గుర్తుతెలియని చోటుకు కన్హయ్య
కోర్టు కస్టడీ ఆదేశం తర్వాత తరలించిన పోలీసులు
న్యూఢిల్లీ: రాజద్రోహం ఆరోపణలపై అరెస్టైన జేఎన్యూ నాయకుడు కన్హయ్యను ఢిల్లీ కోర్టు గురువారం ఒక రోజు పోలీసు కస్టడీకి అప్పగించింది. దీంతో పోలీసులు ఆయనను రాత్రి 8.30 గంటలకు తీహార్ జైలు నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. దేశవ్యతిరేక నినాదాల కేసులో అరెస్టయిన విద్యార్థులు ఖాలిద్, అనిర్బన్ల స్వరనమూనా సేకరణకు అనుమతించాలని ఢిల్లీ కోర్టును పోలీసులు కోరారు. వారితో కలిపి విచారించేందుకు కన్హయ్యను తమ కస్టడీకి అప్పగించాలన్నారు. కాగా, పటియాలా కోర్టులో హింసకు పాల్పడిన లాయర్లపై దాఖలైన ధిక్కరణ పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించనుంది.
నినాదాలు చేసిన వారిలో తాను లేనని ఖలీద్ చెబుతుండగా, అవి దేశవ్యతిరేక నినాదేలనని రుజువేంటని భట్టాచార్య పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఆ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు వెతుకుతున్న మరో ముగ్గురు విద్యార్థి సంఘ నేతలు రామ నాగ, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాశ్.. తాము ఆరెస్ట్కు సిద్ధంగా ఉన్నామంటూ తమ చిరునామా వివరాలతో పోలీసులకు లేఖ రాశారు. ఇదిలాఉండగా, జేఎన్యూ వ్యవహారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చమన్ లాల్ తనకు ప్రభుత్వం 2003లో ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కు ఇచ్చారు. హిందీ మాట్లాడని ప్రాంతానికి చెందిన హిందీ రచయితగా సెంట్రల్ హిందీ డెరైక్టరేట్ ఇచ్చిన పురస్కారాన్ని తిరిగిస్తున్నట్లు ఆయన తెలిపారు.