breaking news
Jatra
-
ఆ గుడిలో వెలగపండే ప్రసాదం!
డిసెంబరు నెలలో తొలి పున్నమి వచ్చిందంటే చాలు.. గూడచి వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలగపండ్లు రాశులు పోసి కనిపిస్తాయి. దైవ దర్శనం పూర్తి చేస్తున్న భక్తులందరూ ఈ రాశుల వద్దకు చేరి డజన్లకు డజన్లు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు. ఎందుకంటే కర్ణాటకలోని బెళగావి జిల్లా, రామదుర్గ తాలూలోని గూడచి వీరభద్రేశ్వర స్వామి జాతరకు హాజరైన వారందరూ స్వామివారి ప్రసాదంలా వెలగపండ్లు ఇళ్లకు తీసుకెళ్లడం వాడుక. అనాది కాలపు సంప్రదాయం. పౌర్ణమితో మొదలై ఐదు రోజులపాటు వైభవంగా జరిగే ఈ జాతరలో బెళగావితోపాటు పొరుగునే ఉన్న బాగల్కోట, విజయపుర, హావేరి జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూంటారు. జాతర ఐదవ రోజున ఆలయంలో జరిగే లక్ష దీపోత్సవం ఒక హైలైట్. సాంప్రదాయికంగా ఈ జాతర జరిగేది ఐదు రోజులే అయినప్పటికీ పౌర్ణమి నుంచి తరువాతి అమావాస్య వరకూ భక్తుల రాకపోకలు జోరుగానే సాగుతూంటాయి. వచ్చిన వారిలో అత్యధికులు వెలగపండ్లను ప్రసాదంగా తీసుకెళ్లడమూ కద్దు. మనమంటే వెలగపండ్లు అని పిలుస్తున్నాం కూడా కర్ణాటకలో దీనికి బోలెడన్ని పేర్లు. బేల, బలవత్తే, దంతశఠ, కపిత్థ అన్న పేర్లు వాడుకలో ఉన్నాయి ఈ ప్రాంతంలో. శాస్త్రీయ నామం లిమోనియా అసిడిసిమా. ఇంగ్లీషులో ‘వుడ్ ఆపిల్’. వీరభద్రేశ్వర ఆలయమున్న రామదుర్గ ప్రాంతంలో బళువల అని పిలుస్తారు. ఈ పండ్లను తీసుకెళ్లడంతోనే జాతర పూర్తయినట్లు వీరి నమ్మకం. అందుకే ఈ జాతరకు వెలగపండ్ల జాతరని కూడా స్థానికులు పిలుస్తూంటారని ఈరణ్ణ కామన్నవర తెలిపారు. లారీల కొద్దీ పంట..వీరభద్రేశ్వర స్వామి ఆలయ జాతరకు లారీల కొద్దీ వెలగపండ్లు వస్తూంటాయి. ఈ ఏడాది సుమారు 15 లారీల వరకూ పండ్లు వచ్చినట్లు సమాచారం. ఏటా సుమారు యాభై మంది వరకూ వ్యాపారులు ఇక్కడ వెలగపండ్ల విక్రయాలు సాగిస్తూంటారు. వీటిని రాశులుగా పోసుకుని అమ్ముకునేందుకు, భక్తుల అవసరాల కోసం గ్రామపంచాయతీ, జాతర కమిటీలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. జాతరకు వచ్చిన ఒక్కో కుటుంబం కనీసం ఐదారు డజన్ల వెలగపండ్లను ఖరీదు చేస్తాయని వ్యాపారి ద్యామణ్ణ నాగప్ప అమరగోళ తెలిపారు. మరి అన్ని పండ్లు ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తే.. ఊళ్లో బంధు మిత్రులకు జాతర ప్రసాదంగా పంచుతారని సమాధానమిచ్చారు ఆయన. వెలగపండ్ల గుజ్జుకు బెల్లం కలిపి ఒక్కరోజు వదిలి తింటే ఆ రుచి అద్భుతం అని మనలో చాలామందికి తెలుసుకదా? ప్రసాదంగా పొందిన వారందరూ అంత మధురానుభూతి పొందాలన్నది ఈ సంప్రదాయం ఉద్దేశమేమో?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రామదుర్గం తాలూకాలో వెలగపండ్లు అందుబాటులో ఉండటం తక్కువ కావడం. హావేరీ, శిగ్గావి, హానగల్, గోందీ, అనవట్టి వంటి ప్రాంతాల్లో దొరికే పండ్లను వ్యాపారలు ఇక్కడకు తీసుకొస్తూంటారు. ఎప్పుడో 12వ శతాబ్ధంలో మడివాళ మాచప్ప శరణరు సందర్శించిన సందర్భంలో ఇక్కడి ప్రజలు ఎక్కువ మంది రోగాలపాలై ఉన్నారట. పోషకాలతో నిండిన వెలగపండ్లు తింటే మేలు జరుగుతుందని చెబితే ప్రజలు పట్టించుకోరని.. వీరభద్రేశ్వర ఆలయం.. జాతర వంటి ఏర్పాట్లు చేశారని ప్రతీతి. ప్రసాదంగా ఈ వెలగపండ్లు పంచడం కూడా అప్పుడే మొదలైందని చెబుతారు. అయితే ఈ కథకు సంబంధించి ఎక్కడ రాతపూర్వక ఆనవాళ్లయితే లేవు. పోషకాల పుట్ట...వాస్తవానికి వెలగపండ్లు పోషకాల పుట్ట. తీపి, పులుపు రుచులతో ఉండే ఈ పండులో విటమిన్-సీ, పొటాషియం, ఫాస్పరస్ తదితర పోషకాలు మెండుగా ఉంటాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుందని అంచనా. అంటే.. దైవ ప్రసాదం మంచి రుచిని మాత్రమే కాదు. ఆరోగ్యాన్నీ ఇస్తోందన్నమాట.- గానధళు శ్రీకంఠ, ప్రజావాణి సౌజన్యంతో -
దున్నపోతు తొక్కితే.. దోషాలు మటుమాయం
దున్నపోతు తొక్కితే దోషాలు ఇట్టే మాయమైపోతాయని ఆ ఊరివాసులు నమ్ముతారు. కొత్తపల్లి మండలంలోని మత్స్యకార గ్రామమైన అమీనాబాద్లో గ్రామ దేవత పోలేరమ్మతల్లికి నిర్వహించే జాతరలో ఈ వింత ఆచారం కానవస్తుంది. అమ్మవారి జాతర బుధవారం జరిగిన సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం నుంచీ ఉపవాసం ఉన్న గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే పూజలు చేసిన దున్నపోతును గరగ నృత్యాలతో గ్రామంలో ఊరేగించారు. సాయంత్రం పోలేరమ్మతల్లి కొత్త ఆలయంవద్ద కొంతమంది మహిళలను గ్రామ దేవతలుగా భావించి, వారి తలపై పసుపు నీళ్లు పోసి పూలదండలు వేశారు. అనంతరం ఉపవాసం ఉన్న భక్తులందరూ స్నానాలు చేసి పాత ఆలయం వరకూ సాష్టాంగంగా పడుకున్నారు. వారిపై నుంచి గ్రామ దేవతలుగా భావించిన మహిళలు, దున్నపోతు మూడుసార్లు నడిపించారు. అనంతరం తీర్థం మొదలైంది. ఇది పూర్వంనుంచీ వస్తున్న ఆచారమని, దీనివల్ల గ్రామానికి పట్టిన అరిష్టాలు తొలగిపోతాయన్నది తమ విశ్వాసమని భక్తులు అన్నారు. కొత్తపల్లి, ఉప్పాడ, యండపల్లి తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. - అమీనాబాద్ (కొత్తపల్లి) -
విషాద జాతర
పండగవేళ అక్కడ విషాదం వికృత నృత్యం చేసింది... వారి సంతోషాన్ని చంపావతి నది చంపేసింది. గ్రామ దేవత జాతర కోసం వచ్చిన నలుగురిని పొట్టనపెట్టకుని కన్నవారికి కడుపు మంట మిగిల్చింది. నిమిషం ముందువరకూ ఆడు తూపాడుతూ కేరింతలు కొట్టిన ఆ యువకులు విగత జీవులుగా పడి ఉండడంతో ఊరు గొల్లుమంది. అమ్మా, పాదాలమ్మ తల్లీ నీ పండుగ కోసం... నీకు పసుపు కుంకుమలు సమర్పించేందుకు వచ్చాం తల్లీ.. నీకు కనికారం కలగలేదా..మా బిడ్డలను రక్షిం చలేకపోయావా...ఇదేనా నీవు మామీద చూపించే దయ అంటూ మృతుల తల్లిదండ్రులు, తోబుట్టువులు కటుంబ సభ్యులు నదీ తీరంలో గుండెపగిలేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టింది. భోగాపురం : మండలంలోని గరే నందిగాం గ్రామానికి చెందిన కొంతమంది బతుకు తెరువుకోసం కొన్నేళ్ల కిందట విశాఖ వెళ్లారు. వారిలో కొంతమంది ప్రైవేటు కంపెనీల్లో, మరికొంతమంది తాపీమేస్త్రీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా విశాఖపట్నం సమీపంలోని పోతినమల్లయ్యపాలెం వద్ద లక్ష్మివానిపాలెంలో నివాసముంటునన్నారు. అయితే వారు ప్రతీ ఏటా గ్రామంలో ఉన్న పాదాలమ్మ అమ్మవారి జాతర కోసం గరే నందిగాం వచ్చి పసుపు కుంకుమలు అందిచండం ఆనవాయితీ. అమ్మవారికి ప్రధమ పూజారులుగా వారు ఉంటూ వస్తున్నారు. గ్రామస్తులు పండగ జరిపే సమయంలో అమ్మవారికి ముందుగా సమర్పించిన బలిని వారికి అందజేసి అనంతరం పండగ నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామానికి చేరుకున్న వారంతా మంగళవారం అమ్మవారికి పసుపు కుంకులు సమర్పించి మొక్కులు చెల్లించి జాతర నిర్వహించారు. అలాగే బుధవారం అమ్మవారికి బలులు సమర్పించి, మధ్యాహ్నం భోజనాలు అనంతరం తిరిగి విశాఖ వెళ్లిపోవాల్సి ఉంది. ఇంటివద్ద పెద్దలు ఆపనిలో నిమగ్నమై ఉండగా సుమారు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పోతిన వెంకట అప్పారావు, బెర్జి మహేష్ (23), గరే శివ (24), పోతిన రాము (25) కొత్తపల్లి రాజేష్ (15)లు గ్రామానికి ఆనుకుని ఉన్న చంపావతి నదిలోకి స్నానానికి వెళ్లారు. మహేష్, శివ, రాము, రాజేష్ ఒకరి తరువాత ఒకరు నదిలో స్నానానికి దిగారు. వారు దిగిన చోట బాగాలోతు ఉన్న విషయం వారికి తెలియదు. దీంతో ఒకరి వెనుక ఒకరు ఆ గుమ్మిలోకి జారిపోయారు. చివరగా ఉన్న వెంకట అప్పారావు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అతను గ్రామంలోకి పరుగెత్తి విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారంతా నది ఒడ్డుకు చేరుకుని మృతదేహాల కోసం గాలించారు. నదీ ప్రవాహ వేగం ఎక్కువగా లేకపోవడంతో దగ్గరలోనే మృతదేహాలన్నీ లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నది ఒడ్డుకు చేరుకున్నారు. మృతదేహాలను చూసిన వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా నదీ తీరం వారి రోదనలతో నిండిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐలు దీనబంధు, లోవరాజులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వైఎస్ఆర్ సీపీ సిఇసి మెంబరు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఫోనులో బాధిత కుటుంబాలకి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏఎంసీ మాజీ చైర్మన ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పిటిసి భెరైడ్డి ప్రభాకరరెడ్డి, సుందర గోవిందరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీనివాస్, పిళ్లా విజయకుమార్, యడ్ల ఆదిరాజు, పడాల శ్రీనువాసరావు, కందుల రఘుబాబు, గరే కాళిదాసు తదితరులు బాధితులను పరామర్శించి, అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఒకే ఇంట్లో ఇద్దరు గరే శివ, పోతిన రాము బావమరుదులు. ఏడాదిన్నర క్రితం శివ చెల్లిన పెళ్లాడిన రాముకి ఆరు నెలల పాప ఉంది. దగ్గరి బంధువులైన వీరిద్దరూ ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరిని నది రూపంలో మత్యువు కబళించింది. వీరి మృతితో శివ తండ్రి రామచంద్రరావు, రాము తండ్రి తాత కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. వద్దంటే వెళ్లాడు.. కాటపల్లి రాజేష్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి ఇటీవల మరణించాడు. అతనికి అక్క, అన్నయ్య ఉన్నారు. తల్లి కుట్టు మెషీన్ ఆధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వద్దన్నా వినకుండా మంగళవారం సాయంత్రం గరే నందిగాంలో గ్రామ దేవత పండక్కి వెళ్లాడు. ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. వ ద్దంటే వెళ్లాడు అందనిలోకాలకు చేరుకున్నాడంటూ విలపిస్తోంది. ఒక్కగానొక్క కొడుకు దూరం విజ్జి కనకరావుకు ఒక్కగానొక్క కొడుకు మహేష్. అతడికి ఒక చెల్లి ఉంది. ఓ కాంట్రాక్టర్ వద్ద పనులు చేస్తున్నాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడ్ని మత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. తమ కుమారుడు ఇకలేడనే వార్త వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. చుట్టుపక్కలవారితో కలుపుగోరుగా ఉండే మహేష్ మతితో స్థానికులు విచారంలో మునిగిపోయారు.


