breaking news
Jind district
-
హరిత రవాణా దిశగా ముందడుగు
జింద్/జలంధర్: దేశంలో హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించుకోవడం హరిత రవాణా దిశగా కీలకమైన ముందడుగు, ‘మేక్ ఇన్ ఇండియా’కు ఒక విజయవంతమైన ఉదాహరణగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్లో మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలును ఆయన శుక్రవారం హరియాణాలోని జింద్ స్టేషన్లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ప్రపంచంలో హైడ్రోజన్ ఇంధన రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. మోదీ హరియాణాలో రూ.14,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. హైడ్రోజన్ రైలు ఆత్మనిర్భర్ భారత్, ఆధునిక రవాణా వ్యవస్థ పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల తలెత్తిన పరిస్థితులు ఒకవేళ 2014కు ముందే ఏర్పడి ఉంటే భారతీయ రైల్వేల కార్యకలాపాలు స్తంభించిపోయేవని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పట్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు ప్రధానంగా డీజిల్తో నడిచేవని గుర్తుచేశారు. అప్పట్లో డీజిల్ సరఫరాకు అంతరాయం కలిగి ఉంటే డీజిల్ ఆధారిత రైళ్లు ఆగిపోయేవని పేర్కొన్నారు. దేశం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనేదని చెప్పారు. కానీ, ఇది 2014 నాటి పరిస్థితి కాదన్నారు. ‘‘సమస్యలకు పరిష్కారాలను ముందుగానే ఆలోచించి, వాటిని క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే వ్యక్తి మోదీ. పశి్చమాసియా నేడు రణరంగంగా మారింది. హార్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం, చమురు సంక్షోభం ఉన్నప్పటికీ భారత రైల్వేలు, దేశ అభివృద్ధి పరుగు మాత్రం ఆగిపోలేదు’’అని వ్యాఖ్యానించారు. అత్యంత పొడవైన రైలు ‘‘హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడిపే సామర్థ్యం కేవలం మూడు లేదా నాలుగు దేశాలకు మాత్రమే ఉంది. 21వ శతాబ్దపు ఈ సాంకేతికత విషయంలో భారతీయ రైల్వే ఒక పెద్ద ముందడుగు వేసింది. ఈ రైలు 3,200 హార్స్పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదే కాకుండా అత్యంత పొడవైనది(10 కోచ్లు) కూడా. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో హైడ్రోజన్ రైలుకు కేవలం మూడు లేదా నాలుగు కోచ్లు మాత్రమే ఉంటాయి. కానీ, మన దేశంలో ఈ రైలుకు 10 కోచ్లు ఉన్నాయి. ఈ భారీ హైడ్రోజన్ రైలును నడపడం ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. భవిష్యత్తులో హైడ్రోజన్ రైలుకు సంబంధించిన మరిన్ని మౌలిక సదుపాయాలు రాబోతున్నాయి. కురుక్షేత్రలో సిక్కు మ్యూజియం జింద్ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావడం హర్షణీయం. స్వచ్ఛతను ప్రజలు తమ జీవన విధానంలో, దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చుకోవాలి. జింద్ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇది మహారాజా రంజిత్ సింగ్ కీర్తితోనూ, పాండవులకు సంబంధించిన విశ్వాసంతోనూ ముడిపడి ఉన్న ప్రాంతం. ఈ వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, దానిని గర్వంగా భావి తరాలకు అందించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఇదే స్ఫూర్తితో కురుక్షేత్రలో ఈ రోజు ఒక సిక్కు మ్యూజియంకు శంకుస్థాపన చేశాం. ఈ కొత్త మ్యూజియం హరియాణా సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది’’అని మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వేర్వేరు రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. కేరళలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన ఆరు రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే మధ్యప్రదేశ్లో 13 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో రూ.4,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ‘వికసిత్ భారత్’దిశగా సాగే ప్రయాణంలో భవిష్యత్తుకు సంబంధించిన సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణ సేవలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుత తరానికే కాకుండా, రాబోయే తరాలకు కూడా మేలు చేకూర్చే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. మోదీ శుక్రవారం పంజాబ్లో పర్యటించారు. రూ.5,470 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.పంజాబ్లో అరాచక పాలన పంజాబ్లో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వానికి స్వచ్ఛమైన ఉద్దేశాలు గానీ, నిజాయితీ గానీ లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, కనీసం పోలీస్ స్టేషన్లు కూడా సురక్షితంగా లేవని ఆరోపించారు. ఇది ‘ఖట్టర్ బీమాన్ సర్కార్’అని విమర్శించారు. పంజాబ్లో శాంతిభద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎప్పుడు, ఎక్కడ ముఠా పోరు చెలరేగుతుందో, ఏ దిశ నుంచి తూటాలు దూసుకొస్తాయో ఎవరూ ఊహించలేరని ఆందోళన వ్యక్తంచేశారు. జలంధర్లో జరిగిన సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో బహిరంగంగానే బలవంతపు వసూళ్లు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఎవరికీ రక్షణ లేదన్నారు. పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నిజమైన మార్పును తీసుకురావడంతోపాటు అభివృద్ధి చెందిన, సంపన్నమైన పంజాబ్ను నిర్మించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మోదీ తేల్చిచెప్పారు. -
ఆర్మీ లెఫ్టినెంట్గా ఆయమ్మ కొడుకు!..!
కొన్ని సక్సెస్లు సంవత్సరాల తరబడి నిరీక్షణ, అంకితభావం, ఓపికతో సాకారం అవుతాయి. అలాంటి కథలు ఎప్పటికీ చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం.చిన్ననాటినుంచి కష్టాలు, తగినన్ని వనరుల కొరత ఇన్ని ఉన్నా..ఎలాగైన అద్భుతమైన విజయం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగి గెలుపు తీరాలకు చేరుకున్నవారని జగజ్జేతలు అనొచ్చు. కలను నిజం చేసుకోవడంలో మార్గదర్శకులు కూడా. అలాంటి ప్రేరణాత్మక సక్సెస్ స్టోరీ ఈ లెఫ్టినెంట్ హర్దీప్ గిల్. హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాకు చెందిన హర్దీప్గిల్ చిన్ననాటి నుంచి ఆర్మీలో సేవ చేయాలనేది డ్రీమ్. బాల్యంలో స్కూల్లో మాస్టర్ల వల్ల మదిలో పురుడుపోసుకున్న డ్రీమ్ అతడితోపాటు పెరిగిందే కానీ కనుమరగవ్వలేదు. అయితే హర్దీప్ రెండేళ్ల వయసు నుంచి కన్నీళ్ల కష్టాల కడలిని ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నతనంలోనే తండ్రిన పోగొట్టుకున్నాడు. కుటుంబ భారం అంతా అమ్మమీదే పడింది. ఆమె మధ్యాహ్నా భోజన పథకం వంటమనిషిగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేది. అలాగే కొంత ఆదాయం కోసం చిన్నపాటి వ్యవసాయం కూడా చేస్తుండేది అప్పడప్పుడూ. ఇంట్లో ఉన్నత చదువుకు తగినన్ని వనరులేమి లేవు. కానీ ఆ వాతావరణమే గిల్కి నిలకడను, క్రమశిక్షణ, బాధ్యతలను అలవర్చాయి. తనచుట్టూ ఇన్ని సవాళ్లు ఉన్న గిల్ తన ఆశయాన్ని కొనసాగించాడమే కాకుండా, ఎలాగైన ఆర్మీలో చేరి సేవ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఆనేపథ్యంలో తన గ్రామంలోనే పాఠశాల విద్య, ఇగ్నో ద్వారా బీఏ పూర్తి చేసి చదవు తోపాటు ఇతర రక్షన పరీక్షలకు సిద్ధమవ్వడం కొనసాగించాడు. సుమారు నాలుగేళ్ల క్రితం గిల్ భారత వైమానిక దళంలో ఎయిర్మెన్గా ఎంపికయ్యాడు. అతని విజయం కుటుంబంలో కొండంత ఆశను నెప్పింది. శిక్షణా ప్రక్రియ పూర్తి అయ్యి సర్వీస్లో చేరతాడు అనగా అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టి..మునుపటి నియమాకాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ తన ప్రస్థానం మొదట నుంచి మొదలుపెట్టాల్సి వచ్చినందుకు నిరాశ పడలేదు. ఈసారి ఏకంగా కమిషన్డ్ అధికారి అవ్వడమే లక్ష్యంగా ఎస్ఎస్సీ పరీక్షలపై ఫోకస్ పెట్టాడు. పదేపదే ఓటములు..గిల్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు అనేకసార్లు హాజరవ్వుతూనే ఉండేవాడు. ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉండేది. రాతపూర్వక పరీక్షలోనే విజయవంతమవ్వలేక నానా తిప్పలు పడ్డాడు. పాపం అది తన ఆత్మవిశ్వాసానికి, సహనానికి పరీక్షలా మారింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్నికొనసాగించాడు. చివరికి తొమ్మిదో ప్రయత్నంలో సక్సెస్ అందుకుని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్లో 54వ ర్యాంక్ను సాధించాడు.ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణగిల్ 2024లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. కఠినమైన శిక్షణా షెడ్యూల్ ఉండేది. ఆ దినచర్య చాలా సవాలుతో కూడినది. ముందుకుసాగడం అంత సులభం కాదు. కానీ అందుకు తగ్గట్టుగా తనను తాను రాటుదేల్చుకుని మరి నిలబడ్డాడు. అనుకున్నట్లుగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో లెఫ్టినెంట్ కమిషన్డ్ అధికారిగా నియమించబడ్డాడు. గిల్ని సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ 14వ బెటాలియన్కు అదికారిగా నియమించారు. ఇది క్రమశిక్షణ, కార్యచరణ సింసిద్ధతలకు పేరుగాంచిన యూనిట్. ఈ దృఢ సంక్పలం తన తల్లిన నుంచి వచ్చిందని చెబుతున్నాడు గిల్. ముఖ్యంగా ఎయిర్మ్యాన్ అవకాశాన్ని కోల్పోవడాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాగే కొండంత ఆశతో మొదటి నుంచి మొదలుపెడుతే..తీరా పదేపదే పలకరించే వైఫల్యాలను అధిగమించి సక్సెస్ అందుకోవడం అనేది మాటల్లో చెప్పగలిగేంత సులభం కాదు అని అంటాడు గిల్. ఇది అలాంటి ఇలాంటి సక్సెస్ స్టోరీ కాదుకదూ..!(చదవండి: ఇండియన్ మిలిటరీ అకాడమీ తొలిమహిళా ఆఫీసర్! 93 ఏళ్ల రికార్డు బ్రేక్ -
గ్యాంగ్ రేప్ బాధితురాలిని పెళ్లాడిన రైతు
చండీగఢ్: సామూహిక అత్యాచారాలు, పరువు హత్యలు, లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వంటి ప్రతికూల అంశాలతో వార్తల్లో ఉండే హర్యానాలో ఓ సానుకూల కథనం వెలుగు చూసింది. జింద్ జిల్లాకు చెందిన యువరైతు ఒకరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి కొత్త జీవితం ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి దన్నుగా నిలిచాడు. లాయర్ కావాలన్న ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు మద్దతు అందించాడు. జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) గతేడాది డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు. 'నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది తన లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశామ'ని జితేందర్ తెలిపాడు. తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ ను ఆదర్శప్రాయుడిగా జనమంతా కొనియాడుతున్నారు. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
జింద్: హర్యానాలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురయింది. జింద్ జిల్లా రాజానా కుర్ద్ గ్రామంలో ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. సోమవారం ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. 15 ఏళ్ల బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లినప్పుడు దుండగులు ఆమెను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులు పవన్, నరేందర్, దాల్షర్గా గుర్తించారు. ఈ ముగ్గురు రాజానా కుర్ద్ గ్రామానికే చెందిన వారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితులపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


