breaking news
Kakatiya mines
-
నెలాఖరుకు అంచనాలన్నీ పూర్తిచేయండి
అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం కేంద్ర సాయం కోసం నివేదికలు పంపండి అనుమతులు పొందిన చెరువులకు వెంటనే టెండర్లు పిలవండి సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమం కింద ఈ ఏడాది చేపట్టే చెరువుల అంచనాలన్నీ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి చేరిన అంచనాలకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా అనుమతులు వచ్చినా టెండర్లు పిలవడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించిన మంత్రి.. అనుమతులు పొందిన వాటికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకోవడానికి 5 రోజుల్లో ముందుకు రాకపోతే నిబంధనల మేరకు టెండర్లను రద్దు చేసి రెండవ కాల్కు వెళ్లాలని సూచించారు. అగ్రిమెంట్కు రాని కాంట్రాక్టర్పై చర్యలకు ఉపక్రమించాలని, మూడేళ్లు వారి బిజినెస్ను సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ నెల 15 నుంచి వ్యవసాయాధికారులు రుణమాఫీ పత్రాల పంపకం చేపట్టిన దృష్ట్యా నీటి పారుదల ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించాలని, ముఖ్యంగా పూడికను పొలాల్లో వేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. ట్రాక్టర్లు, జేసీబీల లభ్యత లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. కేంద్ర ఆర్థిక సాయానికి పంపాల్సిన సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి పంపాలని ఆదేశించారు. చెరువుల దత్తతకు, విరాళం ప్రకటించేందుకు ముందుకొచ్చిన వారిని వ్యక్తిగతంగా లేక ఈమెయిల్ ద్వారా సంప్రదించి వారికి తగు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో ఈఎన్సీలు మురళీధర్, విజయ్ప్రకాశ్, నారాయణరెడ్డి, సీఈలు రామకృష్ణారావు, రమేశ్, ఎస్పీడీ మల్సూర్ పాల్గొన్నారు. చెరువుల పురోగతి ఇలా.. మొత్తం చెరువులు : 46,447 ఈ ఏడాది చేపట్టనున్నవి : 9,662 సర్వే పూర్తయినవి : 7,212 అంచనాలు పూర్తయినవి : 5,635 పరిపాలనా అనుమతులు లభించినవి : 2,569 టెండర్లు పిలిచినవి : 1,143 -
సిరుల మాగాణి..సింగరేణి
సింగరేణి.. నిలువెల్లా నల్లబంగారంతో తులతూగుతోంది. కార్మికులకు వరప్రదాయినిగా వర్ధిల్లుతోంది. యావత్తు తెలంగాణకు కల్పవల్లిగా భాసిల్లుతోంది. నాలుగు జిల్లాల్లో విస్తరించిన బొగ్గు గనులతో సిరుల పంట పండిస్తోంది. తట్టాచెమ్మస్ వాడక ం నుంచి.. అధునాతన అడ్రియాల గని ప్రారంభించే దాక ఎదిగిందీ సంస్థ. బ్రిటిష్ కాలంలో పురుడుపోసుకున్న సింగరేణి.. నూటాపాతిక వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. . తెలంగాణ రాష్ర్టంలో ఇవి తొలి వార్షికోత్సవాలు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలోని గోదావరినది లోయ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది సింగరేణి. వేలాది మందికి ప్రత్యక్షంగా.. లక్షలాది మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిలో భాగస్వామ్యమవుతోంది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఇలా.. అండర్గ్రౌండ్,ఓపెన్కాస్ట్విధానాల్లోఉత్పత్తి చేస్తారు. లక్ష్యంలో 70 శాతం ఓపెన్కాస్ట్ల ద్వారా 30 శాతం భూగర్భ గనుల ద్వారా బొగ్గును వెలికితీస్తారు. దేశంలో 9 శాతం బొగ్గును సింగరేణి అందిస్తోంది. సింగరేణిలో 32 భూగర్భ గనులున్నాయి 16 ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులున్నాయి. భూగర్భ గనుల్లో ప్రతీ టన్ను బొగ్గు వెలికితీతకు ఖర్చు 3,300. కానీ రూ. రూ 2,650 కే విక్రయిస్తున్నారు. ఇందులో రూ.2,450 వేతనాలకే పోతుంది. ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులో ప్రతీ టన్ను బొగ్గు వెలికితీతకు రూ. 1110 ఖర్చవుతుంది. దీన్ని విక్రయిస్తే రూ. 2,700 వస్తుంది. ఇక్కడ ప్రతీ టన్నుకు కార్మికుడికి చెల్లించే మొత్తం రూ. 210 మాత్రమే. అందుకే యాజమాన్యం ఓసీపీలవైపే మొగ్గు చూపుతోంది. సింగరేణి నుంచి బొగ్గును విద్యుత్, సిమెంట్ పరిశ్రమలకు 70 శాతం పంపిస్తున్నారు. 1991-92లో రికార్డుస్థాయిలో 475 సమ్మెలతో బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 1997నాటికి కంపెనీఆర్థికస్థితి మరింత దిగజారింది. 1997-98 నుంచి రూ. 102 కోట్లతో నేటికి లాభాల బాటలో పయనిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా లాభాల్లో 10 శాతం వాటాను కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. 61,778మందికార్మికులకు 49,800 క్వార్టర్లు న్నాయి. 1998లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించిం ది. అదే లాభాలకు నాంది అయింది. సంస్కరణలతో వచ్చిన మార్పులు... 1991లో వచ్చిన సంస్కరణలు సింగరేణిపై తీవ్ర ప్రభావం చూపాయి. కార్మికుడు రిటైర్డయితే ఆయన వారసుడికి ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన తొలగించారు. భూగర్భ గనుల్లో తట్టాచెమ్మస్ ద్వారా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తూ యాంత్రీకరణను వేగవంతం చేశారు. 2000-01లో 32 వేల మంది కోల్ఫిల్లర్ కార్మికులండగా... నేడు వారి సంఖ్య 5 వేలకు పడిపోయింది. ఐఏఎస్ అధికారి ఏపీవీఎన్ శర్మ సింగరేణి సంస్థ సీఎండీగా ఉన్నప్పుడు సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. వాలంటరీ రిటైర్డ్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్)ను తెచ్చి కొంత మొత్తాన్ని వారికి అందిస్తూ కార్మికుల సంఖ్య కుదించారు. సింగరేణికి కలికితురాయి ‘అడ్రియాల’ సింగరేణి ప్రతిష్టాత్మకంగా రామగుండం ఏరియాలో అడ్రియాల వద్ద పంచ్ఎంట్రీ గనిని ప్రారంభించింది. సుమారు రూ. 1400 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. జర్మనీకి చెందిన క్యాటర్పిల్లర్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలో 400 మీటర్ల లోతులో బొగ్గును సర్ఫెర్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తూ వెలికితీస్తారు. ఏటా 2 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీత ఈ గని లక్ష్యం. కాకతీయ రాజుల ప్రతీకగా కేటీకే అతివేగంగా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి సింగరేణి గనులు జిల్లాకు తలమానికంగా నిలుస్తున్నాయి. కాకతీయ రాజుల వీరత్వానికి ప్రతీకగా భూపాలపల్లిలో కాకతీయ గనుల పేరుతో కేటీకే 1వ గనిని 1988 జూలై 15న అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంబించారు. 1991-1992లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. కేటీకే 2, 5, 6, లాంగ్వాల్ ప్రాజెక్ట్, ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్లు విస్తరింంచారు. 7008 మంది కార్మికులు పనిచేస్తూ రోజుకు 10వేల టన్నుల బొగ్గు వెలికి తీస్తున్నారు. ఏరియాలోని కేటీకే 2వ గనిలో పూర్తి స్థాయిలో యాంత్రీకరణతో బొగ్గు వెలికి తీస్తుండగా కేటీకే 1, 5, 6 గనుల్లో కొన్ని ప్రదేశాల్లో నేటికి కోల్ ఫిల్లర్లతో బొగ్గు వెలికి తీస్తున్నారు. భూపాలపల్లి పక్కనే ఉన్న తాడిచర్లలో రెండు ఉపరితల గనులు రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేయనుంది.