breaking news
home fire
-
యువకుడి దారుణ హత్య..?
సాక్షి, మదనపల్లె : మదనపల్లె మండలం, టేకుల పాళ్యంలో బుధవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థులు పథకం ప్రకారం కాల్చి చంపి హతమార్చినట్లు స్థానికుల్లో చర్చసాగుతోంది. హత్యానంతరం షార్టుసర్క్యూట్తో మృతిచెందాడని చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తీరు చూస్తుంటే ప్రత్యర్థులు ప్రతీకారం కోసం అతి కిరాతకంగా చంపినట్లు కనిపిస్తోంది. గతంలో స్థానిక మహిళతో వివాహేతర సంబంధంపై జరిగిన గొడవలే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గొడవ విషయమై అప్పట్లో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఈ ఏడాది జూలై నెలలో కోర్టు ముద్దాయిలకు అపరాధం, లేకుంటే జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మండలంలో తీవ్ర కలకలం రేపిన ఈ హత్య ఘటనపై రూరల్ పోలీసులు, మృతుని తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బొమ్మనచెరువు పంచాయతీ టేకులపాళ్యంకు చెందిన దంపతులు దేవరింటి ఆదికేశవులు, ఆదెమ్మలకు ఇద్దరు కుమారులు దివాకర్(23), లోకేష్(19). దివాకర్ మదనపల్లెలో చేనేత కార్మికునిగా పనిచేస్తున్నాడు. లోకేష్ ఇంటర్ పూర్తిచేసి ఇంటి పట్టునే ఉంటూ ఉపాధికోసం టేకులపాళ్యం–మదనపల్లె మధ్య షేర్ ఆటో నడుపుతున్నాడు. అడపాదడపా వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు లోకేష్ చేదోడువాదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ వివాహితతో రెండేళ్ల క్రితం లోకేష్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమె తరఫు బంధువులు లోకేష్, ఆదెమ్మ, దివాకర్లపై దాడికి పాల్పడ్డారు. వీరు కూడా వారిపై ఎదురు దాడి చేయడంతో ప్రత్యర్థులైన గంగులప్ప వర్గీయులు గాయపడ్డారు. గాయపడిన వారి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టులో కేసు విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువుకావడంతో ఈ ఏడాది జూన్ 31న రెండు నెలల సాధారణ జైలుశిక్ష లేదా అపరాధం రూ.3 వేలు చెల్లించాలని స్థానిక కోర్టు తీర్పు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అపరాధం చెల్లించి బయట కొచ్చిన లోకేష్ రెండు నెలలుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తాను నిద్రిస్తున్న గదిలో లోకేష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నేలపై ఉన్న పరుపు మీదనే నిద్రలో ఉండగా కాలి మాడిపోయాడు. పక్క గదిలో ఉన్న తల్లిదండ్రులు పొగలు వస్తుండడం చూసి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు బయటకు రాకుండా తలుపునకు ఉన్న చిలుకు గడి పెట్టడంతో గట్టిగా కేకలు వేశారు. స్థానికులు వచ్చి తలుపులు తీశారు. బిడ్డ లోకేష్ ఉంటున్న గదిలో అప్పటికే పొగలు కమ్ముకోవడం, లోకేష్ శరీరం పూర్తిగా కాలి మృతి చెందడం చూసి హతాశులయ్యారు. ప్రత్యర్థులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ వెంకటేశులు, ఎస్ఐ హరిహరప్రసాద్లు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, ట్రాన్స్కో అధికారులను పిలిపించి ఘటనపై క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువకుడిది హత్యా..? లేక ప్రమాదమా..? పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
‘సరిగ్గా అప్పుడు నేను బాత్ రూంలో ఉన్నా’
నానింగ్ : సాధారణంగా ఇల్లు తగలబడితే ఎవరైనా తీవ్ర విషాదంలోకి వెళతారు. కంగారెత్తిపోయి ఏం చేయాలో పాలుపోక ముఖంలో చిరునవ్వు మాయమై దుఃఖాన్ని వేలాడేసుకొని కనిపిస్తారు. కానీ, చైనాలో ఓ జంట మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తగలబడిన తమ ఇంట్లో నిల్చొని సెల్ఫీలతో పోటీ పడ్డారు. పదుల సంఖ్యలో హాయిగా నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకున్నారు. వీడియోలు కూడా రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ‘నేనప్పుడు సరిగ్గా బాత్ రూమ్లో ఉన్నాను. ఏదో కాలుతున్న వాసన వచ్చింది. డోర్ తీసేవరకు పెద్ద మంటలు కనిపించాయి. ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించిందని, వస్తువులన్నీ కాలిపోతున్నాయని అర్ధమైంది. నేరుగా వెళ్లి గర్ల్ఫ్రెండ్ను నిద్ర లేపాను. వెంటనే ఇద్దరం కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాము. చుట్టుపక్కల వారు వచ్చి కూడా మంటలు ఆపేశారు’ అని జాంగ్ చెంగ్ అనే వ్యక్తి తెలిపాడు. ఆ రోజు వాళ్లిద్దరు ఇంట్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారంట. అయితే, మంటలు ఆరిపోయిన తర్వాత వాటిని శుభ్రం చేయడం మానేసి నేరుగా సెల్ఫీ దిగే పనులు మొదలుపెట్టి వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. జరిగిన నష్టాన్ని చూసి తాము కుంగిపోలేదని, ఇది తమ సానూకూల స్వభావానికి నిదర్శనం అంటూ వారు ఆ సెల్ఫీలతోపాటు చెప్పుకొచ్చారు. -
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
ఆదిలాబాద్ క్రైం : ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్నగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. భీంరావు నార్వేడే బుధవారం తన కుటుంబ సభ్యులతో ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు ఉదయం వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో షార్ట్సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భీంరావుకు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ చేరుకునేలోపే స్థానికులు మంటలు ఆర్పేశారు. భీంరావు ఇంటికి వచ్చే సరికి పూర్తిగా ఇల్లు దగ్ధమైంది. ఇంటిపై కప్పుతో పాటు ఇంట్లోని టీవీ, బీరువా, అందులోని రూ. 1200 నగదుతో పాటు, ముఖ్యమైన దస్తావేజులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వార్డు కౌన్సిలర్ విజయ్ వారిని పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని విజయ్ పేర్కొన్నారు.