breaking news
intellegence report
-
పుతిన్ నెక్స్ట్ టార్గెట్ అదేనా?.. అమెరికా నిఘా వర్గాల సంచలన అంచనా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా నిఘా వర్గాల సంచలన ఆరోపణలు చేశాయి. పుతిన్.. నాటో కూటమి ఐక్యతను, దాని సమిష్టి రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆ కూటమిలోని ఓ సభ్యదేశంపై పరిమిత స్థాయి దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాల పేర్కొంటున్నాయి. సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలు, హైబ్రిడ్ ఆపరేషన్లు లేదా చిన్న స్థాయి సైనిక చొరబాటు రూపంలో ఈ చర్య ఉండొచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం నివేదించింది.ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమై ఉన్నంతకాలం నాటోతో నేరుగా తలపడేందుకు పుతిన్ ప్రయత్నించరని గతంలో అమెరికా అధికారులు భావించారు. అయితే, తాజాగా ఆ అంచనాలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, యుద్ధంలో రష్యా భారీ నష్టాలను ఎదుర్కోవడం వంటి పరిణామాలను అమెరికా నిఘా వర్గాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.రష్యా చర్యకు దిగితే భూభాగాన్ని ఆక్రమించుకోవడం కంటే నాటోలోని దేశాల మధ్య విభేదాలు సృష్టించడం, కూటమి స్పందనను పరీక్షించడమే లక్ష్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి చర్యలు 2026 నవంబర్ నుంచి 2029 మధ్య ఎప్పుడైనా చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే నేరుగా భూదాడి చేసే అవకాశం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. నాటో ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్యదేశంపై సాయుధ దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే అవకాశం ఉండటమే దీనికి కారణం. అలా జరిగితే రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.అలాంటి పరిస్థితుల్లో నాటో ఎలాంటి చర్య తీసుకుంటుందన్నదే కీలకంగా మారనుంది. కాగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నాటో ఇప్పటికే స్పష్టం చేసింది. వివిధ రకాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైనప్పుడు నిరోధించేందుకు, రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని నాటో ప్రతినిధి కల్నల్ మార్టిన్ ఓ డొన్నెల్ తెలిపారు.ఇదిలా ఉండగా అమెరికా కీలక ఆయుధాల నిల్వలపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్కు సంవత్సరాలుగా అందించిన సైనిక సహాయం, ఇటీవల ఇరాన్కు సంబంధించిన సైనిక చర్యల కారణంగా కొన్ని కీలక ఆయుధాల నిల్వలు తగ్గినట్లు అధికారులు, రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్స్, ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ (ATACMS), స్టింగర్ క్షిపణులతో పాటు పేట్రియాట్, SM-3, THAAD వంటి వాయు రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలపైనా ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడితే దాని ప్రభావం యూరప్కే పరిమితం కాకుండా ప్రపంచ భద్రతా వ్యవస్థపై పడే అవకాశం ఉంది. -
కశ్మీర్లో స్లీపర్సెల్స్ యాక్టివ్.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పహల్గాం దాడి ఘటనతో అక్కడ భారత ఆర్మీ హైఅలర్ట్లో ఉంది. మరోవైపు.. కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 48 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం మూసివేసింది.వివరాల ప్రకారం.. పహల్గాం దాడి అనంతరం కశ్మీర్ లోయలో స్లీపర్సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో, కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అనంతరం, కశ్మీర్లో ఉన్న 48 టూరిస్టు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో వీటిని మూసివేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను పాశవికంగా హతమార్చిన ఘటనపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి మృతులకు సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. పాశవికదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.దానికి ముందు సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘బైసరన్లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
‘100 శాతం నిజం.. ఆ దేశం నుంచి మణిపూర్లోకి కుకీ మిలిటెంట్లు’
ఇంఫాల్: మణిపూర్లో జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో మణిపూర్ భద్రతా సలహాదారు కూల్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి మణిపూర్కు గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన సుమారు 900 కుకీ మిలిటెంట్లు ప్రవేశించారని తెలిపారు. ఆ మిలిటెంట్లు ఆయుధాలతో కూడిన డ్రోన్ల వినియోగించటంలో శిక్షణ పొందినవారనే సమాచారం ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా అందినట్లు నిర్ధారించారు. ఆయన మీడియాతో మట్లాడుతూ.. ‘‘ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించిన విషయాలు 100 శాతం నిజం. ఆ నివేదిక తప్పు అని నిరూపించేవరకు మేము నమ్ముతాం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ 100 శాతం నిజంగానే ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఆ నివేదిక నిజం కాకపోయినా. అన్ని రకాలుగా మా ప్రయత్నాలు ఆపకుండా ఉంటాం. ఇంటెలిజెన్స్ నివేదికను మేము ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోము’’ అని అన్నారు.దక్షిణ మణిపూర్లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు జిల్లాల్లోని అన్ని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లకు ఇంటెలిజెన్స్ రిపోర్టు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం పంపిన ఈ నివేదికలో.. డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు అమర్చటం, గెలిల్లా యుద్ధంలో కొత్తగా శిక్షణ పొందిన 900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుండి మణిపూర్లోకి ప్రవేశించారు’’ అని స్పష్టం చేసినట్లు మణిపూర్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. కుకి మిలిటెంట్లు 30 మంది సభ్యులతో కూడిన యూనిట్లతో గ్రూప్లుగా ఉంటారని, మణిపూర్లో పలు ప్రాంతాల్లో విస్తరించిన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ కుకీ మిలిటెంట్లు సెప్టెంబర్ చివరి వారంలో మైతేయి వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికలు ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఉన్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.చదవండి: సినిమా రేంజ్లో బీజేపీ మేయర్ ఓవరాక్షన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ -
ఉగ్ర దాడికి జైషే భారీ కుట్ర..
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడవచ్చని నిఘా సంస్థల హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మిలటరీ ఇంటెలిజెన్స్, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి నిఘా సంస్థలు పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిపై ప్రభుత్వాన్ని హెచ్చరించడం పొంచి ఉన్న ఉగ్రముప్పు తీవ్రతను స్పష్టం చేస్తోందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పు ఏ క్షణంలోనైనా వెలువడవచ్చనే దృష్టిలో ఉగ్ర సంస్ధల భారీ విధ్వంస రచనపై నిఘా సంస్ధలు గత పదిరోజులుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉగ్ర హెచ్చరికలు డార్క్ వెబ్లో పోటెత్తడంతో వీటి గుట్టుమట్లను తేల్చడం భద్రతా దళాలకు సంక్లిష్టంగా మారిందని అన్నారు. నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలను బేరీజు వేసిన భద్రతా దళాలు ఉగ్ర మూకల ప్రతిపాదిత టార్గెట్లను పసిగట్టి ముప్పును నిరోధించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. ఉగ్ర మూకలు ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు, నగరాలపై ఉగ్రదాడులతో విరుచుకుపడతారిని భావిస్తున్నారు. కాగా ఆర్టికల్ 370 రద్దు చేపట్టినప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్ర ముప్పును నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. -
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
సాక్షి, కాకినాడ: ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు తీరంలో ఉన్న ఆయిల్, గ్యాస్ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్ ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయన పోలీసులు అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏవీబీ బోర్డర్లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్లో జరిగిన ఘటనలు, కౌంటింగ్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ భద్రతా కారణాలరిత్యా కొన్ని వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో గాడిమొగ రిలియన్స్ గ్యాస్ టెర్మినల్తోపాటుగా పలు చమురు క్షేత్రాల్లో ఆయన పర్యటించారు. ఘర్షణలపైనా సమీక్ష.. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలపై సమీక్షించామని తెలిపారు. కేసుల నమోదు, చార్జ్షీట్లపై యంత్రాంగానికి సూచనలు చేశామని, కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించామని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఒడిషాలోని నందాపూర్ మావోయిస్టు కమిటీ సభ్యులు విధ్వంసం సృష్టించేందుకు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారని, ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి వెళ్తుండగా భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్కౌంటర్ జరిగిందని, ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. -
విజయనగరం తప్ప సీమాంధ్ర పరిస్థితి అదుపులోనే
కేంద్రానికి నిఘావర్గాల నివేదిక సీమాంధ్ర జిల్లాలలో నడుస్తున్న ఆందోళనలు కొద్దిరోజుల్లోనే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిఘావర్గాలు కేంద్రానికి నివేదించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన అనంతరం విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటనలతో శాంతిభద్రతల సమస్య తలెత్తిందని, ఆ జిల్లాలో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. విజయనగరం,అనంతపురం మినహా మిగతా జిల్లాల్లో హింసాత్మక ఘటనలేవీ చోటుచేసుకోలేదని స్పష్టంచేశాయి. మిగతా 11 జిల్లాల్లోనూ ఆందోళనలు తీవ్రంగానే ఉన్నప్పటికీ శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని వివరించాయి. విజయనగరంలో పరిస్థితి చేయిదాడడంతో డీజీపీ బి.ప్రసాదరావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి కూడా డీజీపీతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించకుంటే పరిస్థితి చేయిదాటే అవకాశం ఉందని నిఘావర్గాలు పేర్కొన్నాయి.


