొడిగెనహళ్లి బ్రాంచి. ఐఎఫ్ఎస్సీ: సీఎన్ఆర్బీ0013138 చదవండి: ‘బిడ్డా... లే నాన్న... నువ్వు తప్ప మాకు దిక్కెవరే..’ -
సేద్యం బరువై...!
పరిగి: కూలీల ఖర్చులకు కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో వ్యయాన్ని తగ్గించుకునేందుకు పరిగి మండలంలోని ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. మండలంలోని కొడిగెనహళ్లికి చెందిన కె.ఆదెప్ప అనే రైతు తన పొలంలో కలుపు తీసేందుకు సైకిల్ చక్రానికి చిప్ప గుంటకను తయారు చేసుకొని చేనులో దున్నుతున్నాడు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నందునే అవి భరించే శక్తి తనకు లేకపోవడంతో ఈ ఆలోచన వచ్చిందని రైతు తెలిపాడు. మొక్కజొన్న వేసిన తన పొలంలో కలుపు తీసేందుకు ఓ సైకిల్ చక్రానికి గుంటకను చేయించి కేవలం రూ.1500 ఖర్చుతో ఈ యంత్రాన్ని తయారు చేయించానన్నాడు. తనకున్న ఎకరా పొలంలో కుమార్తె అరుణ, అల్లుడు చౌడప్ప సహాయంతో ఇలా కలుపును తొలగిస్తున్నానని తెలిపాడు. వినూత్న ఆలోచనతో కలుపు తీస్తున్న ఆదెప్పను పలువురు రైతులు అభినందిస్తున్నారు. -
కురుబలు అన్ని రంగాల్లో రాణించాలి
- కనకదాసు జయంతి ఉత్సవంలో శంకరనారాయణ పెనుకొండ (పరిగి) : కురుబలు అన్ని రంగాల్లో రాణించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. పరిగి మండలం కొడిగెనహళ్లిలో ఆదివారం కురుబ కులస్థులు పెద్దఎత్తున కనకదాసు జయంతి ఉత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శంకరనారాయణ మాట్లాడుతూ కురుబలు విద్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరంగా చైతన్యవంతం కావాలన్నారు. ఐక్యతతో ముందుకు సాగినప్పుడే లక్ష్యాలను చేరుకోగలమన్నారు. అనంతరం ఆయన కనకదాసు చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున జ్యోతులతో ర్యాలీ నిర్వహించగా ఆయన వారితో కలిసి నడిచారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రభాకర్, చిరంజీవి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
నీట మునిగి తండ్రీబిడ్డ మృతి
పరిగి (పెనుకొండ) : పరిగి మండలం కొడిగెనహళ్లిలో వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి తండ్రి బిడ్డ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే కొడిగెనహళ్లికి చెందిన అక్కులప్ప సోమవారం పండుగ కావడంతో ఉదయం తమ స్వగ్రామంలో పండుగ చేసుకుని ఇంటిలో ఉన్న చిన్న వినాయక విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి వెళ్లారు. నిమజ్జనం చేసే ప్రక్రియలో కుమార్తె చందన (8) కాలు జారి గుంతలోకి పడింది. కుమార్తెను రక్షించే ప్రక్రియలో నీటిలో వేగంగా దూకిన అక్కులప్ప బురదలో చిక్కుకుని బయటకు రాలేక ప్రాణాలు వదిలాడు. ప్రమాదాన్ని కళ్లారా చూసిన కుమారుడు అభిషేక్ కేకలు వేస్తూ నీటిలోకి దూకడంతో ప్రమాదాన్ని గ్రహించిన కొందరు పరుగున వచ్చి బాలుణ్ణి బయటకు తీసి Ðð ంటనే పాపను, తండ్రి అక్కులప్పను బయటకు తీశారు. అప్పటికే ఆయన మరణించగా కొన ఊపిరితో ఉన్న చందనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. సమాచారం అందగానే కుటుంబసభ్యులు, బంధువులు గ్రామస్థులు పెద్ద ఎత్తున చెరువుకు చేరుకుని రోధించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.