breaking news
JNIMS
-
కరోనా పేషెంట్ మృతి.. హెల్త్ వర్కర్లపై దాడి
ఇంఫాల్: కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న హెల్త్ వర్కర్లపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మొన్న అస్సాంలో హెల్త్ వర్కర్లపై దాడి ఘటన మరువకముందే తాజాగా మణిపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(జెన్ఐఎమ్ఎస్)లో కరోనా పేషెంట్ బంధువులు హెల్త్ వర్కర్లపై దాడికి దిగారు. దీంతో పాటు ఐసీయూ వార్డులోనూ మెడికల్ ఎక్విప్మెంట్ను నాశనం చేశారు. ఇవన్నీ అక్కడి ఆసుపత్రి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కాగా 33 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఆదివారం కన్నుమూయడంతో ఆమె బంధువులు ఆగ్రహంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం మేరకు.. మూడ్రోజుల క్రితం కరోనాతో సదరు మహిళ మా ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో ఐసీయూకు షిఫ్ట్ చేయాలని మహిళ బంధువులకు ఆసుపత్రి వర్గం తెలిపింది. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు.. అయితే ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన కాసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి వచ్చి హెల్త్ వర్కర్లపై దాడికి దిగారు. అంతేగాకుండా ఐసీయూలోని మెడికల్ ఎక్విప్మెంట్ను నాశనం చేశారు. కాగా హెల్త్ వర్కర్లపై దాడిని జెన్ఐఎమ్ఎస్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ కేహెచ్ లోకేశ్వర్సింగ్ ఖండించారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం అవమానీయం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అని పేర్కొన్నారు. చదవండి: డాక్టర్పై భయానక దాడి.. వెంటాడి.. వేటాడి -
‘నా జీవితంలో ఎంతో కష్టమైన ప్రయాణం ఇదే’
ఇంపాల్: కరోనా వచ్చిన నాటి నుంచి మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. బంధువులు లేరు.. వేడుకలు లేవు. ఎక్కడికైనా వెళ్లాలంటే అంటే ఈ మాయదారి రోగం ఎక్కడ అంటుకుంటుందో అనే భయం. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కరోనా బారిన పడిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెగిటివ్ వచ్చినప్పటికి ఇంకా వారిని వివక్షతోనే చూస్తున్నారు. తిరిగి ఇంటికి తీసుకెళ్లాలన్నా కుటుంబ సభ్యులు జంకుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా నుంచి కోలుకున్న ఓ పేషెంట్కి, ఒక మహిళ ఆటో డ్రైవర్ సహాయం చేసింది. ఆస్పత్రి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషెంట్ స్వగ్రామానికి మహిళా డ్రైవర్ తన ఆటోలో తీసుకెళ్లింది. మణిపూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళా ఆటో డ్రైవర్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాలు.. సోమిచాన్ చితుంగ్(22) అనే యువతి మే నెలలో కోల్కతా నుంచి మణిపూర్కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆమెకి చికిత్స అందించారు. 14 రోజుల చికిత్స తర్వాత మే 31న ఆమెకి కరోనా నెగిటివ్గా తేలింది. దాంతో వైద్యులు చితుంగ్ని డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమె స్వగ్రామం కామ్జాంగ్ వరకు అంబులెన్స్ ఏర్పాటు చేయడానికి ఆస్పత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలిపింది. ఆయన ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ కరోనా నుంచి కోలుకున్న పేషంట్ని తీసుకురావలని చెప్పడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈ సంగతి కాస్తా లైబికి తెలిసింది. కరోనా భయంతో ఎవరు ముందుకు రాకపోవడంతో తానే చితుంగ్ని ఇంటికి చేర్చాలని నిర్ణయించుకుంది. వెంటనే వెళ్లి తాను చితుంగ్ని ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. (లాక్డౌన్ వల్ల కలిగిన లాభం ఇదే..!) నా మాటలను సీరియస్గా తీసుకోలేదు దీని గురించి లైబి మాట్లాడుతూ.. ‘మొదట వారు నా మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. దాంతో నాకు సొంత ఆటో ఉందని.. దాదాపు పదేళ్ల నుంచి ఆటో నడుపుతున్నానని వారికి చెప్పాను. జాగ్రత్తగా తీసుకెళ్తానని చెప్పి ఒప్పించాను. అప్పుడు వారు నా ఆటోలో రావడానికి అంగీకరించారు. మే 31 రాత్రి మొదలైన మా ప్రయాణం జూన్ 1న ముగిసింది. సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న చితుంగ్ ఇంటికి చేరుకోవడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఇందుకు గాను వారి వద్ద నుంచి రూ.5 వేల రూపాయల కిరాయి తీసుకున్నాను. మాతో పాటు నా భర్త ఓనమ్ రాజేంద్ర కూడా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చింది లైబి. (పోలీస్ భార్య ప్రేమ) నా జీవితంలో అత్యంత కష్టమైన ప్రయాణం తన జీవితంలో ఇది అత్యంత కష్టతరమైన ప్రయాణం అని చెప్పుకొచ్చింది లైబి. ‘కమ్జోంగ్ వరకు పొగమంచు కురుస్తుంది. నా ఆటో హెడ్లైట్ సరిగా పని చేయడం లేదు. రోడ్డు కూడా బాగాలేదు. అంతా గుంతలు గుంతలుగా ఉంది. ఎలాగైతేనేం చితుంగ్ని క్షేమంగా ఇంటికి చేర్చాను’ అని లైబి చెప్పుకొచ్చింది. అనంతరం చితుంగ్ మాట్లాడుతూ.. ‘లైబికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆమె చేసిన సాయాన్ని ఎన్నటికి మరిచిపోను. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే’ అన్నారు. దీని గురించి తెలుసుకున్న మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బీరెన్ సింగ్ లైబిని ప్రశంసించారు. ‘జేఎన్ఐఎమ్ఎస్ నుంచి డిశ్చార్జ్ అయిన అమ్మాయిని తీసుకెళ్లడానికి హాస్పటల్ సిబ్బంది నిరాకరించారు. ఇతర ప్రైవేట్ వాహనదారుల ముందుకు రాలేదు. కానీ వీటిని లెక్కచేయకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ పేషెంట్ని ఇంటికి తీసుకెళ్లిన పంగేకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీమతి లైబీ ఓనమ్ను 1,10,000 రూపాయల నగదు బహుమతితో గౌరవించడం ఆనందంగా ఉంది. ఇంఫాల్ నుంచి కమ్జోంగ్కు ఎనిమిది గంటలపాటు ఆటో నడిపిన ఆమె సేవ ఎంతో అభినందనీయం' అని ప్రశంసిస్తూ బీరెన్ సింగ్ ట్వీట్ చేశారు.(పాజిటివ్ ఉన్నా లక్షణాల్లేవా!) -
‘మరి కొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండండి’
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిలను మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిందిగా ఇంఫాల్లోని జవహర్లాల్నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(జేఎన్ఐఎంఎస్) వైద్యులు సూచించారు. మణిపూర్లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దుచేయాలంటూ 16ఏళ్లపాటు చేసిన నిరాహార దీక్షను ఇరోం షర్మిల గత మంగళవారం విరమించడం తెలిసిందే. అప్పట్నుంచీ ఆమె ఇంఫాల్లోని జేఎన్ఐఎంఎస్ ఆస్పత్రిలోనే కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, అయితే ఎవరైనా పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేసి.. విరమించగానే ఘనాహారం తినడం ప్రారంభిస్తే అతడు లేదా ఆమె శరీరం ఏ విధంగా స్పందిస్తున్నదనేదానిపై వైద్య చరిత్రలో స్పష్టత లేదని వారు తెలిపారు. అందువల్ల షర్మిల మరికొన్నాళ్లపాటు వైద్య పర్యవేక్షణలో ఉండడం మంచిదని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం షర్మిలకు పాలు, పండ్లరసాలతోపాటు మెత్తగా ఉడికించిన అన్నం, ఓట్స్ వంటి తేలికపాటి ఆహారం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతమిస్తున్న ఆహారానికి ఆమె శరీరం బాగానే సహకరిస్తోందన్నారు. అయితే అన్నిరకాల ఘనాహారాన్ని వెంటనే తీసుకునే స్థితిలో ఆమె శరీరం లేదని స్పష్టం చేశారు. షర్మిల ఆరోగ్య పరిస్థితిని వివిధ స్పెషలిస్టులతో కూడిన వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కాగా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వరకూ ఆసుపత్రిలో షర్మిల ఉంటుందని ఆమె సోదరుడు సింఘాజిత్ తెలిపారు.