breaking news
Hybrid Products
-
నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు!
ఆరోగ్య పరిరక్షణలో టెక్నాలజీ వాడకం కొత్తేమీ కాదు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త, వినూత్న వైద్య పద్ధతులు అందుబాటులోకి వస్తూండటం విశేషం. అమెరికాలోని లాస్వేగస్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్ –2018)లో ఈ ఏడాది కనిపించిన టెక్నాలజీలే ఇందుకు తార్కాణం. ఒత్తిడిని తగ్గించే హెడ్బ్యాండ్, వయోవృద్ధులు మందులు సరిగా తీసుకుంటున్నారా? లేదా? అన్నది చెక్ చేసేందుకు కాలి సాక్స్లో దాగే సెన్సర్లు.. తుంటి ఎముకలకు రక్షణ కల్పించే వినూత్న బ్యాగ్ వంటివి మచ్చుకు కొన్నే.. ఒక్కోదాని వివరాలు చూసేద్దాం... నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు! నిద్ర పట్టకపోయినా.. ఉదయాన్నే నిద్రలేవాలంటే బద్ధకంగా అనిపిస్తున్నా తెల్లవారకముందే మెలకువ వచ్చేస్తున్నా.. ఈ హైటెక్ కళ్లద్దాలు వాడేయమంటోంది పెగాసీ గ్లాస్ అనే సంస్థ. ఫ్రేమ్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్ల కారణంగా సుఖనిద్రకు కావాల్సిన మెలటోనిన్ను నియంత్రించవచ్చునన్నది కంపెనీ అంచనా. తద్వారా మన శరీరాల్లోని గడియారం సహజస్థితికి చేరుతుందని.. నిద్ర సమస్యలన్నీ దూరమవుతాయని కంపెనీ అంటోంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.12 వేల వరకూ ఉంటుంది! ఒత్తిడికి విరుగుడు ఈ హెడ్బ్యాండ్ కెనడాకు చెందిన స్టార్టప్ ఇంటరెక్సాన్ ‘మ్యూజ్’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ హెడ్బ్యాండ్ మన మెదడులోని నాడుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒత్తిడిని తగ్గిస్తుందట. ధాన్యం చేసేటప్పుడు ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు, అథ్లెటిక్స్ పోటీల్లో ఒత్తిడిని జయించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. దక్షిణ కొరియాకు చెందిన లూక్సిడ్ ల్యాబ్స్ కూడా ఇలాంటి పరికరాన్నే ప్రదర్శించినప్పటికీ ప్రస్తుతం తాము పరిశోధన దశలోనే ఉన్నామని కంపెనీ ప్రకటించింది. వృద్ధుల స్థితిగతులపై కన్నేసేందుకు.. మతిమరపు లేదంటే అయిష్టత కారణంగా వయసు మీదపడిన వారు మందులు తీసుకునేందుకు అంతగా ఇష్టపడరు. ఈ సమస్యకు పరిష్కారంగా వాషింగ్టన్ స్టార్టప్ కంపెనీ సెన్సోరియా పేరుతో ఓ వినూత్నమైన గాడ్జెట్ను సిద్ధం చేసింది. వ్యాయామ సమయంలో శరీర కదలికలను గుర్తించి.. తప్పుఒప్పులను సరిచేసేందుకు కొన్నేళ్ల క్రితం సిద్ధం చేసిన ఓ గాడ్జెట్నే ప్రస్తుతం వృద్ధులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. మన దుస్తులకు గానీ, సాక్స్కుగానీ ఈ గాడ్జెట్ను తగిలించుకుంటే.. వ్యాయామం సరిగా చేస్తున్నారా లేదా?, మందులు సక్రమంగా తీసుకుంటున్నారా? వంటి అంశాలన్నింటినీ వారికి గుర్తు చేస్తూంటుంది ఇది. తుంటి ఎముకలకు రక్షణ కవచం.. వృద్ధులు పొరబాటున జారిపడితే తుంటి ఎముకలకు నష్టం జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారి కోసమే ఫ్రాన్స్ కంపెనీ హెలైట్ తుంటిభాగానికి రక్షణ కల్పించే ఓ హైటెక్ సంచిని తయారు చేసింది. నడుముకు తగిలించుకుని వెళుతూంటే చాలు.. వాటిలోని మోషన్ సెన్సర్స్ మన కదలికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ప్రమాదవశాత్తూ పడిపోతే.. ఇవి వెంటనే స్పందిస్తాయి. గాలి బుడగలు విచ్చుకునేలా చేస్తాయి. ఫలితంగా సున్నితమైన తుంటి ఎముకలకు రక్షణ ఏర్పడుతుందన్నమాట. -
యులిప్ సరెండర్ చేస్తే పన్ను చెల్లించాలా?
నేను ఒక మిత్రుడి ప్రోద్బలంతో 2011లో ఎల్ఐసీ పెన్షన్ ప్లాన్లో ఇన్వెస్ట్చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.60,000 ప్రీమియమ్ చెల్లిస్తున్నాను. ఈ ప్లాన్ వడ్డిస్తున్న అధిక వ్యయాలు, చార్జీలను, ఈ పెన్షన్ ప్లాన్ పనితీరును చూస్తుంటే ఈ ప్లాన్ నుంచి వైదొలగడమే మంచిదని అనిపిస్తోంది. నా నిర్ణయం సరైనదేనా? – శివరామ్, విశాఖ పట్టణం ఎల్ఐసీ పెన్షన్ ప్లాన్ మీకు బీమా కవర్ను అందిస్తుంది. అంతేకాకుండా రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేయడం కోసం మీరు చెల్లించే ప్రీమియమ్లో కొంత భాగాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి హైబ్రిడ్ ఉత్పత్తులు తగిన బీమా రక్షణను, మెరుగైన రాబడులను ఇవ్వలేవు. అందుకని ఈ తరహా ప్లాన్ల నుంచి వైదొలగడం మంచి నిర్ణయమే. సంబంధిత ఏజెంట్ను సంప్రదించి ఈ ప్లాన్ సరెండర్కు సంబంధించి విధి విధానాలను తెలుసుకోండి. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ బీమాను, ఇన్వెస్ట్మెంట్ను కలగలపకండి. జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీని ఎంచుకోండి. టర్మ్ బీమా పాలసీల్లో ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్ధిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు. మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రభుత్వం స్పాన్సర్ చేసిన రిటైర్మెంట్ ప్లాన్ కావాలనుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్ఎపీఎస్)ను పరిశీలించవచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మరిన్ని పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నేను 2011లో ఒక యులిప్ పాలసీ తీసుకున్నాను. ఐదేళ్ల తర్వాత ఆ పాలసీని సరెండర్ చేశాను. సరెండర్ చేసిన తర్వాత వచ్చిన మొత్తంపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? – మోహన్, హైదరాబాద్ పన్ను పరంగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీల(యులిప్స్)ను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలుగానే వ్యవహరిస్తారు. అంటే జీవిత బీమా పాలసీలకు వర్తించే పన్ను నియమనిబంధనలే యులిప్లకు కూడా వర్తిస్తాయి. మీరు తీసుకున్న యులిప్లకు ఐదేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ముగిసింది. అందుకని మీరు పొందిన సరెండర్ విలువపై ఆదాయపు పన్ను చట్టం ,సెక్షన్ 10(10డి) ప్రకారం ఎలాంటి పన్ను భారం ఉండదు. మీరు చెల్లించిన ప్రీమియమ్లకు సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందినా, పొందకున్నా ఇది వర్తిస్తుంది. నా వయస్సు 29 సంవత్సరాలు. నా నెల జీతం రూ.20,000. నాకు ఇటీవలే పెళ్లి అయింది. నా తల్లిదంద్రులు నాతోనే ఉంటారు. నేను ఎల్ఐసీ జీవన్ సరళ్ పాలసీ తీసుకున్నాను. టర్మ్ బీమా పాలసీ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. – వివేక్, కరీంనగర్ జీవన్ సరళ్ పాలసీ అనేది ఎండోమెంట్ ప్లాన్, ఈ తరహా ప్లాన్లు తక్కువ బీమా కవర్ను ఇస్తాయి. వ్యయాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించవు. మీకు నష్టాలు వచ్చినప్పటికీ, ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకోవడం మంచి నిర్ణయమే. బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను, చెల్లించాల్సిన ప్రీమియమ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే టర్మ్ పాలసీ తీసుకోవాలి. ఈ అంశాల పరంగా చూస్తే మీరు,... ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్, మ్యాక్స్లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్, భారతీ ఆక్సా లైఫ్ ఈప్రొటెక్ట్.. ఈ పాలసీలను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఆన్లైన్ టర్మ్ పాలసీలు. మీ వయస్సుకు, రూ.50 లక్షల టర్మ్ పాలసీకి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియ్లు–ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ప్లాన్కు రూ.4,560, మ్యాక్స్ లైషఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్కు రూ.4,150, భారతీ ఆక్సా లైఫ్ ఈ ప్రొటెక్ట్కు రూ.4,000 చొప్పున ఉన్నాయి. (ఆరోగ్య వంతుడైన పొగ త్రాగని వ్యక్తికి ఈ ప్రీమియమ్లు వర్తిస్తాయి) టర్మ్ బీమా పాలసీ తీసుకునేటప్పుడు అన్నీ సరైన వివరాలు వెల్లడించడమే ఉత్తమం. ఇలా చేస్తే, పాలసీ క్లెయిమ్ చేసుకోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. నేను సీనియర్ సిటిజన్ను, నాకు పన్నుచెల్లించే ఆదాయం లేదు. అయితే గత ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ మ్యూచువల్ పండ్ విక్రయాల ద్వారా రూ.4 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభాలు వచ్చాయి. నేను ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుందా? – పరంధామ్, విజయవాడ సీనియర్ సిటిజన్ల ఆదాయం నిర్దేశిత పరిమితికి మించితే ఆదాయపు పన్ను రిటర్న్లు తప్పకుండా దాఖలు చేయాలి. 2015–16 సంవత్సరానికి ఈ నిర్దేశిత పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. మీరు పొందిన దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.4లక్షలు. సీనియర్ సిటిజన్లకు నిర్దేశించిన ఆదాయ పరిమితిని(రూ.3 లక్షలు) మించినందున మీరు ఆదాయపు పన్ను రిటర్న్లను తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్నులేదు. మీరు పన్ను ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకున్నప్పటికీ, ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్