breaking news
Jail Baro
-
అన్నదాతల ఆత్మహత్యలకూ చలించరా?
అనకాపల్లిటౌన్: అన్నదాతలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యనారాయణ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇక్కడ జైల్భరో నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేశారు. నెహ్రూచౌక్ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులు 118 మందిని అరెస్టు చేసి, పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 555 జిల్లాలో జైల్భరో కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. భూములను అన్లైన్లో నమోదు చేయాలంటే ఎకరాకు రూ.30వేలు లంచం తీసుకుంటున్నారని తెలిపారు. బడాబాబులు, కార్పొరేట్ సంస్థలకు రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని తెలిపారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఆధికారంలోనికి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు భద్రత లేకుండా పోవడంతో వారు పట్టణాలకు వలసపోవలసి వస్తోందన్నారు. స్వామినాథన్ కమిటీ సూచనల మేరకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని ఆయన కోరారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా రుణవిముక్తి చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని యథాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడంలో చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు బకాయి ఉన్న కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ చేయడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు కల్లబొల్లిమాటలు చెప్పి మరోసారి గద్దెనెక్కడానికి సిద్ధపడుతున్నారన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఆశవర్కర్లు, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ రైతులను రోడ్డున పడేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతందన్నారు. 60 సంవత్సరాలు దాటిన పేద, మధ్యతరగతి రైతులకు నెలకు రూ.5వేల చొప్పున పింఛన్ అందజేయాలని కోరారు. వచ్చేనెల 5న 10 లక్షల మంది రైతులతో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మళ్ల సత్యనారాయణ, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఐద్వా జిల్లా సహయకార్యదర్శి డి.డి.వరలక్ష్మి, బుగిడి నూక అప్పారావు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
కార్మిక సంఘాల జైల్భరో
విజయనగరం క్రైం: కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక చట్టాల్లో తెస్తున్న మార్పులకు నిరసనగా జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు కార్యాలయం వద్ద గురువారం నిరసనకు దిగారు. కార్మిక సంఘాల జైల్ భరో కార్యక్రమం పిలుపులో భాగంగా పోస్టాఫీసు కార్యాలయం ముందు కూర్చుని నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఎం.ఆర్.కళాశాల జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గురంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఇన్సూరెన్స్లో రంగంలో విదేశీ పెట్టుబడి వాటాను 49 శాతానికి పెంచుతూ అర్డినెన్స్లు తెచ్చిందన్నారు. రైతుల ఆమోదంలేకుండా కార్పొరేట్ కంపెనీలకు భూ సమీకరణచేయడానికి చట్టంలో అర్డినెన్స్ ద్వారా మార్పులు చేసి, రైల్వే, రక్షణ ఇతర రంగాల్లో కూడా విదేశీపెట్టుబడులు తేవడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఆరోగ్యం, ఉపాధి ఇతర సామాజిక రంగాలకు బడ్టెట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని, సామాజిక పథకాలను కాపాడుకోవాల్సి ఉందన్నారు. సింగపూర్ లాంటిరాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని, గ్రిడ్లు, స్మార్ట్ల పేర్లతో ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నాన్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపై నిర్భంధానికి పూనుకుంటోందని ఆరోపించారు. పెట్టుబడిదారులతో చర్చలు చేస్తున్న ప్రభుత్వం ప్రధాన కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలతో చర్చించడానికి నిరాకరిస్తోందన్నారు. కార్మిక సంఘాల ఆందోళన సందర్భంగా జిల్లా కేంద్ర పోస్టల్ కార్యాలయంలో వన్టౌన్ పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు అనంతరం ఎం.ఆర్.కాలేజీ జంక్షన్ వద్ద కార్మిక సంఘ నాయకులను అరెస్ట్ చేసి వన్టౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కృష్ణంరాజు, ఆల్తి అప్పలనాయుడు,బుగత సూరిబాబు, ఆల్తి మారయ్య, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదిలి శ్రీనివాస్, అచ్చయ్య, ఇప్టూ నేత దవళ లక్ష్మణరావు పాల్గొన్నారు.


