breaking news
Khed
-
మహా గెలుపు
♦ ఖేడ్లో గులాబీ గుబాళింపు ♦ మహారెడ్డి భూపాల్రెడ్డి విజయదుందుభి ♦ 53,625 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపు ♦ అభివృద్ధి వైపే నడిచిన ‘ఖేడ్’ ఓటరు ♦ {పతి రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ♦ డిపాజిట్ నిలుపుకొన్న కాంగ్రెస్ ♦ టీడీపీ ధరావత్తు గల్లంతు ఖేడ్ ఉప ఎన్నికల్లో గులాబి గుబాళించింది. కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. టీఆర్ఎస్ ధాటికి ‘హస్తం’ దెబ్బతింది. ‘సైకిల్’కు పంక్చరైంది. కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకోగలిగింది. గెలుస్తామనే ధీమాతో బరిలోకి దిగిన టీడీపీ ధరావత్తు కోల్పోయింది. సానుభూతి పవనాలు వీయకపోవడంతో కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కోల్పోయింది. అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించింది. కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను టీఆర్ఎస్ సొంతం చేసుకుని విజయ ఢంకా మోగించింది. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి ఖేడ్ చరిత్రనే తిరగరాశారు. నారాయణఖేడ్: నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా మెజార్టీని టీఆర్ఎస్ సాధించింది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి పాగా వేసింది. మొదటి రౌండ్ నుంచి చివ రి రౌండ్ వరకు ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి ఆధిక్యతను కనబరిచారు. రమారమి ప్రతి రౌండ్లో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డిపై రెండు వేలు, ఆపైగా ఆధిక్యతతో పైచేయి సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గత ఏడాది ఆగస్టు 25న గుండెపోటు తో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 13న పోలింగ్ జరగ్గా మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి 93,076 ఓట్లను పొందగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి.సంజీవరెడ్డి 39,451 ఓట్లను సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి ఎం.విజయపాల్రెడ్డి 14,787 ఓట్లను మాత్రమే పొందడంతో డిపాజిట్ గల్లంతయ్యింది. ఈ ఎన్నికల్లో డిపాజిట్ పొందేం దుకు పోలైన వాటిలో 16 శాతం అంటే 25,811 ఓట్లు రావాల్సి ఉంది. స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్న శ్రమజీవి పార్టీ అభ్యర్థి జి. భాస్కర్ 5,377 ఓట్లు, బోరంచ సంగారెడ్డి 509, ఐ.మాదప్ప 235, ముదిరాజ్ వెంకటేశం 291, మురళీగోవింద్ 333ఓట్లను పొందారు. నోటా కు 853 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ రోనాల్డ్ రాస్, రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు, పరిశీలకులు నరేంద్రసింగ్ పాటిల్, జీఎల్ మీన, రాజేష్ కుమార్రాయ్, జెడ్పీ సీఈఓ వర్షిణి తదితరులు పర్యవేక్షించారు. 8.40 గంటలకే తొలి రౌండ్ ఫలితం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఉదయం 7.30 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లను అధికారులు కౌంటింగ్ హాల్లోకి పంపించారు. మొదటి రౌండ్ ఫలితం 8.40 గంటలకు వెల్లడించారు. ఆ తరువాత ప్రతి పది పదిహేను నిమిషాల వ్యవధిలో ఒక్కోరౌండ్ ఫలితం వచ్చింది. కౌంటింగ్ హాల్, మీడియా పాయింట్లో ప్రత్యేక తెరల ద్వారా ఫలితాలను వెల్లడించారు. ధ్రువపత్రం అందుకున్న భూపాల్రెడ్డి.. పెద్దశంకరంపేట: ఉప ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు చేత ధ్రువపత్రాన్ని అందుకున్నారు. -
ఈగ వాలింది, పదవి దక్కింది
రాజమౌళి సినిమాతో హీరోగా మారిన ఈగ...మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ సినిమాలో ప్రతీకారం తీర్చుకునే ఈగనే చూసిన మనం... ఈసారి మాత్రం అధికారాన్ని కట్టబెట్టే పెత్తనం తీసుకుంది. చిలక జోస్యం మాదిరిగానే ఏకంగా ఓ గ్రామానికి ఉప సర్పంచి పోస్ట్కు అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను నెత్తిమీద వేసుకుంది. ఇదంతా తమాషా అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేద్ (రాజ్గురు నగర్)తాలూకా సత్కారష్తల్ అనే గ్రామంలో జరిగిన ఈ వింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికి వస్తే సత్కారష్తల్ గ్రామ పంచాయతీలో మొత్తం 9మంది వార్డు మెంబర్లు ఉండగా, వారిలో ముగ్గురు ఉప సర్పంచ్ పదవికి పోటీపడ్డారు. అయితే ఆ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే బాధ్యతను పంచాయతీ పెద్దలు ...ఈగకు అప్పగించారు. ఈగ ఏ చిట్టీపై వాలితే అందులో పేరున్న వ్యక్తే ఉప సర్పంచ్గా ఎన్నిక అవుతారు. దాంతో ఈగ గారి నిర్ణయమే శిలాశాసనం. వార్డు మెంబర్లు అంతా ఆ వ్యక్తినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. పదవికి పోటీ పడిన ముగ్గురి పేర్లు చీట్టీలు రాసి స్థానిక భైరవనాథ్ ఆలయంలో ఉంచారు. రాజు గారి తీర్పు కోసం ప్రజలు ఎదురు చూసినట్లు ఈగ తీర్పు కోసం వారు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. పది నిమిషాలు వేచి చూసిన తర్వాత కానీ ఈగగారు ఆ చిట్టీపై వాలలేదు. ఈ వాలుడు తీర్పులో సంజీవని తింగ్లే అనే మహిళకు ఉప సర్పంచ్ పదవి వరించింది. తనకు పదవిని కట్టబెట్టిన ఈగగారికి కృతజ్ఞత తెలుపుకుని ఆమె ఉప సర్పంచ్గా బాధ్యతలు కూడా స్వీకరించేసింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న జిల్లా అధికారులు ఠాఠ్... ఈగ పెత్తనం చెల్లందంటూ అభ్యంతరం తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం మా ఆచారం మాది... మీ అభ్యంతరాలు మీవి అంటూ తోసిపుచ్చారు. గతంలో కూడా ఉప సర్పంచ్ ఎన్నికకు ఇదే పద్దతి అనుసరించామని చెప్పుకొచ్చారు. అయితే ఈ తతంగంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ఈగ గారి ఘనకార్యం లోకల్ న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్లో మారుమోగిపోయాయి. ఖేద్ గ్రామం సెలబ్రెటీగా మారిపోయిందని ఆ గ్రామ ప్రజులు మురిసిపోతుంటే ... ఈగ చలవ వల్ల ఉప సర్పంచ్ పదవి దక్కిన మహిళ మాత్రం తన అదృష్టానికి ఖుషీ అయిపోతుంది.