breaking news
idwa women
-
లోకేశ్వరిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): కోటవురట్ల మండలం బీకేపల్లికి చెందిన 13 ఏళ్ల లోకేశ్వరిపై హత్యాయత్నం చేసి, ఆమె తీవ్ర అనారోగ్యం పాలవడానికికారుకులైన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, అలాగే నిందితులకు సహకరిస్తున్న కోటవురట్ల ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి డిమాండ్ చేశారు. మైక్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకేశ్వరిని గురువారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ జూన్ 10న జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసుల తీరు అన్యాయంగా ఉందన్నారు. స్థానిక ఎస్ఐ, సీఐ కనీసం ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం నిందితులకు కొమ్ముకాయడమేన్నారు. తక్షణమే ఎస్పీ కలుగజేసుకుని నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున అత్యాధునిక వైద్య సేవలు అందించాలని, కలెక్టర్ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి సహాయ ని«ధి నుంచి బాధితురాలి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారులో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఉన్నారు. -
సీఎంకు గాజులు కొరియర్
ఐద్వా వినూత్న నిరసన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ... అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ, జనవాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రికి పసుపు, కుంకుమ, గాజులు, పూలను బుధవారం కొరియర్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలుత ఆ శాఖ నాయకురాళ్లు ఒక కంచంలో పసుపు, కుంకుమ, గాజులు, పూలను ఉంచుకుని అనంతపురంలోని నడిమి వంక నుంచి ర్యాలీగా టవర్క్లాక్ వద్ద ఉన్న ప్రధాన తపాలా కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి ముఖ్యమంత్రికి కొరియర్ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీదేవి, సావిత్రి మాట్లాడుతూ.. మద్యపానాన్ని విచ్చలవిడి చేసి ప్రజల ఆరోగ్యాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. మద్యం నియంత్రించాలని ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆందోళన చేస్తున్నా.. కనీస స్పందన కూడా ప్రభుత్వం లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమంపై కంటే మద్యం వ్యాపారంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని విమర్శించారు. ప్రజాందోళనలను పరిగణలోకి తీసుకుఏని మద్యం వ్యాపారాన్ని నియంత్రించాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు యమున, చంద్రిక, కార్పొరేటర్ భూలక్ష్మి, నాయకురాళ్లు విజయ, కవిత, ఉమ, రామాంజినమ్మ, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.