breaking news
Hit Combination
-
లతాజీ పక్కన ఆ ఫీట్ ఒక్క బాలు వల్లే సాధ్యమైంది
‘మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై..’(గాత్రమే నా గుర్తింపు) లతా మంగేష్కర్ ఓ గొప్ప గాయని. ఆ గొప్పను ఆమె అస్సలు ఒప్పుకోరు. కానీ, ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. ఈ విషయం మాత్రం ఆమె కూడా ఒప్పుకుని తీరతారు. ఎందుకంటే.. ఒక పాట బాగా రావడానికి ఆమె ఎన్నిసార్లైనా సాధన చేస్తారట. వయసులో ఉన్నప్పుడు పాత తరం ఆర్టిస్టుల గొంతుకు తగ్గట్లే కాదు.. 60వ వడిలో మాధురి, కాజోల్ లాంటి యంగ్ ఆర్టిస్టులకూ ఆమె గాత్రం సూటయ్యేలా సాధన చేసేవారామే. రంగ్ దే బసంతిలో ‘లుకా చుప్పి’ పాట కోసం.. నాలుగు రోజులు సాధన చేశారంటే ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి పర్ఫెక్షనిస్ట్ నుంచి మెప్పు పొందడం అంటే.. మాటలా? దిలీప్ కుమార్ ఒకసారి ఆమె పాడే విధానం మీద కామెంట్ చేశారు. దీంతో కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా.. తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. మొండివాళ్లే. దక్షిణాది గాయకుల్లో ఎంతో మంది ఆమె పక్కన పాడినా.. సక్సెస్తోపాటు ఆమెతో ‘వాహ్.. శెభాష్’ అనిపించుకున్న ఏకైక సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ప్రోత్సహాంతో ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. అలాగే తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఒకరు గానగాంధర్వుడు.. మరొకరు గాన కోకిల.. వీళ్ల కాంబినేషన్ సూపర్హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. లతా మంగేష్కర్ పక్కన గోల్డెన్ పిరియడ్లో రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండులు ఆలపించారు. కానీ, బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్ ఎనర్జీ, జోష్తో పాడడం గమనించొచ్చు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కానీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారట. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్లకు తప్పలేదు. ఎప్పుడైతే బాలు పాట విన్నారో.. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతాజీ చాలా కంగారు పడటం, ‘వద్దు నాన్నా..’ అంటూ ఆమె వారించడం గురించి స్వయంగా బాలూనే పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అంతేకాదు.. హైదరాబాద్లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్గా నిలిచింది. యూత్ మెచ్చిన పాటలు.. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్గా నిలిపాయి. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ రికార్డింగ్ సమయంలో వీళ్ల అల్లరి మామూలుగా ఉండేది కాదట. హమ్ ఆప్ కే హై కౌన్ అని లతా నోటి నుంచి రాగానే.. తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని బాలు అల్లరి చేసేవాడట. ఆమె పాడటం ఆపేసి– ‘‘చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోతో ఏమో ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలుచుకునేవారు. ఆ మధ్య లతా చనిపోయారనే పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని ఖండిస్తూ బాలూ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన మరణవార్తను ముందుగా లతా వినాల్సి వచ్చింది. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హఠాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’.. బాలూ మరణవార్త విని లతాజీ స్పందన. ఆమె తెలుగులో మొదట ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా.. అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కానీ బాలూ అదృష్టం వేరు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ల అభిమానులకు మిగిలిన మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ, వెబ్ డెస్క్ -
హిట్ కాంబినేషన్ రిపీట్
తమిళంలో హీరో విజయ్– హీరోయిన్ కాజల్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరూ గతంలో ‘తుపాకీ’, ‘జిల్లా’, ‘మెర్సల్’ సినిమాల్లో కలసి నటించారు. తాజాగా ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరో సినిమాలో నటించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం విజయ్ – మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. 2012లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’కి ఇది సీక్వెల్ అని సమాచారం. ‘తుపాకీ’లో నటించిన కాజల్నే కథానాయికగా తీసుకుంటే బాగుంటుందని మురుగదాస్ భావించారట. సన్ నెట్వర్క్ నిర్మించనున్న ఈ సినిమా విజయ్ కెరీర్లో 65వ సినిమా. -
మణిరత్నం దర్శకత్వంలో మాధవన్?
తమిళసినిమా: మణిరత్నం దర్శకత్వంలో నటుడు మాధవన్ నటించనున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. మణిరత్నం, మాధవన్లది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులకు అనుభూతిని కలిగించాయి. మణిరత్నం దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ స్టార్ రామ్చరణ్ తేజ, మాలీవుడ్ నటుడు ఫాహిద్ ఫాజిల్ కలిసి నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో మాధవన్ను తన చిత్రంలో నటింపజేసే ప్రయత్నంలో మణిరత్నం ఉన్నట్లు సమాచారం. మణిరత్నం తన తాజా చిత్రంలో మాధవన్ను నటింపజేయాలనుకుంటున్నారా, ఆ తరువాత చిత్రం గురించి చర్చలు జరుపుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. విక్రమ్ వేదా చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న మాధవన్ ప్రస్తుతం ఒక తమిళ హిందీ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. -
రిపీట్ అవుతోన్న హిట్ కాంబినేషన్
నారా రోహిత్, శ్రీ విష్ణులది హిట్ కాంబినేషన్.. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇటీవల ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే మరోసారి ఈ హిట్ కాంబినేషన్ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు అసోసియేట్గా పనిచేసిన ఇంద్రసేనను దర్శకుడిగా పరిచయంచేస్తూ నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాను మే రెండో వారంలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో కనిపించనుంది. మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్కు జ్యోతిలక్ష్మి ఫేం సత్యదేవ్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం నారా రోహిత్, శ్రీ విష్ణులు చేస్తున్న ప్రాజెక్ట్స్తో పాటు ఈ సినిమాను కూడా ఒకసారి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.