మావోడే గెలుత్తడు!
అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగ్
- రూ. 5 వేల నుంచి రూ. 5 లక్షల వరకు పందెం
- ముఖాముఖి పోటీ ఉంటే మరింత ఎక్కువ
- జనగామ, ‘తూర్పు’పైనే అందరి దృష్టి
హన్మకొండ, న్యూస్లైన్ : వరంగల్ ‘తూర్పు’లో ఎవరు గెలుస్తరు...మాజీ మంత్రి బస్వరాజు సారయ్యా, కొండా సురేఖనా... కారు దూసుకుపోయింది... సురేఖ గెలుస్తది...కాదు.. కాదు... రెండు, మూడొందల ఓట్లతో సారయ్య గెలుస్తడు... ఓకే బెట్టా... సురేఖ గెలుస్తదని నా పందెం రూ.లక్ష...
సారయ్య గెలుస్తడని నా బెట్టు రూ.లక్ష...
...సాధారణ ఎన్నికలు ముగియడంతో జిల్లాలో బెట్టింగ్ జోరందుకుంది. నువ్వా... నేనా అన్నట్టు పోటీపడిన సెగ్మెంట్లలో బెట్టింగ్ వీరులు కాయ్ రాజా కాయ్ అంటూ రూ.లక్షల్లో పందెం కాస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ, మొన్నటివరకు మంత్రిగా ఉన్న బస్వరాజు సారయ్య సొంత ఇలాకా వరంగల్ తూర్పు నియోజకవర్గాలపైనే పందెం రాయుళ్లు దృష్టిపెట్టారు. వీటితోపాటు తీవ్ర పోటీ ఉన్న, రెబల్స్ పోటీలో ఉన్న సెగ్మెంట్లలో మాత్రమే గెలుపోటములపై పందెం కాస్తున్నారు. జిల్లా నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఎన్నెన్నిసీట్లు వస్తాయనే అంశంపైనా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రాజకీయ వర్గాలే కాకుండా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, సీనియర్ ఉద్యోగులు, రియల్టర్లు పోటీపడి పందెం కాస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మందు, బిర్యానీతో రూ.ఐదు వేలతో పందెం జోరు మొదలై... రూ. ఐదు లక్షల వరకు దాటుతున్నట్లు తెలిసింది.
నీకా.. నాకా...
జనగామ సెగ్మెంట్లో టీపీసీసీ చీఫ్ పొన్నాల గెలుపుపై రూ.లక్షల్లో పందెం కాస్తున్నట్లు సమాచారం. పొన్నాల ఓడిపోతాడని ఈ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ హైదరాబాద్లో దాదాపు రూ. 20 లక్షల పందెం కాసినట్లు ప్రచారం సాగుతోంది. పొన్నాల గెలుస్తాడని కొంత మంది... ముత్తిరెడ్డి గెలుస్తాడని మరికొంత మంది జోరుగా పం దెం కడుతున్నారు. ఈ ఒక్క సెగ్మెంట్పైనే పందెం రాయుళ్లు దాదాపు రూ.50 లక్షల వరకు బెట్టింగ్ కాసినట్లు గుసగుసలు వినిపిస్తున్నారు.
- వరంగల్ తూర్పు సెగ్మెంట్లో వ్యాపార వర్గాలు రూ.లక్షల్లో బెట్టింగ్ సాగిస్తున్నట్లు సమాచారం. కారు గుర్తుపై ఓ బట్టల వ్యాపారి రూ. 5 లక్షలు పందెం కాసినట్లు ప్రచారం జరుగుతోంది. సార య్య, సురేఖ మధ్య తీవ్ర పోటీ ఉందని.. వీరిద్దరిలో ఎవరైనా తక్కువ మెజార్టీతో గెలుస్తారని అధి క సంఖ్యలో పందెం రాయుళ్లు బెట్టు కడుతున్నారు.
- నర్సంపేట సెగ్మెంట్పై ఓ రైస్మిల్లర్ రూ. 3 లక్షల పందెం కాసినట్లు సమాచారం. ఇక్కడ టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ ఉందని... వారిపైనే పలువురు పందెం కాసినట్లు వినికిడి.
- మానుకోట ఎంపీ స్థానంలో పోలీసులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థులపై పందెం పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని ఓ డీఎస్పీ... టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడని మరో డీఎస్పీ రూ. లక్ష చొప్పున బెట్టు కాసినట్లు సమాచారం.
- భూపాలపల్లిలో చీఫ్ విప్ గండ్ర మూడో స్థానంలో ఉంటారని... ఆయనే గెలుస్తారని... బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని, టీఆర్ఎస్కూ చాన్స్ ఉందంటూ పలువురు జోరుగా పందెం కడుతున్నారు. ఇక్కడ నువ్వా... నేనా అన్నట్లు పోటీ ఉండడంతో దాదాపు రూ.20 లక్షల బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం.
- డోర్నకల్లో రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్పైనే పలువురు పందెం కాస్తున్నారు.
- ములుగు నియోజకవర్గంలో సీతక్క గెలుస్తుందని కొందరు... చందూలాల్ గెలుస్తాడని మరికొందరు పందెం కట్టారు.
- పరకాలలో ముద్దసాని సహోదర్రెడ్డి, చల్లా ధర్మారెడ్డికి విజయూవకాశాలు ఉన్నాయని.. మా వోడు గెలుస్తాడంటే.. మావోడు గెలుస్తాడని పలువురు బెట్టింగ్ సాగిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ ఇప్పటివరకు ప లువురు సుమారు రూ.10లక్షల వరకు పందెం కాసినట్లు సమాచారం.
- పాలకుర్తిలో మూడు పార్టీల అభ్యర్థుల మధ్య బెట్టింగ్ సాగుతోంది. చివరి రెండు రోజుల్లో పంపకాలు భారీగా జరిగాయని పలువురు బెట్టింగ్ సాగిస్తున్నారు.
- వరంగల్ పశ్చిమలో బెట్టింగ్ మందు, విందు, బిర్యానీకే పరిమితమైంది. ఇక్కడ వినయభాస్కర్ గెలుస్తాడని ఎక్కువ మంది పందెం కడుతున్నట్లు సమాచారం.