breaking news
jats reservations
-
జాట్లు తలరాతలు మార్చేస్తారు..!
సాక్షి, న్యూఢిల్లీ: జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ రాసిన లేఖతో హస్తినలో ఈ సామాజిక వర్గం పేరుమీద రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ రాజకీయాల్లో జాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సుమారు 12 ప్రాంతాల్లో 8 నుంచి 28 శాతం వరకు జాట్లున్నారు. ఢిల్లీకి హరియాణా రాష్ట్రంతో సరిహద్దు ఉంది. సుమారు 225 సరిహద్దు గ్రామాల్లో బలమైన సంఖ్యలో జాట్లున్నారు. ఫలితంగా, చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో వీరి ఓట్లు నిర్ణయాత్మకంగా మారాయి. ఇక్కడి మొత్తం ఓటర్లలో 7నుంచి 8 శాతం వాటా వీరిదే. వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది. ఇటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, అటు బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల అనుగ్రహంపైనే ఆశలు పెట్టుకున్నాయి. వారిని ఆకర్షించేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఢిల్లీలోని 12 అంసెబ్లీ నియోజకవర్గాల్లో జాట్ల ప్రభావం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 8నుంచి 28 శాతం జాట్ల జనాభా ఉందంటున్నాయి. ముండ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో 28 శాతం, నజఫ్గఢ్లో 25, నరేలా, బిజ్వాసన్లలో 23, బవానా, నాంగ్లోయి జాట్లలో 20, మటియాలా, మెహ్రోలిల్లో 16, ఉత్తమ్నగర్లో 15, వికాస్పురిలో 10, ఛత్తర్పూర్లో 9, కిరాడిలో 8శాతం వరకు జాట్లు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కైలాశ్ను జాట్ నేతగా ప్రమోట్ చేసిన ఆప్ ఒకప్పుడు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. అయితే, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేసిన 8 మంది జాట్ ఎమ్మెల్యేలు, 2020లో 9 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఈ ప్రాంతాలపై ఆప్ మంచి పట్టు సాధించింది. జాట్ నేతగా కైలాశ్ గెహ్లాట్ను ప్రమోట్ చేసి మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే, ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. కొన్ని చోట్ల బీజేపీకి అనుకూలం గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం మంచి ఆధిక్యం కనబరిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జాట్ల ప్రాబల్యం ఉన్న వార్డుల్లో బీజేపీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. పొరుగు రాష్ట్రమైన హరియాణాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జాట్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే న్యూఢిల్లీ స్థానం నుంచి అర్వింద్ కేజ్రీవాల్పై పోటీ చేస్తున్న పర్వేశ్ వర్మ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. పర్వేశ్కు టికెట్ ఇచ్చి జాట్ల ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. -
జాట్లకు మీరు ద్రోహం చేశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వేడి పెరుగుతోంది. తాజాగా మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ ‘జాట్’అ్రస్తాన్ని ప్రయోగించారు. ఆ సామాజికవర్గాన్ని కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గురువారం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీలోని జాట్లకు ద్రోహం చేశారంటూ ఆ లేఖలో ఆరోపించారు. బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాగే, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఎన్నికల ముందు కేజ్రీవాల్కు జాట్లు గుర్తుకొచ్చారా? అంటూ పర్వేశ్ వర్మ విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గం వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రెండు పేజీల లేఖలో జాట్లకు సంబం«ధించి పలు అంశాలను ఆయన పేర్కొన్నారు. ‘ఢిల్లీలోని జాట్లకు మీరు ద్రోహం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో జాట్ వర్గాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా మోసం చేస్తోంది. 2015 మార్చి 26న జాట్ నాయకులను ఇంటికి పిలిచి ఢిల్లీలోని జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చుతామని మీరు హామీ ఇచ్చారు. 2019 ఫిబ్రవరి 8న హోం మంత్రి అమిత్ షా కూడా జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని జాట్ కమ్యూనిటీ విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ, ఢిల్లీలోని జాట్లకు రిజర్వేషన్లు ఎందుకు లభించడంలేదు? ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గానికి చెందిన వేలాది మంది పిల్లలు కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంవల్ల ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందలేకపోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర ఓబీసీ జాబితాలో వారు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాట్లు ప్రయోజనాలు పొందేందుకు మీ ప్రభుత్వం అనుమతించడం లేదు. మీ ప్రభుత్వ పక్షపాత వైఖరితో ఢిల్లీలోని జాట్లతోపాటు. మరో ఐదు సామాజికివర్గాలకు చెందిన వారు విద్యా, ఉపాధి, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఓబీసీ జాబితాలో మార్పులు చేసి ఓబీసీ హోదా ఉన్న ఆయా వర్గాలకు న్యాయం చేయండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటా’అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఆప్ ఫిర్యాదు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం ఢిల్లీ సీఎం ఆతిశీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ సింగ్, ఎంపీ సంజయ్ సింగ్లతో కలిసి కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ను కలిసి రెండు పేజీల ఫిర్యాదును అందజేశారు. హర్ ఘర్ నౌకరీ (ఇంటికో ఉద్యోగం) పేరుతో ఓట్లు అడుగుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న పర్వేశ్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వర్మ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల జాబితాలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని సీఎం ఆతిశీ మరో ఫిర్యాదు చేశారు. ‘నేను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో గత 15 రోజుల్లోనే కొత్తగా 13 వేల మంది ఓటర్లు చేరారు. అదేవిధంగా, ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని 5,500 దరఖాస్తులు ఈసీకి అందాయి. ఇదో భారీ కుట్ర’అని అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు. పరేŠవ్శ్ వర్మ ఇంటిపై తక్షణమే ఎన్నికల నిఘా అధికారులు దాడి చేయాలని డిమాండ్ చేశారు. పర్వేశ్ వర్మ మహిళలకు రూ.1,100 బహిరంగంగానే పంచుతున్నారని ఆరోపించారు. ఓటరు జాబితాలో అవకతవలకు పాల్పడుతున్న స్థానిక ఎలక్టోరల్ అధికారులను సస్పెండ్ చేయాలి లేదా బదిలీ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.ఆప్ సర్కారు పడిపోవాలని వారు కోరుకుంటున్నారు: పర్వేశ్ వర్మ ఎన్నికల ముందు కేజ్రీవాల్కు జాట్లు గుర్తుకువచ్చారా? అంటూ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మండిపడ్డారు. జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కేజ్రీవాల్ డిమాండ్పై ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘ఈసారి ఢిల్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. జాట్ల కోసం కేజ్రీవాల్ ఏమైనా చేసి ఉంటే.. ఎన్నికలకు 25 రోజుల ముందు జాట్లు గుర్తుకువచ్చేవారు కాదు. ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల్లో జాట్లు మాత్రమే కాదు.. గుజ్జర్లు, యాదవులు, త్యాగులు, రాజ్పుత్లు కూడా ఉన్నారు. వీరంతా కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారు’అని పర్వేశ్ వర్మ అన్నారు. -
జాట్ ఆగ్రహ జ్వాల వెనుక...
జాతిహితం గడచిన సంవత్సరం అనూహ్యంగా బీజేపీ గెలుపొందడంతో ఈ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ శిబిరాలను సవాలు చేస్తున్నట్టు బీజేపీ జాట్ వర్గానికి చెందని వ్యక్తిని, అది కూడా పంజాబీ కాందిశీకుల కుటుంబానికి చెందిన వ్యక్తిని (కట్టర్) ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. మంత్రివర్గంలో రెండో స్థానం కూడా జాట్ వర్గానికి చెందని అనిల్ విజయ్కే ఇచ్చింది. ఇతడు కూడా పంజాబ్ నుంచి వచ్చినవాడే. కొత్త పోలీస్ డెరైక్టర్ జనరల్ కూడా జాట్ వర్గానికి చెందడు. హరియాణాలో జరిగిన విధ్వంసం యావత్తు అటు కులానికో ఇటు ఉద్యో గాలకో కాక, ‘ఇచ్చిపుచ్చుకోవ డా’నికి సంబంధించినది ఎందుకయింది? దేశంలోనే అత్యంత ప్రశాంతంగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పుకో గలిగిన రాష్ట్రంలో ఇంత విధ్వంసం ఎందుకు జరిగిందంటే 98.1 శాతం సోదర భారతీయులైన హరియాణేతరులకు ఎవరైనా ఏమని వివరిస్తారు? మీసాలు లేకుండా ఊహించడం కూడా సాధ్యం కాని వారి శరీరాకృతిని బట్టి జరిగిందని చెప్పాలా? బహుశా అదే కావచ్చు. అయితే హరియాణాలో ఇచ్చిపుచ్చుకోవడం అంటే అర్థం, మరీ ముఖ్యంగా అక్కడ ఆధిక్యంలో ఉండే జాట్ల (మొత్తం రాష్ట్ర జనాభాలో 30 శాతం) కోణం నుంచి వివరించి చెప్పడం అంత సులభం కాదు. అది మన పెదవుల మీద సిద్ధంగా ఉన్న మామూలు అర్థం మాత్రం కాదు. అంతకు మించిన, క్లిష్టమైన అర్థం ఏదో అందులో ఉందన్నది నిజం. ఇజ్జత్- అంటే పరువు, లేదా అహం, ఆత్మ గౌరవం- ఇవేమీ కాదు. ఈ మూడు వ్యక్తీకరణలు ఆకర్షణీయంగానే ఉన్నా, అంతకు మించి విశిష్టత కలిగిన, జాట్ల జీవితం నుంచి వచ్చిన భావన అది. జాట్ల గురించి ఒక నానుడి ధోరణిలో చాలామంది ఏం చెబుతారంటే, ‘జాట్ గన్నా నహీ దేగా, గూడ్ కి భెలి దే దేగా’. అక్షరాలా దీని అర్థం ఏమి టంటే, ఓ చెరుకు గెడ ఇమ్మని అడిగితే జాట్ ఇవ్వడు, కానీ వండిన బెల్లంలో భాగం మాత్రం చిరునవ్వుతో ఇస్తాడు. ఇంకాస్త స్ఫుటంగా అనువదిస్తే, ‘నువ్వో, మరొకరో నా పొలంలో ఒక చెరుకు గెడను దొంగిలిస్తే నేను పచ్చడి చేసేస్తాను. వండిన బెల్లంలో కొంచెం ఇవ్వండని నన్ను అడగాలి. అప్పుడు నేను సంతోషంగా భాగమిస్తాను.’ జాట్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? అంటే, అందులో జాట్ల ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం ఉంది. అతనికి మర్యాద ముఖ్యం. అతని దాతృత్వం గురించి నాలుగు మాటలు చెప్పాలి. అతడు పొంగిపోయేటట్టు చేయడం తప్ప మరో మార్గం లేదు. లేదూ, అతనితో గొడవ పడతావా! గడచిన వారంలో రాష్ట్రంలో ఏ జరిగిందో వీడియోలు, ఫొటోల ద్వారా వీక్షించండి! ఆ విధ్వంసాన్ని సమర్ధించడం కాకున్నా, ఇది రాజకీయ తప్పిదాలు, తప్పుడు లెక్కలతో చెలరేగిన ఆగ్రహాన్ని చల్లార్చుకోవడానికి జరిగిన ప్రయత్నమే. ఇది దేశంలో కేవలం రెండు శాతం జనాభా గురించిన అంశం. కానీ ఒలింపిక్స్, ఏసియాడ్ క్రీడోత్సవాలలో ఈ దేశానికి 75 శాతం పతకాలు తెచ్చేది మాత్రం ఆ రెండు శాతం జనాభాలోని వారే. బ్యాడ్మింటన్ (సైనా నెహ్వాల్), అథ్లటిక్స్లో కొందరు ఆధిక్యంలో ఉన్నప్పటికీ కుస్తీ, బాక్సింగ్ వంటి అంశాలలో పతకాలు తెచ్చి పెడుతున్నది ఆ రాష్ట్రం వారే. భారత సాయుధదళాలకు మహిళా అధికారులను పంపుతున్నది కూడా ఈ చిన్న రాష్ట్రమే. కొందరు హరియాణా ప్రజలు తమ రాష్ట్రం భారతదేశపు చైనా వంటి దని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొందరు మాత్రం డెయిరీ నిర్వహణను బట్టి తమ రాష్ట్రం చిన్న న్యూజిలాండ్ వంటిదని అనుకోవడానికి ఇష్టపడతారు. మరో వాస్తవం: ఇలా క్రీడోత్సవాల నుంచి పతకాలు సాధించుకుని వస్తు న్నవారు, మహిళా మల్లులు, సాయుధ దళాలలో సేవలకు వెళుతున్నవారు అంతా జాట్లే. అయినప్పటికీ ఇలాంటి రాష్ట్రంలో ఆడ శిశువుల భ్రూణహ త్యలు, ఖాప్ పంచాయతీలు, స్త్రీపురుష జనాభా నిష్పత్తిలో కనిపించే దారుణ వ్యత్యాసాల గురించి నన్ను అడగవద్దు. హరియాణీయులు అంత సమస్యల ను సృష్టించేవారు కాదు. అయినా ఇచ్చిపుచ్చుకోవడం దగ్గరకు మళ్లీ వెళదాం. నువ్వు జాట్వా లేక జాట్నివా అన్నది కాదు, ఒక పని చేయదలుచుకుంటే మొత్తం ప్రపంచానికి చాటాలి. నా మిత్రుడు, కేంద్ర మాజీ మంత్రి (ఆగ్రా), ఒకప్పుడు పత్రికా రచయిత, ప్రస్తుతం అఖిల భారత జాట్ మహాసభ అధ్య క్షుడు అజయ్ సింగ్ నాకో వాస్తవం నొక్కి చెప్పారు. రిజర్వేషన్ కోసం జాట్లు 23 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నారనీ, ఒకసారి రెండులక్షల మంది ఢిల్లీలో బోట్ క్లబ్ను ముట్టడించారనీ చెబుతూ, ‘లేకిన్ భాయి సాబ్, కిసీ కీ మూలీ భి నహీ ఉఖాడి’ అన్నాడు (దీనిని ఎలా అనువదించి చెప్పడం: ఇలా అనవచ్చు- ఎవరి తోటలో నుంచి ఓ ముల్లంగి దుంపని కూడా లాగలేకపో యారు). అంటే వారిని అంత ఆగ్రహానికి గురిచేసిన అంశం అదేనా ఏమిటి? స్వర్ణోత్సవ వేళ విధ్వంసం హరియాణా రాష్ట్రీయులు కొందరు విభేదించినప్పటికి ఒక వాస్తవం ఉంది. సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బీజ ప్రాయమైన యోచన కూడా లేదు. అలాగే హరియాణా అనే ఈ చిన్న రాష్ట్రా నికి రాజకీయ అస్థిత్వం కూడా ఏమీలేదు. ఔను, 2016 సంవత్సరానికి హరి యాణా ఏర్పడి యాభయ్ సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే ఈ శుభ సందర్భంలో రెట్టించిన దురదృష్టం ఏమిటంటే, 1984 నాటి ఢిల్లీ అల్లర్ల తరు వాత మళ్లీ ఉత్తర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు, విధ్వంసం జర గడం ఈ స్వర్ణోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు చూడవలసి వచ్చింది. సమైక్య పంజాబ్ రాష్ట్ర తూర్పు ప్రాంతంలోని జిల్లాలే ఈ హరియాణా. యమునా తీరాన్ని ఆనుకుని ఉన్న కొన్ని జిల్లాలకు మాత్రం నీటి సౌకర్యం ఉంది. ఇది నగరాలు లేని ఓ పేద రాష్ట్రం. మేధావులు గానీ, వాణిజ్య నిపు ణులు గానీ, నిజం చెప్పాలంటే లోతైన రాజకీయ పరిజ్ఞానం కూడా లేని, నైపు ణ్యం కరువైన ప్రాంతం. ఈ అంశాన్ని కూడా ఆ రాష్ట్రం వారు అంగీకరించరు. కాందిశీకుల సమస్య పంజాబీ మాట్లాడేవారు తమకు ఒక రాష్ట్రం (పంజాబీ సుబా) కావాలని కోరడం వల్ల హరియాణా అస్తిత్వం ఉనికిలోకి వచ్చింది. భాషల ప్రాతిపదికగా హిందూ సిక్కు వర్గాల ఏకీకరణ జరగడం మరొక కారణం. పంజాబీ హిందువులు హిందీ తమ మాతృభాష అని ప్రకటించుకున్నారు. దీని ఫలితం ఏమిటంటే పంజాబీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టణీకరణ జరిగిన కొన్ని జిల్లాలు హరియాణాలోకి వచ్చాయి. మళ్లీ ఇందులో ఎక్కువ జనాభా దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుంచి కాందిశీకులుగా ఇక్కడకు వచ్చిన కుటుంబాలకు చెందినది. వారిని ఇప్పటికీ కాందిశీకులనే పిలుస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్లాల్ కట్టర్ అలా వచ్చిన కాందిశీకుల కుటుంబానికి చెందినవారే. ఆయన కుటుంబం ఝాంగ్ అనే చోటు నుంచి వలస వచ్చింది. వీరిని ఆనాడు స్థానికులు మనస్ఫూర్తిగానే అక్కున చేర్చుకున్నారు. వీరు కూడా రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. అయితే వీరు రాష్ట్ర రాజకీయాలలో నాన్ ప్లేయర్లుగానే ఉన్నారు. అలాగే అధికారంలో వాటాను కోరుకున్నవారు కూడా కాదు. దశాబ్దాలు గడిచిన తరువాత హరియాణాలో పంజాబీ జనాభా 26 శాతానికి పెరిగింది. అంటే జాట్లతో దాదాపు సరిమానం. అధికార తులాదండం ఒకవైపునకు మొగ్గడం ఆరంభించనంత కాలం ఆ రాష్ట్రంలో బయటివారు, స్థానికులు అన్న అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జాట్ జనాభా 30 శాతం ఉంటే, పంజాబీలు వలస రావడానికి ముందువీరిదే పెద్ద సంఖ్య అని భావించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఢిల్లీ (గుర్గావ్), చండీగఢ్ (పంచ్కుల) వంటి కొత్త పట్టణ కూడళ్లు అభివృద్ధి చెందాయి. దీనితోనే హరియాణా వారికి పంజాబ్ మీద ఆగ్రహం చల్లబడింది. అయితే రాజధాని చండీగడ్ విషయంలోను, నీటి పంపకంలోను ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదు. కానీ ఆస్తుల విలువ పెరగడంతో ఈ పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్న ఆదాయం మీద కూడా స్థానికుల దృష్టి పడింది. డిఎల్ఎఫ్, ఇండియా బుల్ వంటి వేగంగా పురోగతి సాధించిన సంస్థలు జాట్లే ఏర్పాటు చేశారు. ద్వేషం పెంచారు అయితే రాజకీయాధికారం జాట్ల అధీనంలోనే ఉండిపోయింది. లేకపోతే అడపా దడపా హరియాణాలో పుట్టి పెరిగిన వారికి, అంటే స్థానికులకు దక్కింది. భజన్లాల్ (ఇతడు బిష్ణోయి వర్గంవాడు) రాష్ట్రాన్ని విజయ వంతంగా పాలించాడు. ఏకంగా రాజ కుటుంబం స్థాయిలో రాజకీయంగా స్థిరపడ్డాడు. ఇతడు జాట్ల దగ్గర జాట్ వలె, జాట్ వర్గేతరుల దగ్గర జాట్ వర్గేతరునిగా చక్కగా చలామణీ అయిపోయాడు. రాష్ట్రాన్ని ఇటీవల కాలంలో రాజవంశాల తరహాలో పరిపాలించిన బన్సీలాల్, దేవీలాల్, హుడాల కుటుం బాలు మాత్రం జాట్ కుటుంబాలే. రాజకీయ అధికారం జాట్ల చేతిలో ఉన్నప్పటికీ, హరియాణా పట్టణ ప్రాంతాలలో మాత్రం పంజాబీలు, బ్రాహ్మ ణులు, బనియాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ విధంగా రెండు ప్రపంచాలు ఒక చిన్న రాష్ట్రంలో సమకూడినప్పటికీ ప్రశాంతంగానే మనుగడ సాగించాయి. గడచిన సంవత్సరం అనూహ్యంగా బీజేపీ గెలుపొందడంతో ఈ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ శిబిరాలను సవాలు చేస్తున్నట్టు బీజేపీ జాట్ వర్గానికి చెందని వ్యక్తిని, అది కూడా పంజాబీ కాందిశీకుల కుటుంబానికి చెందిన వ్యక్తిని (కట్టర్) ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. మంత్రివర్గంలో రెండో స్థానం కూడా జాట్ వర్గానికి చెందని అనిల్ విజయ్కే ఇచ్చింది. ఇతడు కూడా పంజాబ్ నుంచి వచ్చి నవాడే. కొత్త పోలీస్ డెరైక్టర్ జనరల్ కూడా జాట్ వర్గానికి చెందడు. కీలక స్థానాలలో ఉన్న చాలామంది కూడా జాట్లు కారు. ఇదంతా చూసిన జాట్లు తమను అధికారంతో పాటు అన్నిటికీ దూరం చేస్తున్నారని భావిం చేట్టు చేసింది. అదే ఇప్పుడు చెలరేగిన హింస రూపంలో బయటపడింది. ఇంతకీ ఇలాంటి ఆగ్రహం బద్దలు కావడానికి ప్రేరేపించిన అంశం ఏమిటి? కురుక్షేత్రకు చెందిన బీజేపీ ఎంపీ (సైనీ కులస్తుడు) జాట్లకు వ్యతిరేకంగా ఒక ఓబీసీ సైన్యాన్ని తయారు చేయాలని, ఈ సైన్యం జాట్లను మావోయిస్టులను కాల్చినట్టు కాల్చి పారేయాలని ప్రచారం ప్రారంభించాడు. పైగా ఆ వర్గాన్ని పందులు అని తిట్టాడు. ఈ విషయం అతడి ఫేస్బుక్లో చూడవలసిందే. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గోశాలలు ఏర్పాటు చేయడం, గురుకులాలు స్థాపించడం, పాఠశాలల్లో భగవద్గీత బోధనను తప్పనిసరి చేయడం వంటి అంశాలకు పరిమితమైంది. (వ్యాసకర్త: శేఖర్ గుప్తా)