breaking news
Increased wages
-
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన వేతనాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేలు ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరికి పే స్కేలుతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు కలిపిన వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా వివిధ ఖాతా (హెడ్)ల ఏర్పాటుతో పాటు అదనపు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ప్రత్యేకించి గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెరిగిన వేతనాలు ఈ నెల నుంచి రానున్నాయి. ఇందుకు అదనపు నిధులను నేడో రేపో విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కొత్త హెడ్ల ఏర్పాటుకు ఆదివారమూ పనిచేశారు: ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఆర్థిక శాఖ అధికారులు సెలవు దినమైనప్పటికీ ఆదివారం రోజు కూడా వచ్చి సచివాలయాల ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అన్ని హెడ్స్ను రూపొందించారని, పెరిగిన జీతాలకు అనుగుణంగా అదనపు కేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సచివాలయాల ఉద్యోగులకు కొత్త వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా వేరుగా విడుదలవుతుందని చెప్పారు. ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, అందరికీ పే స్కేల్ ప్రకారం జీతాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, ఇచ్చిన హామీ మేరకు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు, పెరిగిన వేతనాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్.ఆర్.కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, భార్గవ్ సుతేజ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. జాని పాషా వేరొక ప్రకటనలో సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎంకు ఉద్యోగుల ధన్యవాదాలు నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ప్రొబేషన్ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయని గ్రామ,వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు చెప్పారు. సోమవారం గుంటూరు డొంక రోడ్డులో ఉన్న సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కిషోర్, కో ఆర్డినేటర్ తోట మహేష్ ,గుంటూరు జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ రాథోడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఏలో పెరిగిన వేతనాలు
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశమైన పాలకమండలి తీర్మానించింది. దీంతో క్లస్టర్ రిసోర్స్పర్సన్లకు రూ.14,500, అటెండర్లకు రూ.10 వేలు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్లకు రూ.15 వేలు, కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)ల్లోని స్పెషల్ ఆఫీసర్లకు రూ.21 వేలు, వంట కార్మికులకు రూ.7,500 వరకు వేతనాలు పెరిగాయి. ఎస్ఎస్ఏ కింద పనిచేస్తున్న 17 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని, ప్రతియేటా రూ.60 కోట్లు అదనంగా కేటాయించాల్సి వస్తుందని అదనపు ప్రాజెక్ట్ డెరైక్టర్ భాస్కర్రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మన్లు, అటెండర్ల నియామకం చేపట్టాలని డిప్యూటీ సీఎం(విద్య) నిర్ణయించడంతో మరో రూ.85 కోట్లు కేటాయించామని ఏపీడీ పేర్కొన్నారు. కేజీబీవీల్లో క్రీడల కోసం ప్రతి జిల్లాకు రూ.3 లక్షలు, రాష్ట్రస్థాయిలో ఆటలకు రూ.5 లక్షలు, వంటపాత్రల మరమ్మతులకు ప్రతి కేజీబీవీకి రూ.50 వేల చొప్పున కేటాయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఆర్థికశాఖ కార్యదర్శులు రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, ఎస్ఎస్ఎ ప్రాజెక్ట్ డెరైక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.