breaking news
Karuna Shukla
-
కాంగ్రెస్ సీనియర్ నేత, వాజ్పేయి బంధువు కరోనాతో మృతి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కరుణ శుక్లా (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె చత్తీస్గఢ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస తీసుకున్నారు. ఆమె మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి మేనకోడలు కూడా. దీనిపై పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటించారు. కరుణ శుక్లా లోక్సభకు చత్తీస్గఢ్లోని జంజ్గిర్ నియోజకవర్గంనుంచి 14వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో బీజేపీకి రాజీనామా చేశారు. ఆతరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018 ఎన్నికల్లో పోలీచేసి ఓటమి పాలయ్యారు. కాగా కరోనా సెకండ్వేవ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రోజుకు మూడున్నర లక్షలకుపైగా కేసులు, 2వేలకు పైగా మరణాలతో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం నాటి గణాంకాల ప్రకారం వరుసగా ఆరో రోజుకూడా మూడుల లక్షల మార్క్ను దాటి 3 23,144 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మే 1 వ తేదీనుంచి 18 సంవత్పరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. -
ఉద్ధండుడిపై యుద్ధానికి
ఛత్తీస్గఢ్లో ఇవాళ పోలింగ్. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మీద.. ఒకప్పుడు అదే పార్టీలో ఉండి, బయటికి వచ్చిన మహిళ...ఇప్పుడు పోటీ పడుతున్నారు. గెలుస్తానన్న ధీమా ఆయనకు ఉన్నా, ‘ఓడిపోను కదా..’ అనే సంశయాన్నీ ఆ మహిళ ఆయనకు కలిగిస్తున్నారు! ఆయన రమణ్సింగ్. ఆమె కరుణాశుక్లా. అంతటి ఉద్ధండుడికి దీటుగా నిలబడిన కరుణలోని వ్యక్తిగత, రాజకీయ ప్రత్యేకతలే ఈవారం మన ‘పరిచయం’. పుట్టింది: 1950, ఆగస్టు ఒకటవ తేదీన, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చదివింది: ఎం.ఎ సోషియాలజీ, భోపాల్లోని హమిదియా యూనివర్సిటీ నుంచి 1971లో. భర్త మాధవ్ ప్రసాద్ శుక్లా డాక్టర్, ఒక కొడుకు, ఒక కూతురు, నివాసం రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో. రాజకీయ పార్టీలు: 1982 నుంచి 2013 వరకు బీజేపీలో, 2014 నుంచి కాంగ్రెస్పార్టీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం మోగింది. ఎన్నికల కమిషన్ అక్టోబర్లో ఎన్నికల నగారా మోగించింది. హేమాహేమీలంతా నామినేషన్లు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రమణ్సింగ్కి వరుసగా మూడవ దఫా గద్దెనెక్కిన రికార్డు ఉంది. ఇప్పుడు కూడా నామినేషన్ వేయడం, గెలవడం లాంఛనమే అనుకున్నారాయన. తన నియోజకవర్గం రాజ్నంద్గాన్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, అత్యంత జాగ్రత్తగా, ఆచితూచి, మొక్కుబడిగా నాలుగైదు ప్రాంతాలను సందర్శించి ప్రచారం అయిందనిపించడమే ఈసారి కూడా అనుకున్నారు ఎప్పటిలాగానే. అయితే అదే నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ కరుణా శుక్లా అనే బాణాన్ని ఎక్కుపెట్టడంతో రమణ్సింగ్ ఉలిక్కి పడ్డారు. ఆందోళనను దాచుకుంటూ గెలిచేది మేమేనంటూ ఆయన అభిమానులు ఢంకా బజాయిస్తున్నారు. అయితే.. రమణ్సింగ్ని అంతటి గగుర్పాటుకు గురిచేసిన ఆ కరుణా శుక్లా ఎవరు? వాజ్పేయి గారింటి అమ్మాయి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్న సుధా బిహారీ వాజ్పేయి కూతురు కరుణా శుక్లా!! మరి ఆమె బీజేపీలోనే కదా ఉండాల్సింది?! అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, కానీ ఆమె ఆ పార్టీని వదలడం వల్లనే ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. కరుణా శుక్లాకు వాజ్పేయి స్వయానా చిన్నాన్న. ఆయన మీద ఎనలేని ప్రేమాభిమానాలున్నాయామెకి. పార్టీ స్థాపించినప్పటి నుంచి చిన్నాన్నతో కలిసి పనిచేశారు. అదే పార్టీ నుంచి 1993లో బాలోద బాజార్ నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్ (అప్పటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడలేదు) శాసనసభకు ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్ ఏర్పడిన తర్వాత 2004లో జంజ్గిర్ లోక్సభస్థానం నుంచి గెలిచారు. 2009లో కోర్బా నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చరణ్దాస్ మహంత్ చేతిలో ఓడిపోయారు. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బిలాస్పూర్ శాసనసభ స్థానానికి పోటీ చేసి విజయానికి దూరంగానే ఉండిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్నంద్గాన్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీద పోటీలో ఉన్నారు. రమణ్సింగ్– కరుణాశుక్లాలు నువ్వా – నేనా అంటూ పోటీ పడుతున్న ఆ ఎన్నిక ఈ రోజే (నవంబర్ 12). ఈ పరిణామాల వెనుక ఏం జరిగింది? పార్టీని వీడుతూ... కరుణాశుక్లా బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలను, భారతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విధులను, పార్టీలో మరికొన్ని కీలక బాధ్యతలనూ నిర్వహించారు. 1992 నుంచి 2013 వరకు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధాన్ని ఒక్కసారిగా వదులుకున్నారామె. ఆ ఏడాది డిసెంబర్ 25వ తేదీన భారతీయ జనతాపార్టీని వీడుతూ... ‘‘అధికారం, ప్రభుత్వం చేతిలో ఉన్న కొందరు వ్యక్తుల ప్రభావంలో పార్టీ మునిగిపోతోంది, ముఖ్యమంత్రి రమణ్సింగ్.. పార్టీని, ప్రభుత్వాన్ని ఒన్ మ్యాన్ షోగా నడిపిస్తున్నారు, అందుకే ఆ పార్టీని వీడుతున్నాను. నేను విలువలతో కూడిన రాజకీయాలనే నిర్వహించాను. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా జీవించాను. బీజేపీలో చివరి ఐదేళ్లు గడిపిన జీవితం నా నమ్మకాలకు పూర్తిగా వ్యతిరేకం. అందుకే పార్టీని వీడాను. బీజేపీ రూపు మారింది. మారిన బీజేపీ నా అవసరం లేదనిపించింది’’ అన్నారామె. వాజ్పేయి కోసం గళం కరుణాశుక్లా బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా చిన్నాన్న వాజ్పేయి కోసం గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. వాజ్పేయి చితాభస్మాన్ని బీజేపీ శ్రేణులు అన్ని రాష్ట్రాలకూ తీసుకెళ్తున్న సమయంలో ఆ చర్యను కరుణా శుక్లా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘దాదాపు దశాబ్దకాలంగా ఆ పార్టీ వాజ్పేయిని మర్చిపోయింది. ఆయన అనారోగ్యంతో మంచం పడితే, ఆ నాయకులు కనీసం ఆయనను చూడటానికి కూడా రాలేదు. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడటంతోపాటు ఆ పార్టీ మునిగిపోయే క్లిష్టపరిస్థితుల్లో ఉండటంతో, రాజకీయంగా తాము కోల్పోయిన ప్రాధాన్యం తిరిగి రాబట్టుకోవడానికి వాజ్పేయి చితాభస్మాన్ని కూడా వాడుకుంటోంద’ని ఆమె ఆరోపించారు. ‘వాజ్పేయి చితాభస్మాన్ని రమణ్సింగ్ తన రాజకీయ ప్రయోజనాలకు మలచుకుంటున్నాడు. వాజ్పేయి పేరు ఉపయోగించుకునే నైతిక అర్హత రమణ్సింగ్కు లేదు. ఎందుకంటే ఆయన నిర్వహించిన రాజ్యోత్సవ్లో వాజ్పేయికి ఎక్కడా ఒక్క పోస్టర్ కూడా వేయలేదు. అతడి సేవలను కూడా తెరమరుగు చేసేసింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికి ఆయన పేరు, ఫొటోలను వాడుతోంది’ అని తన ప్రచారంలో ఎండగడుతున్నారామె. ‘బీజేపీ అనుకుంటున్నట్లు అటల్ జీ ఓటు బ్యాంకు కాదు. విలువలకు, సిద్ధాంతాలకు మూర్తీభవించిన రూపం ఆయన. వాజ్పేయి బతికుండగా గుర్తుకు రాలేదెవ్వరికీ. ప్రాణం పోగానే (ఈ ఏడాది ఆగస్ట్ 16వ తేదీన ఆయన ఎయిమ్స్లో తుదిశ్వాస వదిలారు) ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టుకుంటోంది, ఛత్తీస్గఢ్లో ఒక నగరానికి ఆయన పేరు పెట్టాలని కూడా నిర్ణయించింది’ అని తన ప్రచార సభల్లో ఉద్ఘాటిస్తున్నారు కరుణాశుక్లా. ‘నెహ్రూ ఎదుట చిన్నాన్న పార్లమెంట్లో మాట్లాడినప్పుడు.. ‘ఈ కుర్రాడు భవిష్యత్తులో ఈ దేశానికి ప్రధాని అవుతాడు’ అన్నారాయన. చిన్నాన్నకు అలా నెహ్రూజీ ఆశీస్సులు అందాయి’ అని కూడా పదే పదే గుర్తు చేస్తున్నారామె. విమర్శనాస్త్రాలు కరుణా శుక్లా 2009 లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందడంతో, అప్పటి నుంచి పార్టీలో ఆమెకు నిరాదరణే ఎదురైంది. పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్న పరిస్థితులను జీర్ణించుకోలేక ఆమె పార్టీని వీడారు. పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా గెలిచి పార్టీకి, ప్రజలకు సేవలందించిన సంగతిని ఆ పార్టీ మర్చిపోయిందనేది కూడా ఆమె ఆవేదన. అయితే ‘ఓటమి కారణంగా ఆమె నిరాశ, ఆందోళనల్లో మునిగిపోవడంతో పార్టీ మీద ఆరోపణ చేశారు తప్ప, నిజానికి ఆమె నిరాదరణకు గురి కాలేద’ని పెద్దలు సర్దిచెప్పుకున్నారు, ఆమెను బుజ్జగించి పార్టీలో కొనసాగడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. ఆమె బీజేపీని వదిలి కాంగ్రెస్లో చేరినప్పుడే వాజ్పేయి పాటించిన విలువలకు తిలోదకాలిచ్చారని రమణ్ సింగ్ కొడుకు అభిషేక్ సింగ్ (రాజ్నంద్గాన్ పార్లమెంట్ సభ్యుడు) కరుణాశుక్లా మీద ఎదురు దాడి చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ– గాంధీ కుటుంబాల త్యాగాలను ఆమె విపరీతంగా ప్రశంసించడం మీద కూడా విమర్శలొచ్చాయి. ప్రత్యర్థికి దీటుగా ‘రమణ్ మీద విశ్వాసం ఉంచండి, కమలం అభ్యుదయానికి నిర్వచనం’ అనే నినాదంతో జనంలోకి వెళ్తోంది కమలం పార్టీ. గడచిన 2013 ఎన్నికల్లో రమణ్ సింగ్ 35 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల ఓటర్లు సింగ్కు బాసటగా నిలిచారప్పుడు. ప్రస్తుతం ఆ ఓటు బ్యాంకును ఛేదించడం మీద కరుణాశుక్లా తీవ్రంగా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో మితిమీరుతున్న లిక్కర్ అమ్మకాలు, యువతకు అవకాశాల లేమి, నిరుద్యోగం, రైతుల శ్రేయస్సు తదితర అంశాలను ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో రైతులు నిర్వహించిన ఆందోళనలు కూడా తనకు కలిసి రావచ్చని కరుణాశుక్లా ఆశిస్తున్నారు. ఆ (రైతుల) ఆందోళన పట్ల రమణ్ సింగ్ లోలోన కొంచెం ఆందోళనకు గురవుతున్నారు. మరి.. ముఖ్యమంత్రి ఎవరు? ‘ముఖ్యమంత్రిని కానీ, ప్రధానమంత్రిని కానీ ఎన్నికల తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ శాసనసభ, పార్లమెంట్ సభ్యులు సమావేశమై నిర్ణయిస్తారని, ముందుగానే ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎన్నికలకు వెళ్లడం మీద తనకు నమ్మకం లేద’ని లౌక్యంగా చెప్పారు కరుణా శుక్లా. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆమెను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు వస్తే కరుణాశుక్లా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అవుతారని ఎక్కడా ప్రకటించలేదా పార్టీ. అయితే కరుణ సమాధానంలో ఎక్కడా ‘తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థి మీద పోటీ చేస్తున్నానంతే’ అని కమిట్ కావడం లేదు కూడా. నూటపాతికేళ్ల పార్టీ వ్యవహరిస్తున్నంత లౌక్యంగానే ఉంటోందామె మాట కూడా. తాను రాజ్నంద్గాన్లో గెలిచి,∙కాంగ్రెస్పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ కనుక వస్తే... ముఖ్యమంత్రిని ఎన్నుకునే క్రమంలో ‘తనను ముఖ్యమంత్రిని చేయాల్సిందే’నని డిమాండ్ చేయడానికి అనువుగానే మాట్లాడుతున్నారు కరుణా శుక్లా. అక్టోబర్ 22న కాంగ్రెస్ పార్టీ కరుణాశుక్లా పేరు ప్రకటించే వరకు రాజ్నంద్గాన్ నియోజకవర్గం పెద్దగా వార్తల్లో లేదు. ఎప్పటిలాగానే రమణ్సింగ్ పోటీ చేసి గెలిచే సీటుగానే అందరి అభిప్రాయం అప్పటి వరకు. కరుణా శుక్లా పేరు వినిపించినప్పటి నుంచి గెలుపు మీద అంచనాలు, విశ్లేషణలు మొదలయ్యాయి. ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ప్రధాన భూమికను పోషిస్తున్నారు కరుణాశుక్లా. చిన్నాన్న నుంచి కవిత్వం కరుణాశుక్లా అనేక సందర్భాల్లో వాజ్పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ‘‘స్కూల్లో పాటలు, కథలు, కవితల పోటీలు జరిగినప్పుడు నేను చిన్నాన్నను అడిగేదాన్ని. ఆయన ఆశువుగా చెప్పిన కవితలను రాసుకుని వెళ్లి స్కూల్లో చదివితే, ఒకటే చప్పట్లు. నాకు ఎంతో గౌరవం దక్కేది. చిన్నాన్న పుట్టిన కుటుంబంలోనే నేనూ పుట్టడం, ఆ కుటుంబీకుల్లో నేను ఒకదానిని కావడం నా అదృష్టం అనుకునేదాన్ని. పువ్వులకు చుట్టిన వస్త్రానికి కూడా పూల వాసన అంటినట్లే, చిన్నాన్నలో ఉన్న కవి పరిమళం నాకు తావి అయ్యింది’’ అని స్నేహితులతో సంతోషంగా పంచుకునేవారు కరుణాశుక్లా. – వాకా మంజులారెడ్డి -
జై వాజ్పేయి!
రాజకీయంగా ఇద్దరూ హేమాహేమీలే. ఒకరిది సుదీర్ఘ రాజకీయానుభవమైతే.. మరొకరిది మాజీ ప్రధాని కుటుంబం. వీరిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. ఒకరు వాజ్పేయి శిష్యుడు ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ కాగా.. మరొకరు వాజ్పేయి అన్న కూతురు కరుణ శుక్లా. వీరిద్దరూ ఛత్తీస్గఢ్లోని రాజ్నందన్గావ్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇద్దరికీ వాజ్పేయితో ఉన్న ఆత్మీయత కారణంగా.. ఆయన వారసత్వం తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. రాజ్నందన్గావ్ ప్రచారంలో వాజ్పేయి పేరే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది. తన గురువు, తమ పార్టీ నేత వాజ్పేయి అని సీఎం రమణ్సింగ్ ప్రచారం చేసుకుంటుంటే.. కాంగ్రెస్ అభ్యర్థి, వాజ్పేయి అన్నకూతురు కరుణ శుక్లా కూడా వాజ్పేయినే తమ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. తనే వాజ్పేయికి అసలైన వారసురాలినంటున్నారు. మాజీ ప్రధాని పేరును వినియోగించుకునే హక్కు బీజేపీకి లేదని ఆమె విమర్శిస్తున్నారు. వాజ్పేయి ఆదర్శాలను తూచ తప్పకుండా పాటిస్తానని.. మహనీయుడి ఆదర్శాలను బీజేపీ గాలికొదిలేసిందని మండిపడుతున్నారు. ‘బీజేపీ భావజాలం, మార్గం అన్నీ మారిపోయాయి. ఇది ఎంతమాత్రం వాజ్పేయి, అడ్వాణీలు నడిపిన పార్టీ కాదు’ అని శుక్లా తన ప్రసంగాల్లో విమర్శిస్తున్నారు. వాజ్పేయి బోధనలు తన రక్తంలో ఉన్నాయంటున్నారు. తనతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిస్తే నీతివంతమైన పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలు బీజేపీలో ఉన్న కరుణ 2013లో పార్టీని వీడారు. 2014లో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో రమణ్పై కరుణను కాంగ్రెస్ బరిలో దించింది. రాజ్నందన్గావ్లో రమణ్ సింగ్, కరుణ శుక్లాలు ఎదురెదురు ఇళ్లలో ఉండటం విశేషం. హమారా రమణ్! అయితే నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రమణ్ సింగ్పై సానుకూలంగానే ఉన్నారు. రాష్ట్రాన్ని ఈయన అభివృద్ది చేశారని మధ్యతరగతి విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అది రమణ్ సింగ్ వల్లేనని స్థానికులంటున్నారు. అయితే జీఎస్టీ, నోట్ల రద్దుతో స్థానిక వ్యాపారుల్లో బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. -
ఛత్తీస్ సీఎంపై వాజ్పేయి మేనకోడలు పోటీ
రాయ్పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మేనకోడలు కరుణా శుక్లాను కాంగ్రెస్ బరిలోకి దించనుంది. రాష్ట్రంలో నవంబర్ 12న మొదటి విడత జరిగే ఎన్నికలకు గాను ఆరుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రత్యర్థిగా రాజ్నందన్గావ్ నుంచి ఆమె రంగంలోకి దిగనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మాజీ ఎంపీ అయిన కరుణా శుక్లా బీజేపీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదంటూ 2013 ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి, 2014లో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ పాలనపై, సీఎం రమణ్సింగ్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే 18 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా.. రెండు విడతలకు కలిపి బీజేపీ 78 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. -
వాజ్పేయి అస్థికలతో సీఎం రాజకీయం
రాయ్పూర్: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అస్థికలతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన మేనకోడలు, కాంగ్రెస్ నేత కరుణ శుక్లా ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం రమణ్ సింగ్ గత పదేళ్లలో ఏనాడు వాజ్పేయి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించలేదని.. కానీ ఇప్పడు మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. వాజ్పేయి మరణానంతరం బీజేపీ స్వప్రయోజనాల కోసం ఆయన అస్థికలను, పేరును వాడుకోవటం దారుణమని మండిపడ్డారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తుందన్నారు. తొలుత బీజేపీలోనే కొనసాగిన కరుణ.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, ఛత్తీస్గఢ్ నూతన రాజధాని కాబోయే నయా రాయ్పూర్ పేరును అటల్ నగర్గా నామకరణం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్పేయి సేవలకు గుర్తుగా ఈ మార్పు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదే కాకుండా కొత్త రాజధానిలోని పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్పేయి పేరు పెట్టాలని రమణ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం భేటీ అయిన మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం రమణ్ సింగ్ మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అందుకే ఆయన పేరు కొత్త రాజధానికి పెడుతున్నట్లు, అలాగే స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మరోవైపు వాజ్పేయి అస్థికలను దేశంలోని పలు నదుల్లో నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అస్థికలను వివిధ రాష్ట్రాలకు తరలించారు. బుధవారం ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షుడు ధరమ్లాల్ కౌశిక్, వాజ్పేయి అస్థికలను ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
'వాజ్ పేయి, అద్వానీ శకం ముగిసింది'
బీజేపీ లో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీల శకం ముగిసిందని వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా అన్నారు. వార్టు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సేవ చేసిన తనను సీనియర్ నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు. చత్తీస్ ఘడ్ బీజేపీ శాఖ, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లు అనేకమార్లు తనను అవమానించే విధంగా ప్రవర్తించారని ఆమె విమర్శించారు. నరేంద్రమోడీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి కొందరి వ్యక్తుల చెప్పు చేతుల్లోనే బీజేపీ నడుస్తోందన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వ తీరుతో మనస్తాపం చెందిన కరుణా శుక్లా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఒకే లోకసభ స్థానాన్ని గెలుపొందిన కాంగ్రెస్ కు ఈసారి చత్తీస్ ఘడ్ లో ఎక్కువ స్థానాలు లభిస్తాయని ఆమె అన్నారు. -
హస్తం గూటికి వాజ్పేయి మేనకోడలు
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి మేనకోడలు, మాజీ లోక్ సభ సభ్యురాలు కరుణా శుక్లా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గురువారం ఆమె యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్ల బుధవారం యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. శుక్ల పార్టీలో చేరేందుకు సోనియా సుముఖత వ్యక్తం చేశారు. గతంలో బీజేపీలో శుక్లా జాతీయ స్థాయిలో పలు కీలక పదవులు నిర్వహించారు. తదానంతరం పార్టీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ వ్యవహారాలలో దూరంగా ఉంచుతున్నారని శుక్ల భావించారు. దాంతో గతేడాది ఛత్తీస్గఢ్ ఎన్నికల ముందు శుక్ల బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
బీజేపీకి వాజపేయి మేనకోడలు రాజీనామా
రాయపూర్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు చత్తీస్గఢ్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మేనకోడలు, మాజీ ఎంపీ కరుణా శుక్లా.. బీజేపీకి రాజీనామా నేడు చేశారు. సీనియర్ నాయకులు తనను నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆమె పార్టీని వదిలిపెట్టారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు పంపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని, దీంతో తాను కలత చెందానని కరుణా శుక్లా వాపోయారు. గతంలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. చత్తీస్గఢ్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించడంతో బీజేపీ ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటోంది.