ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా.. కన్నడలో కాస్త గుర్తింపు ఉన్న హీరోనే. కానీ సరైన సక్సెస్ మాత్రం రావట్లేదు. ఇతడు హీరోగా నటించిన ఓ సినిమా అష్టకష్టాలు పడి కొన్నిరోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'కేడీ ద డెవిల్'. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితమే మొదలైనప్పటికీ నెల క్రితం అంటే ఏప్రిల్ 30న కన్నడ వరకు రిలీజైంది. ఈ నెల 15న తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. కొన్నాళ్ల ముందు బూతు పాటతో వివాదంలోనూ ఇరుక్కుందీ మూవీ. బిగ్ స్క్రీన్పై ఏ మాత్రం మెప్పించలేకపోయింది. వచ్చే శుక్రవారం(జూన్ 05) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇప్పుడు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కేడీ ద డెవిల్' విషయానికొస్తే.. అది 1980ల కాలం. ధర్మ(రమేశ్ అరవింద్) ఓ ఉపాధ్యాయుడు. కానీ ఇతడు తమ్ముడు కాళి(ధ్రువ సర్జా) మాత్రం వీధిలో కిరోసిన్ అమ్ముతూ బతుకుతుంటాడు. కుస్తీలో తిరుగులేని యోధుడైన దేవా(సంజయ్ దత్) అంటే కాళికి ప్రాణం. 25 ఏళ్లుగా ముఠాని నడుపుతున్న దేవా.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. మరోవైపు ధర్మ స్నేహితుడు అణ్ణయ్యప్ప ఇదే ఎన్నికల బరిలో నిలుస్తాడు. దీంతో దేవా గ్యాంగ్.. కాళి, అతడి కుటుంబాన్ని చంపేయాలని చూస్తుంది. అప్పటివరకు ఆరాధించిన దేవాపై కాళి ఎలా తిరగబడ్డాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)