breaking news
kk express
-
బేటా ఉఠో.. బేటా గుర్మిత్..!
‘బేటా ఉఠో.. బేటా గుర్మిత్! జర ఆంఖే ఖోలోకర్ దేఖో.. యా గురునానక్.. జర రహెం కరో.. మేరే బేటేకో బచావో’ అంటూ కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కళ్లముందే రైలు కింద పడి తీవ్రంగా గాయపడిన కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే కన్న పేగు వేదనకు అంతు లేకుండా పోయింది. బిడ్డను ప్రాణాలతో చూడాలనుకుని పరితపించింది. కనిపించని దేవుళ్లను ప్రార్థించింది. ఉఠోరే గుర్మిత్ అంటూ గుండెలవిసేలా రోదించింది. చివరకు తన ఒడిలోనే ప్రాణాలు కోల్పోయిన కుమారుడిని హత్తుకుని బోరున విలపించింది. సాక్షి, అనంతపురం: తల్లిని రైలు ఎక్కించే క్రమంలో తనయుడు కాలుజారి రైలుకు, ప్లాట్ఫామ్కు మధ్య ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. కళ్లెదుటే కన్న కొడుకు ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వివరాల్లోకెళితే.. పంజాబ్లోని ఫసిల్కా జిల్లా బలేల్కాకమల్ గ్రామానికి చెందిన గుర్మిత్సింగ్ (30) కేకే ఎక్స్ప్రెస్లో తన తల్లి బీబీకి ఆపరేషన్ చేయించేందుకు ఢిల్లీ నుంచి పుట్టపర్తికి బయలుదేరాడు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో కేకే ఎక్స్ప్రెస్ అనంతపురం వచ్చింది. దాహంగా ఉండటంతో తల్లీకొడుకులు స్టేషన్లో దిగారు. కాసేపటికే రైలు కదిలింది. దీంతో గుర్మిత్సింగ్ అతని తల్లి బీబీ పరుగులు తీశారు. ఈ క్రమంలో తల్లిని రైలెక్కించే క్రమంలో గుర్మిత్సింగ్ రైల్వే ట్రాక్, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. కాలు రైలు కింద పడడంతో తీవ్రంగా దెబ్బతింది. శరీరంపై రైలు ఒత్తిడి ఎక్కువ పడడంతో గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు రైల్వే ట్రాక్కు, రైలుకు మధ్య చిక్కుకుని గుర్మిత్సింగ్ మృతి చెందడంతో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కేకే ఎక్స్ప్రెస్ను పది నిమిషాలపాటు ఆపేశారు. గుర్మిత్సింగ్ తల్లి బీబీ తలకు తీవ్రగాయమై బాధపడుతున్నా రైల్వే అధికారులు కానీ, సిబ్బంది కానీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందితే రైల్వే అధికారులు, సిబ్బంది కనీసం తొంగిచూడకపోవడంపై డీవైఎఫ్ఐ నాయకులు బాలకృష్ణ మండిపడ్డారు. మృతుడి తల్లికి తీవ్రగాయమైనా ఆస్పత్రికి తరలించేందుకు కూడా ముందుకు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యులు కూడా అందుబాటులో లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బిస్కెట్లు ఇచ్చి దోచేశారు
విజయవాడ: మత్తు మందు చల్లిన బిస్కెట్లు ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన న్యూఢిల్లీ-కేరళ కేకే ఎక్స్ప్రెస్లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. మహారాష్ట్రలోని నాగ్పూర్ స్టేషన్ వద్దకు రాగానే కొంతమంది ప్రయాణికులు రైల్లోకి ఎక్కారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ.. తోటి ప్రయాణికులకు బిస్కెట్లు ఇచ్చారు. ఆ బిస్కెట్లు తిన్నవారంతా నిద్రలోకి జారుకున్నారు. తర్వాత ఆ దుండగులు వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. ఇద్దరు దంపతులు మహారాష్ట్రలోని సేవాగ్రామ్లో దిగాల్సి ఉండగా మత్తు మందు చల్లిన బిస్కెట్లు తినడంతో నిద్రలోనుంచి లేవలేకపోయారు. విజయవాడ వచ్చినా వారు నిద్రలేవకపోవటంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆరా తీయగా విషయం తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.