33 టీయంసీల నీరు అవసరం
కర్నూలు సిటీ: ఖరీఫ్లో సాగు చేసిన ఆయకట్టుకు, అలాగే తాగునీటికి 33.85 టీయంసీల నీరు కావాలని జల వనరుల శాఖ ఇంజినీర్లు ఆ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దృష్టికి తీసుకపోయారు. శుక్రవారం విజయవాడ నుంచి జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆ శాఖ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎస్ఆర్బీసీ కింద ప్రస్తుతం ఉన్న 92 వేల ఎకరాల ఖరీఫ్ పంటలకు, రబీలో 30 వేల ఎకరాలకు 5.8 టీయంసీల నీరు అవసరమని సంబంధిత అధికారులు తెలియజేశారు. తెలుగుగంగ కాలువ కింద ఖరీఫ్ పంటలకు, తాగు, రబీలోని ఆయకట్టుకు 13 టీయంసీలు, హంద్రీనీవా కింద జిల్లాలోని ఖరీఫ్లో సాగు అయిన ఆయకట్టు, తాగు నీటిని కేవలం 0.5 టీయంసీలు అవసరమని చెప్పారు. తుంగభద్ర దిగువ కాలువ కింద ప్రస్తుతం సాగులో ఉన్న ఆయకట్టు బయట పడేందుకు 4.5 టీయంసీలు కావాలని అడిగారు. పక్కా వివరాలతో కూడిన నివేదికలు మరో వారం రోజుల్లో అందజేయాలని మంత్రి ఇంజినీర్లకు సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో సీఈ నారాయణ రెడ్డి, ఎస్ఈలు చంద్రశేఖర్రావు, నారాయణస్వామి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.