breaking news
indirasagar
-
రీడిజైన్ తో శబరిని కోల్పోయాం: భట్టి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఇందిరాసాగర్ రీ డిజైన్ పేరుతో రాష్ట్రం శబరి నదిని, ఈ నది ద్వారా వచ్చే 400 టీఎంసీల నీటిని శాశ్వతంగా కోల్పోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావుతో కలసి లాంచీలో పోలవరం ముంపులో ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన వేలేరుపాడు మండలం రుద్రమకోటలో పర్యటించారు. అక్కడ గోదావరి, శబరి నదుల సంగమం వద్ద ఇందిరాసాగర్ ప్రాజెక్టు హెడ్వర్క్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వద్ద పంప్హౌస్, అశ్వారావుపేట మండలం ఆసుపాక వద్ద పంప్హౌస్, పథకం నిర్వహణ కోసం ఏర్పాటవుతున్న 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను చూశారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ఇప్పటికే తెలంగాణ సీలేరు హైడల్ ప్రాజెక్టును కోల్పోయిందన్నారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం కూడా అటవీశాఖకు భూమి అప్పగింత, కొంతమేర పైప్లైన్ నిర్మాణం చేయడం, పంపులను అమర్చడమేనని తెలిపారు. -
దుమ్ముగూడేనికి కొత్త టెండర్లే!
రూ.7,967 కోట్ల తుది అంచనాతో ఆర్థిక శాఖకు ఫైలు సాక్షి, హైదరాబాద్: సమీకృత ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను పాత కాంట్రాక్టర్లకు అప్పగించకుండా కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడేళ్ల కింద నిర్ణయించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)ల ప్రకారం మారిన డిజైన్లకు అనుగుణంగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు అనాసక్తి చూపుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్త టెండర్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ల కింద ఇప్పటివరకూ చేసిన పనులను అనుసంధానం చేస్తూ ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేలా దుమ్ముగూడెం తుది ప్రణాళిక ఖరారైన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో గ్రావిటీ ద్వారా 46.30 కిలోమీటర్ల దూరం గల కోయగుట్ట పంపు హౌజ్ వరకు నీటిని తరలించి అక్కడినుంచి జగన్నాథపురంలో కట్టే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యారం చెరువు(రిజర్వాయర్) దాకా నీటిని తరలిస్తారు. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి 50 టీఎంసీల నీటిని తరలిస్తారు. పాల్వంచ మండలం కోయగుట్ట, ముల్కంపల్లి మండలం కమలాపురం, తోగ్గూడెం, టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామాల్లో నాలుగు పంపు హౌజ్లు, ఆరు లిఫ్టులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయగా, మొత్తం నిర్మాణానికి రూ.7,967 కోట్లతో తుది అంచనా వేశారు. ఈ అంచనాను ఆమోదానికి ఆర్థిక శాఖకు పంపారు. ఇదే సమయంలో పనులను ఎవరికి అప్పగించాలన్న అంశమై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా బ్యారేజీలు, పంప్హౌజ్లు, ఇతర నిర్మాణాల కోసం 2007-08లో నిర్ణయించిన స్టాండర్ట్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)తో పోలిస్తే ప్రస్తుత రేట్లు 30 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉంది. గతంలో ఈపీసీ విధానంతో పాత కాంట్రాక్టులకు అప్పగించగా, ప్రస్తుతం ఆ విధానం లేదు. దీంతో పాటే డిజైన్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలవడం సుముచితమనే అభిప్రాయం నీటి పారుదల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
ఇందిరా ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆందోళన