కడుపునొప్పితో వెళ్లి.. కంగుతిన్నాడు!
వాషింగ్టన్: తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ పేషెంట్కు డాక్టర్లు చికిత్స చేశారు. చికిత్స తర్వాత కొన్ని గంటలకు కళ్లు తెరిచిన పెషేంట్ తనకు కనిపించిన దృశ్యానికి షాక్ తిన్నాడు. ఎందుకుంటే అతడి కాళ్లు, చేతులు ఇప్పుడు కనిపించడం లేదు. అవును.. డాక్టర్లు అతడికి చికిత్స చేసి వాటిని తొలగించారు. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రానికి చెందిన కెవిన్ బ్రీన్ అనే 44 ఏళ్ల వ్యక్తికి కొద్దిరోజులుగా కడుపునొప్పి సమస్య ఉంది. భార్య జూలీ బ్రీన్తో పాటు చెకప్ కోసం హాస్పటల్కు వెళ్లాడు. డాక్టర్ల పరీక్షలు ఫలితాలన్నీ నెగటీవ్ అని వచ్చాయి.
మొదట కొన్ని టాబ్లెట్లు రాసిచ్చారు వైద్యులు. అవి వాడిన తర్వాత కెవిన్ కడుపునొప్పి తీవ్రమైంది.. తప్ప తగ్గలేదు. ఇక లాభం లేదని భావించిన డాక్టర్లు పెషేంట్ శరీరాన్ని పూర్తిగా పరీక్షించి కంగుతిన్నారు. ఎందుకంటే కెవిన్ కడుపులో దాదాపు ఒకటిన్నర లీటర్ల చీము ఉందని గుర్తించారు. అందువల్లే అతడి అవయవాల పనితీరు తగ్గడంతో పాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది.
కొన్ని సర్జరీలు చేస్తే అతని సమస్య తీరుతుందని వైద్యులు కెవిన్ భార్యకు చెప్పారు. భర్త ప్రాణాలే ముఖ్యమని జూలీ బ్రీన్ డాక్టర్లకు చెప్పింది. సర్జరీ పూర్తయిన తర్వాత కళ్లు తెరిచిన కెవిన్ భయంకరమైన నిజాన్ని చూడాల్సి వచ్చింది. సర్జరీలో భాగంగా అతడి రెండు కాళ్లు, ఎడమ చెయ్యి, మరో చేతివేళ్లను తొలగించారు. చాలా అరుదైన ఇన్ఫెక్షన్ అని, సర్జరీ చేయకపోతే ప్రాణాలు దక్కవని చెప్పినందువల్లే సర్జరీ చేయాలని డాక్టర్లకు చెప్పినట్లు భర్తకు జూలీ బ్రీన్ వివరించింది.