పొరపాటున 'అమ్మే' అనుకొని!
గతంలో ఓ పెయింటర్ వేసిన 'పువ్వుల చిత్రం'పై సీతాకోకచిలుకలు ఎగిరి వచ్చి వాలాయట. అలాగే కొందరు శిల్పులు చెక్కిన శిల్పాలు చాలా సహజంగా ఉంటూ.. నిజంగా వాటికి ప్రాణం ఉంది అని భ్రమపడేలా ఉంటాయి. అలాంటి సంఘటనే ఓ మ్యూజియంలో జరిగింది. అమ్మ ఒడిలో ఉన్న ఓ బుడతడు.. శిల్పాన్ని 'అమ్మ'లా భావించి పాలు తాగటానికి ప్రయత్నించాడు.
ఒడిలో ఉన్న బుడతడు కాస్త దూరం జరగటం గమనించి.. అటువైపు చూసిన సదరు తల్లి, అక్కడ ఉన్నవారితో పాటు నవ్వు ఆపుకోలేకపోయింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్నవారు ఒకరు కెమెరా బంధించారు. ఈ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరేమో పాపం బుడ్డోడికి ఎంత ఆకలేసిందో.. అంటుంటే, మరికొందరు మాత్రం బిడ్డ అంత ఆకలితో ఉంటే పాలివ్వకుండా ఏం చేస్తున్నారని తల్లిపై సీరియస్ అవుతున్నారు. ఇంకొందరైతే.. ఆ శిల్పికి వందకు వంద మార్కులు పడ్డాయి అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు.