breaking news
Kasturba Gandhi Girls Colleges
-
ఇంటర్లో ఉత్తమ ఫలితాలకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 100 రోజుల ప్రణాళికను ‘విజయపథం’ పేరుతో అమలు చేస్తుండగా, ఇంటర్మిడియట్ కాలేజీల్లో సంకల్ప్–2026 పేరుతో సోమవారం నుంచి అమలు చేయనున్నట్టు ఇంటర్ విద్య డైరెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. పదో తరగతిలోనూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు వచ్చే నెల నుంచి 100 డేస్ ప్లానింగ్ అమలు చేసేందుకు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేజీబీవీల్లోని ఇంటర్మీడియట్ బాలికల కోసం ఫిబ్రవరి 20 వరకు ప్రత్యేక తరగతులు అమలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ప్రతిరోజు రెండు సబ్జెక్టుల్లో పరీక్షలతో పాటు 15 రోజులకు ఒక గ్రాండ్ టెస్టు నిర్వహించేలా ప్రణాళికను కేజీబీవీలకు అందించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ సోమవారం నుంచి ఫిబ్రవరి 20 వరకు రోజువారీ ప్రణాళికను సోమవారం విడుదల చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి ఉదయం 9.10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి 50 నిమిషాలకు ఒక సబ్జెక్టు చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. నిర్దేశిత టైమ్టేబుల్ను తప్పనిసరిగా అమలు చేయాలని డైరెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కాగా, ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి ఏడాది 5,28,805, రెండో ఏడాది 4,93,454 మంది మొత్తంగా 10,22,259 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వచ్చేనెల నుంచి పదో తరగతి కూడా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 6.40 లక్షల మంది విద్యార్థులు ఉండగా, వీరిలో దాదాపు 3.40 లక్షల మంది ప్రభత్వ పాఠశాలలకు చెందిన వారున్నారు. వీరికోసం డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేసేందుకు ఎన్సీఈఆర్టీ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కాగా, 2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అదేనెల 31తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో 100 రోజుల ప్రణాళికను వచ్చేనెల మొదటి వారం నుంచి అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. -
సీఆర్టీలకు పరీక్షే !
వచ్చే నెల 3న పెర్ఫార్మెన్స్ టెస్టు నిర్వహించాలని నిర్ణయం ► ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ► కేజీబీవీల్లో పనిచేసే ఉపాధ్యాయులకు రెన్యువల్ గండం ► ఏడేళ్ల బోధనకు ఫలితం ఇదేనా అంటున్న సీఆర్టీలు సాక్షి, ఖమ్మం: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్టీ (కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్)లకు ఇప్పుడు రెన్యువల్ గండం పట్టుకుంది. ఏడేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిన బోధన చేస్తున్న వీరికి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఉత్తర్వులతో దడ పుడుతోంది. సీఆర్టీలుగా పనిచేస్తున్న వారికి పెర్ఫార్మెన్స్ టెస్టు (పనితీరు అంచనా పరీక్ష) నిర్వహించాలని ఇందులో పేర్కొన్నారు. జూన్ 3న అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ టెస్టు నిర్వహించాలని డీఈఓలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశించారు. అయితే తమ బోధనతో కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని.. ఇంకా పెర్ఫార్మెన్స్ టెస్టు ఎందుకని సీఆర్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 13 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 2,352 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.వీటిల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన చేసేందుకు రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. గణితం, సోషల్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తోపాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సీఆర్టీలు, ఒక వ్యాయామ ఉపాధ్యాయురాలు, ఏఎన్ఎం, వంట మనుషుల, వాచ్మెన్లను నియమించారు. వీరిపై పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని కూడా నియమించారు. పీజీ, బీఈడీ అర్హత ఉన్న వారిని సబ్జెక్టు సీఆర్టీలుగా నియమించి నెలకు రూ.15వేలు వేతనం అందజేస్తున్నారు. ఇలా జిల్లాలో 91 మంది సీఆర్టీలు పనిచేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి( ప్రిన్సిపల్) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్ఎస్ఏ అధికారులు రెన్యువల్ చేస్తూ వచ్చారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి పనితీరు అంచనా పరీక్ష పెట్టాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీలు ప్రారంభించినప్పుడు అర్హతలు, డెమో పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్న సీఆర్టీలను ప్రతీ సంవత్సరం సర్వశిక్ష అభియాన్ అధికారులు ఏ అడ్డంకి లేకుండా రెన్యువల్ చేస్తూ వచ్చారు. అయితే ఈనెల 24న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో సీఆర్టీలు లబోదిబోమంటున్నారు. నిఘా నీడలో జిల్లా కేంద్రంలో.. వచ్చేనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తెరవనుండడంతో ఈప్రక్రియ అంతా పూర్తి చేయాలనే ఆలోచనతో జూన్ 3న సీఆర్టీలకు జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహించనున్నారు. డీఈఓ, ఎక్స్ అఫీషియో, పీఓ, ఎస్ఎస్ఏ, సెక్టోరియల్ అధికారులకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అన్ని వసతులు ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం విశేషం. పరీక్ష కేంద్రానికి నిర్దేశించిన సమయానికి గంట ముదు రావాలని, వచ్చేటప్పుడు పాఠశాల ప్రత్యేకాధికారి నుంచి పొందిన గుర్తింపు కార్డుతో రావాలని సూచించారు. పరీక్ష వ్యాసరూప, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ రూపంలో ఉంటుందని, పరీక్ష రాసేందుకు సీఆర్టీలు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు ఆధికారి జి.కిషన్ పేరున ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ టెస్టులో అర్హత సాధించని సీఆర్టీలను ఇంటిబాట పట్టించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టు రద్దు చేయాలంటున్న సీఆర్టీలు.. ఓవైపు టెస్టు నిర్వహిస్తే అర్హత సాధించకపోతే ఎలా..? అని ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆందోళన.. ఏడేళ్లుగా ఏ ఇబ్బంది లేకుండా పనిచేసిన సీఆర్టీలకు ఇప్పుడు పనితీరు అంచనా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పరీక్షను రద్దు చేయాలని యూటీఎఫ్, కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగు సంఘం, ఇతర ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ఆచార్యను కలిసి సీఆర్టీల వివరాలు, వారు పనిచేస్తున్న తీరును వివరించినట్లు తెలిసింది. అయితే పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేసేలా చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ సంఘాలకు ఆయన హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. సీఆర్టీల పరీక్షల ఉత్తర్వు రద్దు చేయాలని, లేని పక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన బాట పడతామని డిమాండ్ చేస్తున్నారు.


