గోదావరిలో యువకుడు గల్లంతు
ఖండవల్లి(పెరవలి), న్యూస్లైన్ : గోదావరిలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతైన దుర్ఘటన పెరవలి మండలం ఖండవల్లి వద్ద జరిగింది. గ్రామానికి చెందిన కలి దిండి ఇతేంద్ర వర్మ(20) స్నేహితులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం గోదావరి తీరానికి వెళ్లారు. నదిలో స్నానానికి దిగిన వారంతా నీటిలో ఆటలాడుతుండగా కాసేపటికి ఇతేంద్ర వర్మ కనిపించక పోయేసరికి మిగిలిన కంగారు పడ్డారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో ఊళ్లోకి కూడా వెళ్లి చూశారు. కనిపించకపోవడంతో నీటమునిగి ఉంటాడని గ్రహించి తిరిగి మరలా గోదావరి తీరానికి చేరుకున్నారు.
విషయం తెలిసిన గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు కంగారు పడి గోదావరి తీరానికి చేరుకుని ఇతేంద్ర వర్మ కోసం వెతకడం ప్రారంభించారు. జాడ తెలియక పోవడంతో మత్స్యకారులను పిలిపించి వలలు వేశారు. తణుకులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన ఇతేంద్ర వర్మ శుక్రవారం హనుమద్ జయంతి సందర్భంగా గ్రామంలోని భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద పూజలో పాల్గొని, అనంతరం అన్నసమారాధనలో భక్తులకు వడ్డించి 2 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. తండ్రి పక్కన పడుకున్న వర్మ స్నేహితులు వచ్చారని బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గోదావరి తీరానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కొవ్వూరులో మరో వ్యక్తి..
కొవ్వూరు టౌన్ : కొవ్వూరు మెరకవీధి గోదావరి మాత విగ్రహం వద్ద శ్రీరామ స్నాన ఘట్టంలో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థాని కులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కొవ్వూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన నక్కా కృష్ణ(50) వేసవి తాపానికి తట్టుకోలేక సాయంత్రం 5 గంటల సమయంలో గోదావరి నదిలో స్నానానికి దిగాడు. రేవులో నాచు, లోతు ఎక్కువగా ఉండడంతో నదిలో గల్లంతయ్యాడని వారు తెలిపారు. కృష్ణ గతంలో లారీడ్రైవర్గా పనిచేస్తూ క్రిస్టియన్ పేటలో నివాసం ఉండేవాడని చెప్పారు. విషయం తెలుసుకున్న లారీ వర్కర్స్ యూనియన్ సభ్యులు స్నాన ఘట్టానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, వలల సాయంతో వెతుకుతున్నారు.