breaking news
hottest summer
-
Hottest Summer: ‘రికార్డు’ భగభగలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: గాలులు, వర్షాలతో తూర్పు తీరాన్ని వణికించిన యాస్ తుపాను.. మన రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపింది. ఎండ భగభగలాడేలా చేసింది. తుపాను తేమగాలుల్ని తీసుకుపోవడంతో రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతం నుంచి పొడిగాలులు నేరుగా మన రాష్ట్రం వైపు వస్తున్నాయి. ఫలితంగా బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అల్లూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో మే నెలలో 43 ఏళ్ల తర్వాత.. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1978 మే 19న విశాఖ నగరంలో నమోదైన 42 డిగ్రీలు మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతగా ఉంది. బుధవారం నగరంలో 42.3 డిగ్రీలు నమోదైంది. ఈనెల 30 వరకు వడగాలులు, ఎండలు ఈనెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని 36 మండలాలు, కృష్ణాలోని 15, తూర్పు గోదావరిలోని 12, విజయనగరంలోని 2, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున 68 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో 28, పశ్చిమ గోదావరిలో 18, విజయనగరంలో 14, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున మొత్తం 65 మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. కోస్తాలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల మే 30 తర్వాత తేమగాలులు తెలంగాణ మీదుగా రాష్ట్రం వైపు రావడంతో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, వర్షాలు మొదలవుతాయని తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం సాయంత్రానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు ఒక ప్రకటనలో కోరారు. -
బెంగళూరు 'మార్కు' మారనుందా?
సూర్యతాపం ఉద్యానగిరిగా పేరొందిన బెంగళూరునూ వదలడం లేదు. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పగటి ఉష్ట్రోగ్రతలు పెరిగిపోవడంతో ఈసారి బెంగళూరులో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. సాధారణంగా ఈ గార్డెన్ సిటీలో 31 డిగ్రీలు దాటని ఎండలు... ఈసారి తీవ్రంగా పెరిగిపోయి బెంగుళూరు మార్కునే కోల్పోయేలా చేశాయి. ఈ యేడు సూర్యతాపంలో వచ్చిన తీవ్ర ప్రభావం బెంగళూరుపైనా చూపింది. ఉద్యాననగరిగా పేరొందిన బెంగళూరులో సాధారణ ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెల్సియస్ కాగా, ఈసారి 40 డిగ్రీల వరకు వచ్చేసింది. ఆదివారం నాడు అక్కడ 39.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ సారి ఏర్పడిన వాతావరణ ప్రతికూల పరిస్థితులు 40 డిగ్రీలను దాటేట్టు చేసి రాకార్డును తిరగరాశాయి. బెంగళూరులోనే కాక కర్ణాటక రాష్టంలోనే ఈసారి అధిక ఉష్ణోగ్రత నమోదౌతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. కర్ణాటకలోని వేసవి విడిది ప్రాంతంగా పేరొందిన కలబుర్గీలో కూడా ఈసారి సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఎయిర్ కండిషన్డ్ నగరంగా పేరొందిన బెంగళూరు పరిస్థితే మారిపోయే అవకాశం కనిపిస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 80 ఏళ్ల క్రితం 1931 ఏప్రిల్ నెలలో బెంగళూరులో 38.3 డిగ్రీల ఉష్ణోత్రత నమోదై రికార్డును సృష్టించిందని, ఆతర్వాత 2016 సంవత్సరంలో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ రికార్డును మించిపోయినట్లు వాతావరణ శాఖ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈసారి బెంగళూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుపుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బెంగుళూరు సంపాదించిన ప్లెజెంట్ వెదర్ కిరీటాన్ని కోల్పోయే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాక రాత్రి సమయాల్లోనూ వేడి అసౌకర్యాన్ని కలిగించడం వాతావరణ అధికారులకు కూడా అంతుబట్టడం లేదు. రాగల రెండు రోజుల్లో బెంగళూరు వాతవరణం కాస్త చల్లబడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది.