breaking news
Inder Singh
-
చరిత్ర తెలియని అజ్ఞానం
ఎంత ఉన్నత విద్యాశాఖ చూస్తున్నా అన్నీ తెలుసుననుకోవటం ఎంత పెద్ద తప్పో మధ్యప్రదేశ్ మంత్రి ఇందర్సింగ్ పర్మార్కు జ్ఞానోదయమైనట్టుంది. బ్రహ్మసమాజ వ్యవస్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ ‘బ్రిటిష్ ఏజెంటు’ అంటూ మొన్న శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సామాజిక మాధ్యమాల విస్తృతి బలంగా ఉన్న వర్తమానంలో ఇష్టానుసారం మాట్లాడితే ఆ మరుక్షణం నుంచే విమర్శల జడి మొదలవుతుంది. అందుకే 24 గంటలు తిరగకుండా ‘నోరు జారాను... తప్పయి పోయింద’ంటూ ఆయన ఒక వీడియో విడుదల చేయాల్సివచ్చింది. ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్లోనే కాదు... దేశదేశాల్లో ఉన్న బెంగాలీ పౌరులంతా ఒక్కటై ఆగ్రహా వేశాలు వ్యక్తం చేశారు. తక్షణం దీన్ని చల్లార్చకపోతే పెను సమస్య అవుతుందని భయపడిన పశ్చిమ బెంగాల్ బీజేపీ విభాగం, పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి ఆయనతో పశ్చాత్తాప ప్రకటన చేయించాయి. బెంగాల్ మేధాచరిత్ర గర్వించదగ్గది.‘బెంగాల్ ఇవాళ ఏం ఆలోచిస్తుందో... దేశం రేపు అదే ఆలోచిస్తుంది’ అన్న నానుడి ఒకప్పుడు జోరుగా వినబడటానికి కారణం 19వ శతాబ్దిలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యారంగాల్లో అక్కడ పెల్లుబికిన సంస్కరణలే! వీటన్నిటి వెనుకా రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నారు. 1857లో ఆయన స్థాపించిన బ్రహ్మసమాజం హిందూ మతానికి వ్యతిరేకం కాదు. ఆయన నిరీశ్వరవాది అంతకన్నా కాదు. కుల వ్యవస్థ, ఆ వ్యవస్థలోని అంతరాల దొంతరలూ, సతీ సహగమనం, బాల్య వివాహాలు వగైరా దురాచారాలూ, మూఢనమ్మకాలూ ఆ మతవ్యాప్తికి, దాంతోపాటు సమాజ గమనానికి అడ్డంకిగా ఉన్నాయని ఆయన విశ్వసించారు. తన భావాల వ్యాప్తికి ప్రిన్స్ ద్వారకానాథ్ టాగూర్, ఆయన కుమారుడు దేబేంద్రనాథ్ టాగూర్, కేశబ్చంద్రసేన్ వంటివారితో కలిసి బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. తన వాదనలకు వేదాలూ, ఉపనిషత్తులూ ఆధారం చేసుకున్నారు. ఏకేశ్వరోపాసన ఆయన సిద్ధాంతం. పట్టువదలని విక్రమార్కు డిలా రామ్మోహన్ రాయ్ పోరాడినందు వల్లే సతి దురాచారాన్ని నిషేధిస్తూ చట్టం వచ్చింది. స్వాతంత్య్రానికి వందేళ్ల క్రితమే సమాజం మూఢ నమ్మకాల ఉచ్చు నుంచి బయటపడాలనీ, దురాచారాలు సమసిపోవాలనీ, మహిళలకు సైతం విద్య అందాలనీ తపించినవారాయన.ఆయన స్ఫూర్తితో పంజాబ్లో ఆర్య సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్ వంటివి ఆవిర్భవించాయి. వీటి దారులు వేరైనా మత సంస్కరణలే ఈ సంస్థల ధ్యేయం. చిన్ననాడే బెంగాలీ భాషతోపాటు సంస్కృతం, పర్షియన్, అరబిక్, హిందూ స్తానీ భాషల్లో నిష్ణాతుడై ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులతో పనిచేశారు. 1814లో ఆ ఉద్యోగాన్ని వదిలి ఆత్మీయ సభ పేరిట సంఘాన్ని స్థాపించి 1821లో వారపత్రిక ‘సంబాద్ కౌముది’ని ప్రచురించటం మొదలుపెట్టారు. ఆ రకంగా ఆయన దేశ పత్రికారంగానికి ఆద్యుడు. దేశంలో మొదటగా 1823లో ఈస్టిండియా కంపెనీ అధికారులు కలక త్తాలో స్థాపించిన కళాశాల సంప్రదాయ సంస్కృత విద్యాబోధనకే పరిమితమైనప్పుడు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయటంతోపాటు విద్యార్థులకు సైన్సు, రేఖాగణితం, రసాయన శాస్త్రం, అనాటమీ వంటివి బోధించాలని అప్పటి గవర్నర్ జనరల్ అమ్హెస్ట్కు లేఖ రాశారు. సాధించారు. నిరుడు బెంగాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతకు తాము తీసుకుంటున్న చర్యల వెనకున్న స్ఫూర్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పిన సంగతి పర్మార్కు గుర్తులేదనుకోవాలి. వర్తమాన ప్రయోజనాలు నెరవేర్చుకోవటం కోసం చరిత్రను వక్రీకరించటం పర్మార్తోనే మొదలు కాలేదు. గతంలోనూ కొందరు నాయకులు ఇదే బాపతు మాటలతో విమర్శలు ఎదుర్కొన్నారు. దేశంలో ఇతర చోట్ల కన్నా బెంగాల్లో సామాజిక, సాంస్కృతిక ప్రతీకలుగా వెలుగులీనినవారు అధికం. వారిపై ఆరాధనా భావం, గౌరవ ప్రపత్తులు కూడా ఎక్కువ. వారి జోలికిపోతే, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే వచ్చే ఏడాది జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టి మునుగుతుందని బీజేపీ గ్రహించినట్టుంది. తెలిసీ తెలియకుండా నోరు పారేసుకోవటం మంచిది కాదు. -
రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్
షాజపూర్: సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్, మతమార్పిడులనే విష విలయాన్ని ప్రారంభించింది ఆయనే అంటూ మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఇందర్ సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు. బ్రిటిషర్లు మతమార్పిడులను ప్రోత్సహించిన వారికి మాత్రమే అండగా ఉంటూ, ఇతరులను నకిలీ సంఘ సంస్కర్తలుగా తూలనాడేవారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇటీవల బెంగాల్కు చెందిన రవీంద్రనాథ్ ఠాకూర్, బంకించంద్ర ఛటర్జీల గురించి బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధంకొనసాగుతున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం చోటుచేసుకుంది. దీనిపై బెంగాల్ మంత్రి శశి పాంజా తీవ్రంగా స్పందించారు. ‘బెంగాల్ ప్రముఖులను తక్కువగా చూపేందుకు బీజేపీ ప్రయతి్నస్తోందనేందుకు ఇది తాజా ఉదాహరణ. సతీ సహగమన దురాచారాన్ని అరికట్టింది రామ్మోహన్ రాయ్ అన్న విషయం అందరికీ తెల్సిందే. బీజేపీ తన కాలిని తానే నరుక్కుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, బెంగాల్ను మాత్రం చులకన చేయవద్దు’అని ఆయన హెచ్చరించారు. పర్మార్ వ్యా ఖ్యలు సిగ్గుచేటని ఎన్ఎస్యూఐ జాతీ య ప్రతినిధి విరాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ విమర్శలతో పర్మార్ వెనక్కితగ్గారు. ‘రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప సంఘ సంస్కర్త. మనమంతా ఆయన్ను గౌరవించాలి. తెలియక పొరపాటున అలా మాట్లాడాను. క్షమాపణ కోరుతున్నా’అని చెప్పారు. -
స్కూలు ఫీజులు పెంచారని చెబితే.. వెళ్లి చావండన్న మంత్రి
భోపాల్: స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తమ గోడును వెళ్లబోసుకోవడానికి వెళ్లిన పేరెంట్స్పై సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే నోరు పారేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భోపాల్లోని స్కూలు పిల్లల తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ పాలక్ మహాసంఘ్ అనే బ్యానర్ కింద ఓ యూనియన్గా ఏర్పడి, అధిక ఫీజుల విషయమై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ను కలిసేందుకు అతని నివాసం వద్దకు వెళ్లారు. కరోనా కారణంగా అధిక స్కూల్ ఫీజులు భారంగా మారాయని, వెంటనే వాటిని నియంత్రించాలని వారు మంత్రికి మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో సదరు మంత్రి స్పందన చూసి పేరెంట్స్ కమిటీ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పేరెంట్స్ అభ్యర్ధనను విన్న మంత్రి.. ‘వెళ్లి చావండి, మీకిష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ తిట్టిపోయడంతో అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈయనేం మంత్రిరా బాబు..! బాధను చెప్పుకుందామని వెళితే మాపైనే ఫైరయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను అక్కడున్న సభ్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. తలిదండ్రుల బాధను అర్ధం చేసుకోకుండా, నోరు పారేసుకున్న మంత్రిని నెటిజన్లు ఏకీ పారేస్తున్నారు. కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆ రాష్ట్ర హైకోర్టు ఇదివరకే తీర్మానం చేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పును బేఖాతరు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు సంబంధిత మంత్రికి తమ గోడు వెళ్లబుచ్చుకుందామని వెళ్లారు. బాధితుల ఫిర్యాదుకు మంత్రి రెస్పాన్స్ చూసి వారంతా షాక్కు గురయ్యారు. తమపై నోరుపారేసుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయమై వెంటనే కల్పించుకుని తమకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు సంబంధిత మంత్రిని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేరెంట్స్ కమిటీ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో మంత్రి రాజీనామా విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయమై మంత్రి స్పందించకపోవడం గమనార్హం. -
సిమెంటు దిమ్మె పడి..
అబిడ్స్: పాతబస్తీలోని మంగళ్హాట్, మచిలీపురకు చెందిన ఇందర్సింగ్ (21) గాలి దుమారంతో ఇంటిపై పక్క బిల్డింగ్ పెంట్హౌస్ మీదనుంచి సిమెంట్ దిమ్మె పడటంతో అక్కడికక్కడేమృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మచిలీపురలోని రేకులఇంటిలో ఇందర్ సింగ్, ఆయన తల్లిదయాబాయ్ (55) నివాసముంటున్నారు. ఇందర్సింగ్ బేగంబజార్ మచ్చీ మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతని ఇంటి పక్కన నివసించే గణేశ్ సింగ్ 3 అంతస్తుల భవనంపై రేకుల షెడ్డు నిర్మించాడు. రేకుల షెడ్డుపై నిర్మించిన సిమెంట్ దిమ్మె గాలి దుమారానికి ఇందర్ సింగ్ రేకుల ఇంటిపై పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి దయాబాయ్కి కాలు విరగడంతో స్థానికులు, గోషామహల్ కార్పొరేటర్ ముఖేశ్ సింగ్లు కలిసి చికిత్స నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆస్పత్రిఇకి తరలించారు. ఇందర్ సింగ్ కుటుంబానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రణ్వీర్ రెడ్డి పేర్కొన్నారు.


