breaking news
Investment banker
-
రత్నాలుగా ఉన్నప్పుడే...పీఎస్యూలను అమ్మేయాల్సింది
♦ ప్రైవేటు కంపెనీలు నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఉన్నారు ♦ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రుచిర్శర్మ... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ)ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రుచిర్ శర్మ తప్పుబట్టారు. పీఎస్యూలను లాభసాటిగా ఉన్నప్పుడే వాటిని ప్రభుత్వం అమ్మేసి ఉండాలని అభిప్రాయపడ్డారు. అలా చేయకపోగా, ప్రైవేటు కంపెనీలు వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూసిందని విమర్శించారు. ‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నేషన్స్: టెన్ రూల్స్ ఆఫ్ చేంజ్ ఇన్ పోస్ట్ క్రైసిస్ వరల్డ్’ పేరుతో రుచిర్ శర్మ తాజాగా రాసిన పుస్తకంలో ఈ మేరకు భారత ప్రభుత్వ విధానాలను విశ్లేషించారు. ప్రైవేటీకరణ అనే అసంబద్ధ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ‘‘పీఎస్యూలను విక్రయించలేదు. అలా అని వాటిని సంస్కరించనూ లేదు. దీనికి బదులు ప్రైవేటు కంపెనీలు పీఎస్యూలను బలహీనపరుస్తూ ఉంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది’’ అని మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ముఖ్య వ్యూహకర్త రుచిర్ శర్మ అన్నారు. పుస్తకంలోని ప్రధాన అంశాలు: 30 ఏళ్ల క్రితం భారతీయులు గగనతలంలో ప్రయాణించాలంటే ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కటే ఆధారం. కానీ, ప్రైవేటు ఎయిర్లైన్ సంస్థల రాకతో ఎయిర్ ఇండియా వాటా 25 శాతం కంటే దిగువకు పడిపోయింది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంతో టెలికామ్ మార్కెట్ను ఏలి నేడు నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పరిస్థితిని కూడా ఆయన వర్ణించారు. దూకుడుగా ఉండే ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీ పడలేక బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ క్రమంగా క్షీణించిపోయారు. మోదీ పానలలో సానుకూలతలు... లోపాలు ప్రధాని మోదీ సైతం ‘దేశ సంప్రదాయ విధానమైన కాలానుగుణంగా మార్పు’ విధానానికే కట్టుబడి ఉన్నారని శర్మ పేర్కొన్నారు. ఇంధన సబ్సిడీలను తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీ వాతావరణం వంటి కొన్ని సానుకూల చర్యలను మోదీ చేపట్టినట్టు ప్రశంసించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం 75% రుణాలను నియంత్రిస్తుండడాన్ని ప్రధాన అవరోధంగా పేర్కొన్నారు. భారత్లో తయారీ విధానంలోనే ప్రాథమిక లోపం ఉందని, సాధారణ ఫ్యాక్టరీల ఏర్పాటు గురించి మోదీ మాట్లాడడం లేదన్నారు. -
మనసున్నవాడు.. మార్గం చూపాడు!
ఆదర్శం ప్రతి మనిషికీ మనసుంటుంది. అయితే ప్రతి మనసూ స్పందించదు. ఎదుటివారి కోసం పరితపించదు. ఇతరులకు ఏదో ఒకటి చేయాలని ఆరాట పడదు. ధ్రువ్ లక్రాది స్పందించే మనసు. అందరి కోసమూ ఆలోచించే మనసు. అందుకే ఇవాళ అతని కారణంగా ఎంతోమంది జీవితాల్లోకి సంతోషం వచ్చింది. ముంబైకి చెందిన ధ్రువ్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత డీఎస్పీ మెరిల్ లించ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా జాయిన్ అయ్యాడు. జీతం, జీవితం బాగానే ఉన్నాయి. కానీ మనసే బాలేదు. ఏదో అసంతృప్తి. డబ్బు వద్దు. విలాసాలూ వద్దు. సరదాలు అసలే వద్దు. ఇంకేదో కావాలి. ఏమిటది? సేవ. పదిమందికి ఉపయోగపడాలి. లేకపోతే జీవితానికి అర్థమే ఉండదు. అలా ఆలోచించి దస్రా అనే సేవా సంస్థలో చేరాడు. చిన్న పిల్లల అక్రమ రవాణా నుంచి ఎన్నో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే సంస్థ అది. ఆ పోరాటంలో తానూ భాగమయ్యాడు ధ్రువ్. కానీ అంతలోనే ఆక్స్ఫర్డ్ యూని వర్సిటీలో ఎంబీయే సీటు వచ్చింది. దాంతో లండన్ వెళ్లిపోయాడు. తర్వాత ఇండియా తిరిగి వచ్చి ఓ బిజినెస్ పెట్టుకున్నాడు. మళ్లీ సేవ గురించి ఆలోచిస్తున్నప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. ఓ రోజు తన కారు చెడిపోతే.. ఆఫీసు నుంచి ఇంటికి సిటీ బస్సులో బయలు దేరాడు ధ్రువ్. అతని ముందు సీటులో ఒకబ్బాయి కూర్చున్నాడు. అతని దగ్గరకు కండక్టర్ వచ్చి, టికెట్ ఎక్కడికి ఇవ్వాలని అడిగాడు. ఆ అబ్బాయి సైగలతో చెప్పాడు. కండక్టర్కి అర్థం కాక మళ్లీ అడిగాడు. అతను మళ్లీ సైగ చేశాడు. అలా చాలాసేపు నడిచాక కండక్టర్కి విసుగొచ్చే సింది. దిగిపొమ్మని అరిచాడు. దాంతో ఆ యువకుడు ఓ పేపర్ పైన అతను ఎక్కడికి వెళ్లాలో రాసి చూపించాడు. ఇది చూసిన ధ్రువ్లో ఏదో చలనం. మనసులోని మాటలను బయటికి చెప్పాలని ఉన్నా చెప్పలేకపోవడం ఎంత బాధాకరమో కదా అనుకున్నాడు. గతంలోనూ అలాంటి చాలామందిని చూశాడు. చూసినప్పుడల్లా మథనమే. ఈరోజూ అంతే. అవే ఆలోచనలతో ఇంటికి చేరాడు. సరిగ్గా అప్పుడే ఓ కొరియర్ బాయ్ వచ్చాడు. ధ్రువ్ని చూసి చిరునవ్వు నవ్వి, కవర్ అందించాడు. సంతకం చేసి కవర్ అందుకుని లోపలికి వచ్చేశాడు ధ్రువ్. ఆ క్షణం... అతని మెదడులో ఓ కొత్త ఆలోచన మెదిలింది. అర నిమిషం కూడా పట్టలేదు కొరియర్ తీసుకోవడానికి. కొరియర్ బాయ్తో మాట్లాడే అవసరమూ రాలేదు. అంటే ఈ పనికి మాట, వినికిడి అవసరం లేదు. కాబట్టి ఆ రెండూ లేనివాళ్లు కొరియర్ బాయ్స్గా పని చేయవచ్చు. ఆ ఆలోచన వచ్చిందో లేదో... ఇక ఆగలేక పోయాడు ధ్రువ్. వెంటనే మిరాకిల్ కొరియర్ కంపెనీకి పునాది వేశాడు. మిరాకిల్ కొరియర్స్కు 2009లో హెలెన్ కెల్లర్ అవార్డు, 2010లో జాతీయ అవార్డులు దక్కాయి. అప్పటి అధ్యక్షురాలు ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ధృవ్ ఆ అవార్డును అందుకున్నాడు. మిరాకిల్ కొరియర్స్లో ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తుంటాడు. కొత్తగా వచ్చిన వారికి ఇంగ్లిష్, కంప్యూటర్లో శిక్షణ ఇస్తుంటాడు. జీవితంలో ఎదిగేందుకు ఏం చేయాలో, వైకల్యాన్ని ఎలా అధిగమించాలో చెప్పి వారిలో స్ఫూర్తిని నింపుతుంటాడు. మొదట ముగ్గురితో ప్రారంభమైన మిరాకిల్ కొరియర్స్లో ప్రస్తుతం 70 మందికి పైగా బాయ్స్ ఉన్నారు. అందులో అందరూ వినికిడి లోపం ఉన్నవారే. ఆడ పిల్లలకేమో కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి డేటా ఆపరేటర్లుగా నియమించాడు. ఆర్డర్లు, డెలివరీల వివరాలను వాళ్లు ఆన్ లైన్లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ నెలకు అరవై అయిదు వేల డెలివరీలకు పైగా చేస్తోందట. మహీంద్ర అండ్ మహీంద్ర, ఆదిత్య బిర్లా గ్రూప్, గోద్రెజ్, విక్టరీ ఆర్ట్ ఫౌండేషన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ కంపెనీ క్లయింట్సే. ఆరెంజ్ కలర్ యూనిఫామ్లో, నగరమంతా చకచకా తిరుగుతూ, తమ వైకల్యాన్ని మర్చిపోయిన ఆ యువకులని చూసి మురిసిపోతుంటాడు ధ్రువ్. ఇప్పు డతని మనసులో అసంతృప్తి అన్నదే లేదు. - నిఖిత నెల్లుట్ల