breaking news
Hunt For Gold
-
వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే..
కృష్ణా: అనాది కాలం నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతం వజ్రాల వేటకు పెట్టింది పేరు. ముఖ్యంగా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల (రామన్నపేట), కృష్ణా తీరం వజ్రాల గనిగా వాసికెక్కింది. మనసు పెట్టి అన్వేషణ సాగిస్తే, ఏదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. సాధారణ రకం మొదలుకొని లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమైన సందర్భాలు అనేకం ఉండటమే ఇందుకు నిదర్శనం. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా పరిటాల చెరువులోనే లభించిందనే కథనం కూడా ప్రచారంలో ఉండటం గమనార్హం. ఒకప్పుడు చందర్లపాడు మండలంలో ఏకంగా వజ్రాల కోత పరిశ్రమ ఉండేదంటే.. ఈ ప్రాంతంలో వజ్రాల వేట ఏ స్థాయిలో జరిగేదో.. ఎంతలా వజ్రాలు దొరికేవో అర్థం చేసుకోవచ్చు. నాటి నుంచి నేటి వరకు.. గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాల వేట ఈనాటిది కాదు.. దశాబ్దాల కాలంగా జరుగుతున్నదే.. ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే.. ఎక్కడెక్కడి నుంచో వజ్రాల వేటగాళ్లు ఇదే పనిలో ఉంటారు. కొందరు ఉదయమే భోజనాలు కట్టుకొని రామన్నపేట ప్రాంతంలోని కొండ ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెడతారు. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వరకు వీరి వెదుకులాట కొనసాగుతూనే ఉంటుంది. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం వజ్రాల లభ్యత గణనీయంగా తగ్గిపోయినప్పటికీ, వెదుకులాడే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కనీసం రంగు రాళ్లు లభించినా, కూలి అంత సొమ్మైనా దొరుకుతుందన్న భావనలో చాలా మంది ఉంటారు. అదృష్టం కలసి వస్తే, ఒకేసారి లక్షాధికారులయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆశావహులు తొలకరి జల్లులు కురిస్తే చాలు వజ్రాల వేటకు బయలుదేరుతారు. ఇందుకోసం వీరు ప్రధానంగా చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల శివార్లలో కృష్ణా నది ఒడ్డును ఎంచుకుంటారు. ఇక్కడే తవ్వకాలు అధికంగా సాగిస్తారు. ఏటా తొలకరి జల్లులు మొదలుకొని వర్షా కాలం పూర్తయ్యే వరకు ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుండటం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి కూడా జనం అధిక సంఖ్యలో తరలివచ్చి వజ్రాల వేట సాగిస్తుంటారు. నిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. ఇక్కడ వజ్రాలతోపాటు రంగు రాళ్లు కూడా అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. దీంతో కూలి ఖర్చుకు ఢోకా ఉండదని చెబుతారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం వజ్రాల వేట నిషేధమని.. నిబంధనలు మీరి వెళితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
పసిడి తవ్వకాలు - ఉన్నవ్ లో 'పీప్లీ లైవ్'
గుప్త నిధుల కోసం వేట, తవ్వకాలు అనే అంశాలతో అంతర్జాతీయ సినిమాతోపాటు, భారతీయ తెరపైన కూడా బోలెడన్న చిత్రాలు రూపోంది.. కనక వర్షాన్ని కురిపించిన సంఘటనలు మనకు తెలిసిందే. నిధులు వేట కథా నేపథ్యంతో హాలీవుడ్ లో రూపొందిన 'మెకనాస్ గోల్డ్', చార్లీ చాప్లిన్ ను ప్రసిద్ధుడిని చేసిన 1925 మూకీ చిత్రం 'గోల్డ్ రష్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికి 'మెకనాస్ గోల్డ్' చిత్రం చూడటానికి ఎందరో కాచుకుచుంటారనేది కాదనలేని వాస్తవం. అలాంటి కథను మైమరిపించే రీతిలో ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ గ్రామంలో పసిడి వేట దేశ ప్రజలందర్ని ఆకర్షిస్తోంది. ఈ సంఘటనలతో ఉన్నట్టుండి ఉన్నవ్ గ్రామం పరిస్థితులు, వాతావరణంలో ఒక్కసారిగా ఊహించని మార్పుల చోటు చేసుకుంటున్నాయి. ఎప్పడు టెలివిజన్ రేటింగ్ ల కోసం పాకులాడే దేశీయ, అంతర్జాతీయ మీడియా అక్కడ తిష్టవేసుకోవడం నిధుల తవ్వకానికి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పక్కా గ్రామీణ వాతావరణం కనిపించే అక్కడ అధునిక వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సంఘటనా స్థలానికి సందర్శకులు, వీఐపీలు తాకిడి ఎక్కువ కావడంతో కొత్తగా షాపులు, హోటళ్లు వెలిసి.. సరికొత్త వాతావారణాన్ని సంతరించుకుంది. స్వామి కల నిజమైతే గ్రామానికి, స్థానికంగా కూడా మంచి జరుగుతుందని ఆ ప్రాంత మహిళలు శివుడి ఆలయంలో పూజలు, ప్రార్ధనలు మొదలెట్టినారట. శివలింగానికి పాలతో పూజలు, అర్చనలు ప్రారంభించారట. ఇలాంటి సంఘటనలు విదేశీ మీడియాను అమితంగా ఆకర్షించడంతో వాళ్లు కూడా లైవ్ లతో పండగ చేసుకుంటున్నారని సమాచారం. ఇదంతా చూస్తుంటే.. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన పీప్లీ లైవ్ అనే సినిమా తప్పకుండా గుర్తురాక ఉండదు. ఓ గ్రామీణ ప్రాంతంలో రైతు అప్పుల బారిన పడుతాడు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని తెలుసుకున్న రైతు.. ఓ టీస్టాల్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు చెబుతాడు. ఆ పక్కనే ఉన్న ఓ రిపోర్టర్ కథనాన్ని ప్రచురిస్తాడు. ఆ కథనం మీడియాను ఆకర్షించడంతో దేశీయ, అంతర్జాతీ మీడియా తమ వాహనాలతో అక్కడ హంగామా చేస్తాయి. రైతు ఎప్పుడూ, ఎలా ఆత్మహత్య చేసుకుంటాడనే కోణంలో మీడియా అత్యుత్సాహాంపై 'పీప్లీ లైవ్' సెటైర్ వేసింది. ఇదంతా జరగడం వెనుక ఓ స్వామి కల దాగి ఉంది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్ జిల్లా దాండియాఖేరా గ్రామంలో 19వ శతాబ్దానికి చెందిన రాజా రావ్ రామ్బక్ష్ సింగ్ నిర్మించిన రాజకోటలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు తాను కలగన్నానని స్వామి శోభన్ సర్కార్ అనే సాధువు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సాధువు కల ఆధారంగానే తవ్వకాలు చేస్తున్నారా అని ప్రశ్నించగా.. ‘ఈ ప్రాంతంలో బంగారం లేదా వెండి ఉండొచ్చని భారత భూగర్భ పరిశోధన విభాగం (జీఎస్ఐ) తెలిపింది. ఉత్తరప్రదేశ్లో ఓ సాధువు కన్న కల అటు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుండగా.. ఇటు ప్రజల్లో అమితాసక్తిని రేపుతోంది. మరోవైపు దీనిపై రాజకీయ వర్గాలూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. నిధుల వేటపై ఉన్న శ్రద్ధ..విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనం తెప్పించడంలో యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. నిధి మాట దేవుడెరుగు.. మరో నెల రోజులపాటు జరిగే ఈ తంతు మీడియాకే కాకుండా...ఉన్నవ్ గ్రామానికి పండగ వాతావరణంతోపాటు చేతినిండ పని కల్పించింది.