breaking news
Katanneni Bhaskar
-
కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పి, అందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేయడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయం కూల్చివేతకు బాధ్యులైన సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్పై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్సీపీ తరఫున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.చట్ట ప్రకారం నడుచుకోమని కోర్టు ఆదేశించినా.. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేసేందుకు మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ భవనం విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ను ఆదేశిస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లారి 5 గంటల సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేశారు.కోర్టు ఆదేశాలను ధిక్కరించి పార్టీ భవనాన్ని కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా, దానిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారంది. ఇది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.రాజకీయ నాయకులతో చేతులు కలిపిన ఈ ఇద్దరు అధికారులు రాజకీయ దురుద్దేశంతోనే ఏకపక్షంగా, దౌర్జన్యపూరితంగా తమ కార్యాలయాన్ని కూల్చేశారని తెలిపింది. వాస్తవానికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తరువాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందని తెలిపింది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేదని, ఇష్టానుసారం వ్యవహరించారని, వారి చర్యలను తీవ్రంగా పరిగణించాలని కోరింది. కూల్చివేత విషయంలో అధికారుల హడావుడిని గమనిస్తే వారి దురుద్దేశాలు అర్థమవుతాయంది. వారి చర్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారిని శిక్షించాలని హైకోర్టును కోరింది.క్రిమినల్ చర్యలు కూడా..!ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయాన్ని ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్పై క్రిమినల్ చర్యలకు సైతం వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయనుంది. -
ఆంధ్ర అధికారులూ.. గో బ్యాక్
వేలేరుపాడు : పోలవరం ముంపు మండలాల్లో బలవంతంగా తమ పాలన సాగించాలని చూస్తున్న ఆంధ్రా ఉన్నతాధికారులకు పరాభవం ఎదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముంపు మండలాల అధికారులు హాజరుకావాలని ఆ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే ఈ సమావేశానికి ఏ ఒక్క తెలంగాణా అధికారీ వెళ్లకపోవడంతో ఆ జిల్లా జేసీ బాబూరావునాయుడు, కోటరామచంద్రాపురం ఐటిడీఏ పీఓ టి.శ్రీనివాసరావు, రవాణ శాఖ కమిషనర్ శ్రీదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్బాబు, జేడీఏ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి తదితరులు శుక్రవారం వేలేరుపాడు వచ్చేందుకు యత్నించారు. అయితే వారిని పాతరెడ్డిగూడెం గ్రామం వద్ద ప్రజలు అడ్డుకున్నారు. ‘ తెలంగాణ వారే మా అధికారులు... మీరు ఆంధ్రా రాష్ట్రం వాళ్లు.. మా రాష్ట్రానికి ఎందుకొచ్చారు... ఇక్కడి నుంచి వెళ్లండి.. ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉన్నాయని, మా సేవలే కొనసాగుతాయని ఖమ్మం కలెక్టర్ శ్రీనివాస నరేష్ స్పష్టం చేశారు. అయినా మీరెందుకు వచ్చారు’ అంటూ నిలదీశారు. దీంతో ఆ జిల్లా అధికారులు మాట్లాడుతూ.. ‘మీ సమస్యలు పరిష్కరించడానికి వచ్చాం.. అన్ని విధాలా అండగా ఉంటాం’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారి మాటలను ఖాతరు చేయని బాధితులు వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ పట్టుబట్టారు. దీంతో చేసేది లేక వారు అక్కడి నుంచే వెనుదిరిగారు. చిత్తయిన టీడీపీ నేతల ఎత్తులు... పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నతాధికారుల వెంట ఆ జిల్లా టీడీపీ నేతలు వాహనాల్లో తరలి వచ్చారు. అధికారులకంటే ఎక్కువగా వీరే అంతా తామే అన్నట్టుగా వ్యవహరించడంతో స్థానికులు వారిపై తిరుగుబాటు చేశారు. ‘మా ప్రాంతంలో మీ పెత్తనం ఏంటి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులకు సమాచారం లేదు... పశ్చిమ అధికారుల రాకపై స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులను కలవలేదు. ఈ విషయమై వేలేరుపాడు తహశీల్దార్ పాపయ్యను వివరణ కోరగా, ఆ అధికారులు వస్తున్నారనే విషయం తమకు తెలియదని, అలాంటప్పుడు తామెందుకు వెళ్తామని అన్నారు. రక్షణగా వచ్చిన తెలంగాణ పోలీసులు... ఆంధ్రా ఉన్నతాధికారులకు రక్షణగా జంగారెడ్డిగూడెం సీఐతో పాటు, అశ్వారావుపేట ఎస్ఐ కిరణ్, సిబ్బంది, వేలేరుపాడు పోలీసులు పాల్గొనడం గమనార్హం.