ఇద్దరూ ఇద్దరే! గానమే వీళ్ల గుర్తింపు.. లతాజీ పక్కన ఆ ఫీట్‌ ఒక్క బాలు వల్లే అయ్యింది

RIP Lata Mangeskar: Special Bond With SP Balu - Sakshi

‘మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై..’(గాత్రమే నా గుర్తింపు) లతా మంగేష్కర్‌ ఓ గొప్ప గాయని. ఆ గొప్పను ఆమె అస్సలు ఒప్పుకోరు. కానీ, ఆమె ఒక పర్‌ఫెక్షనిస్ట్‌. ఈ విషయం మాత్రం ఆమె కూడా ఒప్పుకుని తీరతారు. ఎందుకంటే.. ఒక పాట బాగా రావడానికి ఆమె ఎన్నిసార్లైనా సాధన చేస్తారట. వయసులో ఉన్నప్పుడు పాత తరం ఆర్టిస్టుల గొంతుకు తగ్గట్లే కాదు.. 60వ వడిలో మాధురి, కాజోల్‌ లాంటి యంగ్‌ ఆర్టిస్టులకూ ఆమె గాత్రం సూటయ్యేలా సాధన చేసేవారామే. రంగ్‌ దే బసంతిలో ‘లుకా చుప్పి’ పాట కోసం.. నాలుగు రోజులు సాధన చేశారంటే ఆమె డెడికేషన్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి పర్‌ఫెక్షనిస్ట్‌ నుంచి మెప్పు పొందడం అంటే.. మాటలా?

దిలీప్‌ కుమార్‌ ఒకసారి ఆమె పాడే విధానం మీద కామెంట్‌ చేశారు.  దీంతో కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్‌ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా.. తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. మొండివాళ్లే. దక్షిణాది గాయకుల్లో ఎంతో మంది ఆమె పక్కన పాడినా.. సక్సెస్‌తోపాటు ఆమెతో ‘వాహ్‌.. శెభాష్‌’ అనిపించుకున్న ఏకైక సింగర్‌ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే.

లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్‌ ప్రోత్సహాంతో ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. అలాగే తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఒకరు గానగాంధర్వుడు.. మరొకరు గాన కోకిల.. వీళ్ల కాంబినేషన్‌ సూపర్‌హిట్‌. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు.

లతా మంగేష్కర్‌ పక్కన గోల్డెన్‌ పిరియడ్‌లో రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండులు ఆలపించారు. కానీ, బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్‌ ఎనర్జీ, జోష్‌తో పాడడం గమనించొచ్చు. 

తెలుగులో హిట్‌ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్‌ హిందీలో ‘ఏక్‌ దూజే కే లియే’ (1981)గా రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్‌ కోరారు. దీనికి లతా మంగేష్కర్‌ అభ్యంతరం చెప్పలేదు కానీ, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ కొంత నసిగారట. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్‌ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్‌. ఇక లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌లకు తప్పలేదు. ఎప్పుడైతే బాలు పాట విన్నారో..  ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌. 

గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతాజీ చాలా కంగారు పడటం, ‘వద్దు నాన్నా..’ అంటూ ఆమె వారించడం గురించి స్వయంగా బాలూనే పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్‌ వచ్చారు. 

‘ఏక్‌ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్‌ మే’ పాట డ్యూయెట్‌గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్‌ బనే తుమ్‌ బనే’, ‘హమ్‌ తుమ్‌ దోనో జబ్‌ మిల్‌ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్‌. ఈ సినిమాకు బాలూకి నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. ఆ తర్వాత రమేష్‌ సిప్పీ తీసిన ‘సాగర్‌’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్‌ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్‌ ‘మైనే ప్యార్‌ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్‌ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది.

యూత్‌ మెచ్చిన పాటలు..
కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్‌ దీవానా’, ‘ఆజా షామ్‌ హోనే ఆయీ’, ‘కబూతర్‌ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్‌ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్‌ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్‌ కా జాదు హై మిత్‌వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి.

‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’ రికార్డింగ్‌ సమయంలో వీళ్ల అల్లరి మామూలుగా ఉండేది కాదట. హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌ అని లతా నోటి నుంచి రాగానే.. తర్వాతి లైన్‌ పాడకుండా ‘మై ఆప్‌ కా బేటా హూ’ అని బాలు అల్లరి చేసేవాడట. ఆమె పాడటం ఆపేసి– ‘‘చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోతో ఏమో ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలుచుకునేవారు. 

ఆ మధ్య లతా చనిపోయారనే పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని ఖండిస్తూ బాలూ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన మరణవార్తను ముందుగా లతా వినాల్సి వచ్చింది. 

‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హఠాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్‌ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్‌ కన్సర్ట్‌లలో పాల్గొన్నాను. స్టేజ్‌ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’.. బాలూ మరణవార్త విని లతాజీ స్పందన.

ఆమె తెలుగులో మొదట ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా..  అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కానీ బాలూ అదృష్టం వేరు.  తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్‌ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్‌ డ్యూయెట్‌ పాడారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ల అభిమానులకు మిగిలిన మధుర జ్ఞాపకాలు.

– సాక్షి ఫ్యామిలీ, వెబ్‌ డెస్క్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top