breaking news
Kaveri Bhavan
-
‘బంగ్లా’ రగడ
శివాజీనగర: విమర్శలు, ప్రతి విమర్శలతో వేడిమీదున్న యడియూరప్ప, సిద్ధరామయ్య మధ్య బంగ్లా మరో వివాదమైంది. అదృష్ట నివాసంగా రాజకీయ రంగంలో గుర్తింపు పొందిన కావేరి బంగ్లా కోసం ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్ప, శాసనసభా ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల మధ్య సంఘర్షణ తారాస్థాయికి చేరింది. నాలుగు రోజుల్లోఇల్లు ఖాళీ చేయకపోతే సదుపాయాలను బంద్ చేయనున్నట్లు అందులో ఉంటున్న సిద్ధరామయ్యను ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ రగడ రచ్చకెక్కింది. కావేరి బంగ్లా గేటుకున్న సిద్ధరామయ్య నామ ఫలకాన్ని శనివారం రాత్రి డీపీఏఆర్ సిబ్బంది తొలగించి, నాలుగు రోజుల్లోగా ఇంటిని ఖాళీ చేయాలని అక్కడి సిబ్బందికి స్పష్టంచేశారు. ఒకవేళ నిర్ధారించిన సమయంలోగా ఇల్లు ఖాళీ చేయకపోతే 5 రోజుల తరువాత విద్యుత్, నీటి సరఫరాతో పాటు ప్రభుత్వ సదుపాయాలను స్తంభింపజేయనున్నట్లు నోటీస్లో పేర్కొన్నారు. కావేరి నివాసం ఇప్పటికే ముఖ్య మంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు కేటాయించారు. కానీ ఇందులో ఇప్పటికీ సిద్ధరామయ్యే ఉంటున్నారు. నిజానికి ఆయన ప్రతిపక్ష నాయకునికి కేటాయించిన రేస్ కోర్స్ రోడ్డులోని కాటేజ్ రేస్ వ్యూ– 2కు మారాలి. లేనిపక్షంలో చట్టపరంగానే ఖాళీ చేయిస్తామని అధికారులు తాజా నోటీస్లో తేల్చిచెప్పడం గమనార్హం. డీపీఏఆర్ సిబ్బంది శనివారం సిద్ధరామయ్య కార్యాలయానికి దీనిపై సమాచారం అందించగా, ఈ వారంలోగా కావేరి నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీఎం యడియూరప్ప నగరంలో డాలర్స్ కాలనీలో ఉన్న సొంత ఇంట్లో కార్యకలాపాలు చేపడుతున్నారు. ప్రతి రోజు రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రిని కలుసుకోవటానికి వందలాది మంది వస్తుంటారు. ధవళగిరి నివాసంలో అంతమందిని కలవడానికి స్థలం లేదు. ప్రజలు రోడ్ల మీదనే నిలబడుతుంటారు, దీనివల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమాలకు వీలుగా ముఖ్యమంత్రికి కావేరి నివాసాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇచ్చిన గడువు పూర్తయిందని, ఇంక పొడిగించడం సాధ్యం కాదని సిద్ధరామయ్యకు స్పష్టం చేశారు. అయితే సిద్ధరామయ్య ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
నేర నిరూపణ శాతం తక్కువగా ఉంది
రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ పోలీసు, న్యాయశాఖ సమన్వయ లోపమే ఇందుకు కారణం త్వరలో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో పోలీసు, న్యాయశాఖ మధ్య సమన్వం లోపించడం వల్ల నేర నిరూపణ శాతం తక్కువగా ఉంటోందని హోం శాఖ మంత్రి కె.జె.జార్ట్ అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులోని కావేరి భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఉద్దేశించి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నేరారోపణ ఎదుర్కొన్న వారిలో దాదాపు 70 వేల మందికి పైగా కోర్టు శిక్ష నుంచి తప్పించుకున్నారని గుర్తు చేశారు. ఇందుకు ఎఫ్ఐఆర్ నమోదు, చార్జిషీట్ దాఖలులో సారూప్యత లేకపోవడం ఒక కారణమైతే, కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడం కూడా కారణమవుతోందని అన్నారు. దీని వల్ల న్యాయ, పోలీస్ శాఖలపై ప్రజలకు నమ్మకం, గౌరవం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమని, త్వరలో 2,500 కానిస్టేబుళ్లు, 750 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 197 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు సంబంధించి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైకోర్టు నుంచి అనుమతి లభించిన వెంటనే ఇందుకు సంబంధించి కార్యాచరణ మొదలుపెడతామని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫాదర్ థామస్ హత్య దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని తెలిపారు. విశ్రాంత పోలీసులకు క్యాంటీన్ సదుపాయం విశ్రాంత పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలీస్ క్యాంటీన్ సదుపాయం కల్పించే విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తనను శుక్రవారం భేటీ అయిన రాష్ట్ర విశ్రాంత పోలీసు అధికారుల సంఘం సభ్యులు ముద్దయ్య, పమ్మయ్యలతో జార్జ్ పేర్కొన్నారు. అదేవిధంగా ఆరోగ్యబీమా కల్పించే విషయం కూడా ఆలోచిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.కాగా, జార్జ్తో భేటీ అయిన అనంతరం సంఘం పదాధికారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కృష్ణాలో భేటీ అయ్యి డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని అందించారు.