breaking news
ISHRAT JAHAN FAKE ENCOUNTER
-
‘మోదీ, షాలను అరెస్ట్ చేయాలనుకున్నారు’
అహ్మదాబాద్: సంచలనం సృష్టించిన ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో సీబీఐ.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షాను అరెస్టు చేయాలనుకుందని మాజీ డీఐజీ వంజారా కోర్టుకి తెలిపారు. అదృష్టం బాగుండి వారిద్దరూ తప్పించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇష్రాత్ జహాన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సీబీఐ ప్రత్యేక స్థానంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు. కాగా, సరైన ఆధారాలు చూపించడంలో సీబీఐ విఫలమైందంటూ 2014లో కోర్టు అమిత్ షా, మోదీలకు క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. విషయం.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఇష్రాత్ జహాన్, ఆమె స్నేహితులు జావేద్ అలియాస్ ప్రాణేశ్, పాకిస్తానీ యువకులు జీషాన్ జొహార్, అంజాద్ రాణాలను తీవ్రవాద దళంగా పోలీసులు అనుమానించారు. ఈ నలుగురు మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నారని భావించి.. నాటి డీఐజీ వంజారా నేతృత్వంలో వారిని కాల్చి చంపారు. అయితే మృతులు తీవ్రవాదులు కాదనే విషయం సీబీఐ విచారణలో వెల్లడైంది. వంజారా కుట్ర పూరితంగా వ్యవహరించడం వల్లే నలుగురు అమాయకులు బలయ్యారని సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, కేసు నుంచి తమను విముక్తం చేయాలని వంజారా, మరో పోలీసు ఉన్నతాధికారి ఎన్.కే.అమిన్ వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది. -
ఐపీఎస్కు వంజారా రాజీనామా
అహ్మదాబాద్: సస్పెన్షన్కు గురై పలు బూటకపు ఎన్కౌంటర్ల కేసులో జైల్లో ఉన్న వివాదాస్పద ఐపీఎస్ అధికారి డీజీ వంజారా తన సర్వీసుకు రాజీనామా చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద నియంత్రణకు శ్రమించిన అధికారులను రక్షించడంలో గుజరాత్లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆక్షేపించారు. అహ్మదాబాద్లోని సబర్మతీ కేంద్ర కారాగారంలో ఉన్న వంజారా ఈమేరకు 10 పేజీల రాజీనామా లేఖను హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి పంపారు. తనతోపాటు బూటకపు ఎన్కౌంటర్ల కేసులో జైల్లో ఉన్న అధికారులందరూ ప్రభుత్వ విధానాన్నే పాటించారని, తప్పంతా విధానాలను రూపొందించిన ప్రభుత్వానిదని, అందువల్ల దాన్ని సబర్మతీ జైల్లోగానీ, నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైల్లోగానీ పెట్టాలనిడిమాండ్ చేశారు.